భారతీయుల ఆహారంలో నెయ్యి ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. వేదకాలం నుంచే నెయ్యి ఆహారపరంగా, ఆరాధనపరంగా, ఔషధంగా ప్రాశస్త్యం దక్కించుకుంది. ఆహారపరంగా చూస్తే నెయ్యి నుంచి శరీరానికి అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు, వివిధ విటమిన్లు, క్యాల్షియం, వివిధ ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి.
గ్లాసు పాలలో పసుపు, మిరియాలతోపాటు, చెంచా నెయ్యిని కలుపుకొని తాగితే జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన విషాలు తొలగిపోతాయి. నెయ్యి మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీవనక్రియలను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అంతేకాదు, పేగుల్లోని బ్యాక్టీరియాకు నెయ్యి ప్రొబయోటిక్ ఫుడ్గా దోహదపడుతుంది. నెయ్యిలో ఉండే కె2 విటమిన్ ఎముకలు క్యాల్షియంను గ్రహించడంలో సాయపడుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. పసుపు, మిరియాలతో కలిపి తీసుకుంటే నెయ్యి వాతాన్ని, ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో నిద్ర బాగా పడుతుంది. చర్మానికి నిగారింపూ వస్తుంది. నెయ్యిలో ఉండే సిఎల్ఎ.. గడ్డలను, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను స్థిరీకరిస్తుంది. ఆకలిని ఉత్తేజపరుస్తుంది. అయితే మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, హృద్రోగులు, పీసీఓఎస్ బాధితులు నెయ్యి పరిమాణం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లెవరైనా సరే రోజుకు 3, 4 చెంచాల నెయ్యిని నిరభ్యంతరంగా వడ్డించుకోవచ్చు.