వరాలిచ్చే తల్లి వరలక్ష్మి. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరిస్తారు అతివలు. ముత్తయిదువులను పిలిచి వాయినాలు ఇస్తారు. పసుపు, కుంకుమలు చెల్లిస్తారు. వ్రత విధానంలో నైవేద్యాలకూ ప్రధాన పాత్ర ఉంది. సిరిసంపదలు కురిపించే లక్ష్మీదేవికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఇవి. వీటిని శుచిగా వండి నైవేద్యం సమర్పిద్దాం.
పూర్ణం బూరెలు
కావలసిన పదార్థాలు: శనగపప్పు: ఒక కప్పు, బెల్లం: ఒక కప్పు, మినప్పప్పు: అరకప్పు, బియ్యం: రెండు కప్పులు, యాలకుల పొడి: ఒక టీస్పూన్, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం: ముందుగా బియ్యం, మినప్పప్పుని మూడు గంటలపాటు నానబెట్టి చిటికెడు ఉప్పు వేసి దోశలపిండిలా జారుగా రుబ్బుకోవాలి. శనగపప్పుని కడిగి ఓ గంటపాటు నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసుకొని శనగపప్పును మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. స్టవ్మీద మందపాటి గిన్నె పెట్టుకుని తరిగిన బెల్లం వేసి పావుకప్పు నీళ్లుపోసి పాకం వచ్చాక మెదిపిన శనగపప్పు మిశ్రమం, యాలకులపొడి, నెయ్యి వేసి బాగా దగ్గర పడేవరకు కలపాలి. గట్టిపడిన పూర్ణాన్ని చిన్నచిన్న ఉండలు చేసుకుంటూ ముందుగా పట్టి పెట్టుకున్న పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించుకుంటే పూర్ణం బూరెలు సిద్ధం.
రవ్వప్పాలు
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ: ఒక కప్పు, బెల్లం: అరకప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, గోధుమ పిండి: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: సరిపడా
తయారీ విధానం: ముందుగా రవ్వను రెండు నిమిషాలపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్మీద పాన్పెట్టి వేడయ్యాక బెల్లం వేసి రెండు కప్పుల నీళ్లుపోసి మరగనివ్వాలి. బెల్లం కరిగి పాకం మరుగుతుంటే వేయించిన రవ్వ, గోధుమ పిండి, యాలకుల పొడి వేసి దగ్గరికి వచ్చేవరకు కలిపి, స్టవ్ నుంచి దింపి చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమంలో నెయ్యి వేసి బాగా కలుపుకొని చిన్నచిన్న ఉండల్లా చేసి అప్పాల్లా ఒత్తుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఒత్తుకున్న అప్పాలను వేసి దోరగా కాల్చుకోవాలి.
పెసర పొంగలి
కావలసిన పదార్థాలు: బియ్యం: ఒక కప్పు, పెసర పప్పు: అర కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు: పావు కప్పు, మిరియాలు: ఒక టీస్పూన్, ఆవాలు: అర టీస్పూన్, జీలకర్ర: అర టీస్పూన్, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్నముక్క, ఎండు మిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెమ్మలు, ఉప్పు: తగినంత
తయారీ విధానం: ముందుగా బియ్యం కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. స్టవ్మీద పాన్పెట్టి పెసరపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో బియ్యం, పెసరపప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి ఆరు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన మిశ్రమాన్ని గరిటెతో బాగా మెదుపుకోవాలి. స్టవ్మీద పాన్పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి అన్నిటినీ వేయించి అన్నం మిశ్రమంలో వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.