స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా యావత్ భారతం అమృతోత్సవ సంబరాలు జరుపుకొంటున్నది. అవనికి అమృతత్వాన్ని ప్రసాదించడానికి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా దేశంలో 75 నదుల పునరుజ్జీవం, 75 లక్షల మొక్కలు నాటడం, 75 శిక్షణ కేంద్రాలు నెలకొల్పడం, దేశ సరిహద్దుల్లో 75 పాఠశాలలకు సౌరవిద్యుత్ అందించడం, 75 డిజిటల్ అక్షరాస్యత కేంద్రాలు స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గాలి, నీరు, భూమిని స్వచ్ఛంగా ఉంచడానికి అందరం సంకల్పం తీసుకోవాలని అంటున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. 75 నదుల పునరుద్ధరణ బాధ్యతలో భాగంగా.. ఇప్పటికే ఐదు రాష్ర్టాల్లో 49 నదులపై 41,000 నిర్మాణాలు చేపట్టి జలాలకు జీవం పోస్తున్నది. అంతేకాదు, దేశవ్యాప్తంగా 22 జైళ్లలో 55 శిక్షణ కేంద్రాలను నెలకొల్పింది. 20 సరిహద్దు పాఠశాలలు సహా మొత్తం 145 పాఠశాలలకు సౌర విద్యుత్తును అందించింది. ప్రభుత్వ, ప్రైవేట్, సామాజిక సేవా సంస్థల భాగస్వామ్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ కార్యక్రమాలను చేపడుతున్నది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సంస్థ వలంటీర్లు కోట్ల కొద్దీ మొక్కలను నాటి పర్యావరణ హితానికి పాటుపడుతున్నారు.