chimni bai | ‘మా ఊరికి పిల్లనిస్తలేరు సారూ!’ ఓ గిరిజన తల్లి ఆవేదన. పక్షం రోజులకే ఆమెకు సంతోషం కలిగింది. ఆరేండ్లు గడిచినా ఆ తల్లి ఆనందం అలాగే ఉంది. తెలంగాణ సర్కార్ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇటీవల నారాయణఖేడ్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన కూర్చున్న గిరిజన మహిళ ఎవరంటూ? సెర్చింగులు మొదలయ్యాయి. ఆ గిరిజన మహిళ పేరు చిమ్నిబాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్తండాకు చెందిన ఆమె ఇప్పుడు సెలబ్రిటీ.
2016.. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్న సందర్భం. ప్రచారంలో భాగంగా సర్దార్ తండాకు వచ్చారు మంత్రి హరీశ్రావు. స్థానికులతో మాట్లాడుతున్నారు. ఇంతలో ఓ ఆడకూతురు ‘మా తండాకెవరూ పిల్లనిస్తలేరు సారు’ అన్నది. ఆమె వంక తిరిగి ‘ఎందుకమ్మా? సమస్యేంటి?’ అని అడిగారు హరీశ్రావు. ‘మా తండాల త్రీఫేజ్ కరెంట్ లేదు. ఈడ బతకాల్నంటే.. నెత్తిన బిందెలు పెట్టుకొని మూడు కిలోమీటర్లు నీళ్లు మోయాలె. గిసొంటి తండాకు పిల్లను ఎవరు ఇస్తరు సారూ! మొగపిల్లల పెండ్లి చాన కష్టమైతాంది’ అని ఆవేదన వెలిబుచ్చింది.
‘నీ పేరు ఏందమ్మా?’ అడిగారు మంత్రి.
‘చిమ్నిబాయి’ అని చెప్పిందామె.
‘పక్షం రోజుల్లో తండాకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తం. మిషన్ భగీరథ నీళ్లిస్తం’ అని మంత్రి ఆమెకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రెండు వారాల్లో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేశారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చారు.
చిమ్నిబాయి తండా కష్టం చెప్పుకొన్నప్పుడు.. ‘ఈమెకు నోరు ఆగదు’ అనుకున్నారు కొందరు. కానీ, ఆమె మాట తమ తండా రాత మార్చడంతో చిమ్నిబాయిని పొగడ్తలతో ముంచెత్తారు. తర్వాత కూడా తండా అభివృద్ధిలో ఆమె కీలకంగా వ్యవహరించింది. అప్పటి వరకూ ఓ మారుమూల తండాలో భర్త, తన ఆరుగురు పిల్లలతో పొలాన్ని సాగు చేసుకోవడం, పశువులను సాదడం మాత్రమే ఆమెకు తెలిసిన జీవితం. ఈ సంఘటన తర్వాత.. చిమ్నిబాయి సర్దార్ తండావాసుల ప్రతినిధిగా మారింది.
ఆరేండ్ల తర్వాత..
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఇటీవల నారాయణఖేడ్లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చిమ్నిబాయి పేరు మళ్లీ మార్మోగింది. సభలో మంత్రి హరీశ్రావు ఆరేండ్ల కిందట సర్దార్తండాలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. చిమ్నిబాయి గురించి అడిగారు. ఆమె సభలోనే ఉండటంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికపైకి పిలిచి చిమ్నిబాయిని పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆమె యోగక్షేమాలు, కుటుంబం గురించి ఆరాతీశారు. తన దృష్టికి చిమ్నిబాయి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
గతంలో బోర్గి పంచాయతీ పరిధిలో ఉన్న సర్దార్తండా ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటైంది. తమకు ఏ ఇబ్బంది వచ్చినా చిమ్నిబాయికి విన్నవించుకుంటారు సర్దార్తండా వాసులు. ఆ సమస్యను మంత్రి హరీశ్రావుతోపాటు జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్తుంది చిమ్నిబాయి. ఆమె అభ్యర్థనతో తండాలో రూ.20 లక్షల నిధులతో ఎస్టీ కమ్యూనిటీ భవనాన్ని, రూ.15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మించారు. తండాలో అనారోగ్యం బారిన పడిన వారికి సీఎం సహాయనిధి అందేలా కృషి చేస్తున్న చిమ్నిబాయి అంటే అందరికీ అభిమానం.
నా జిందగీల కేసీఆర్ సార్ను, హరీశ్రావు సార్ను మరువ. కేసీఆర్ సార్ దేవుడు. నన్ను పక్కన కూసోబెట్టుకుని ఒక బిడ్డలెక్క నా పేరు, కుటుంబం గురించి అడిగిండు. ఇంకేమన్నా
సమస్యలు ఉన్నయా అన్నడు. మా తండా నుంచి సముందర్ తండా, ఎడ్లరేగడి తండాలకు పోనికి రోడ్ కావాలన్నా. అది కూడా చేస్తా అన్నడు. నాకు ఏ సమస్య వచ్చినా మంత్రి హరీశ్రావు సార్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సార్, ఎంపీ బీబీ పాటిల్ సార్కు ఫోన్ చేస్తా.. నాకు తండ్రి, అన్నదమ్ములు అంతా వాళ్లే.
– చిమ్నిబాయి
– శ్రీకాంత్ కులకర్ణి
ఒక్క ఏడాదిలోనే 200 కోట్లు సంపాదించిన 8 ఏండ్ల చిన్నారి”
నాసాలో జాబ్ వదిలేసి.. రైతుల కోసం కష్టపడుతున్నడు”
“Bhavana Lasya | ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు, వీడియోల ద్వారా యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది”
అమెరికాలో జాబ్ వదిలేసొచ్చి.. సొంతూళ్లో లైబ్రరీ స్టార్ట్ చేసిండు”