పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
ఈ నెల నుంచి గ్రీన్ఫండ్ సేకరణ
విద్యార్థి నుంచి ఎంపీ వరకు ప్రతి ఒక్కరి నుంచి వసూలు
సొమ్మును ఎనిమిదో విడుత హరితహారంలో ఖర్చు చేయనున్న అధికారులు
నిరంతరం కొనసాగనున్న ప్రక్రియ
ఇప్పటికే ప్రతి రిజిస్ట్రేషన్ లావాదేవీపై రూ.50 వసూలు
మెదక్ జిల్లాలో వందశాతం లక్ష్యాన్ని చేరేలా ప్రణాళికలు
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఏడు విడుతలు పూర్తవగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ‘గ్రీన్ ఫండ్’ పేరుతో ప్రభుత్వం నిధులను సేకరిస్తున్నది. భావితరాలకు ఆరోగ్య, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు శ్రీకారం చుట్టిన ఈ బృహత్తర యజ్ఞంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ విద్యార్థి స్థాయి నుంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నది. సేకరించిన సొమ్మును జూన్లో చేపట్టనున్న ఎనిమిదో విడుత హరితహారంలో అధికారులు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రక్రియను ఎప్పటికీ కొనసాగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెదక్ జిల్లాలోని 469 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలను పచ్చటి తోరణాలుగా తీర్చిదిద్దేందుకు వందశాతం విజయవంతమయ్యేలా కృషి చేస్తున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, మే 11: రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరుతున్నది. ఏడు సంవత్సరాలుగా జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నాయి. మొక్కలు పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాముల కావాలని ముఖ్యమంత్రి పిలుపునకు స్పందన వస్తున్నది. ఇప్పటికే ఏడు విడతలుగా హరితరాన్ని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటించింది. ఇదే ఒరవడి కొనసాగించేందుకు హరితహారానికి ఆర్థిక స్వాలంబన కల్పించేందుకు హరితనిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హరితహారం లక్ష్యాలను వందశాతం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 1వ తేదీ నుంచి హరితనిధి సేకరణ ప్రారంభమైంది.
పచ్చదనం పెంచేలా..
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలున్నాయి. వాటికి ప్రతి నెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్థిక సంఘం నిధులు ఇస్తున్నది. ఈ నిధులు జిల్లా జనాభా ఆధారంగా జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల ఖాతాల్లో, మున్సిపల్ కమిషనర్లు మున్సిపల్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ నిధుల్లో 10శాతం హరితహారానికి మాత్రమే ఖర్చు చేయాలి. మొక్కలు నాటడం, ట్రీ గార్డులు కొనుగోలు చేయడం, మొక్కల పెంపకం వంటి వాటికోసం మాత్రమే ఖర్చు చేయాలి.
పాఠశాలలు, కళాశాలల్లో..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు పొందే పాఠశాల విద్యార్థి రూ.10, ఇంటర్మీడియట్ విద్యార్థి రూ.15, డిగ్రీ విద్యార్థి నుంచి రూ.25 వసూలు చేసి యాజమాన్యాలు హరితనిధికి జమ చేయాలి. మే నెల నుంచి ప్రారంభమైన హరిత నిధి సొమ్మును జూన్లో జరిగే హరితహారం కార్యక్రమానికి వినియోగించనున్నారు. ఇప్పటికే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న ఒక్కో లావాదేవీకి వినియోగదారులు రూ.50 చొప్పున హరితనిధికి చెల్లిస్తున్నారు. హరితనిధి సేకరణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఎంపీ స్థాయి నుంచి గ్రామ స్థాయిలో సర్పంచ్ వరకు, కలెక్టర్ నుంచి చిరుద్యోగి వరకు నెలవారీ వేతనం నుంచి హరితనిధి కోసం కొంత సొమ్మును సేకరిస్తున్నది.
నిధుల సేకరణ ఇలా..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు వారి గౌరవ వేతనంలో ఏడాదికి రూ.6 వేలు, ఆలిండియా సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులు, చైర్మన్లు రూ.1,200, మున్సిపల్ చైర్మన్లు రూ.600, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు రూ.120 చొప్పున హరితనిధిలో జమ చేయాల్సి ఉంది. గ్రామాభివృద్ధి, పట్టాణాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించే నిధులులో పది శాతం, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులు నుంచి పది శాతం జమ చేయాల్సి ఉంది. కొత్తగా వ్యాపారం చేయడానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలనుకున్నా, ఉన్న లైసెన్స్ను రెన్యువల్ చేసుకోవాలనుకున్నా రూ.వెయ్యి హరితనిధి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిధిలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాల్లో ప్రతి సంవత్సరం రూ.300 చొప్పున జమ చేయాల్సి ఉంది. ఇంజినీరింగ్ విభాగంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు సమయంలో 0.01 శాతం, తహసీల్ కార్యాలయంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి రిజిస్ట్రేషన్పై రూ.50 చొప్పున అదనంగా హరితనిధికి చెల్లించాల్సి ఉంటుంది.