పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. అందులో తమవంతు భాగంగా హైదరాబాదీ రెస్టారెంట్లు వండివార్చడం నుంచి వడ్డించేవరకూ రకరకాల అంచెల్లో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. సాధారణంగా రెస్టారెంట్ నుంచి ఫుడ్ పార్సిళ్లన్నీ ప్లాస్టిక్ డబ్బాలూ, కవర్లలోనే వెళ్తాయి. కానీ, ‘టెర్రసెన్ కేఫ్’ మాత్రం పార్సిళ్ల కోసం గాజు వస్తువులూ, కాగితం కవర్లను వాడుతున్నది. బిర్యానీలయితే మట్టి కుండల్లో పంపుతున్నది.
ఈ కేఫ్ నిర్మాణం కోసం వాడిన కిటికీలు, తలుపులు.. శిథిల భవనాల నుంచి తెచ్చినవే. ‘అన్న నేటివ్’ రెస్టారెంట్ అయితే ఆహారాన్ని వడ్డించడానికి అరటి ఆకులు, మట్టి పాత్రలు, వెదురు బుట్టలనే వాడుతున్నది. ఇక ఫైవ్ స్టార్ హోటల్ ‘పార్క్ హయత్’ పానీయాలు తాగడానికి తాటాకుల స్ట్రాలనే వినియోగిస్తున్నది. పునర్వినియోగానికి వీలుపడే పార్సిల్ ప్యాకింగ్ చేస్తున్నది. ‘అర్బన్ బీ’ పేరుతో తేనెను తమ హోటల్ పరిసరాల్లోనే తయారు చేయాలనుకుంటున్నామనీ, ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామనీ అక్కడి షెఫ్ చెప్పారు.