Folk Singer Srilatha | ఆమె టీచర్. విద్యార్థులూ పాఠాలే ప్రపంచం. అలా ఏండ్లు గడిచిపోయాయి. చెప్పిందే చెప్పడం, అడిగిందే అడగడం. పిల్లల్లో ఉల్లాసాన్ని నింపేందుకు ఇంకేమైనా చేయాలనేది ఆమె తపన. అందుకు జానపదాలను ఎంచుకున్నది. తరగతి గదిలో పాఠాలతో పాటు పాటలు కూడా నేర్పిస్తూ యూట్యూబ్లో పల్లె పాటలకు చిరునామాగా మారిన బండి శ్రీలత పాటల ముచ్చట..
మాది జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ). అమ్మ ఐలమ్మ. బాపు బుచ్చయ్య. ఇద్దరూ మంచి పాటగాళ్లే. అమ్మాబాపుతో కలిసి రోజూ బాయికాడికి వెళ్లేదాన్ని. అమ్మ తీరొక్క పాటలు వినిపిస్తుండె. అమ్మ పాడుతుంటే బాపు ‘ఆ పాట అట్ల కాదు.. ఇట్ల పాడాలె’ అని అందుకుంటుండె. అట్లా నాకు చదువు కంటే ముందే పల్లె పదాలు అబ్బినయి. మేం నలుగురం ఆడపిల్లలం. మాకొక తమ్ముడు. ఇంట్లో అందరికీ పాటలంటే ఇష్టం. నాకు మాత్రం ప్రాణం. చిన్నతనంలోనే వాటికి కనెక్ట్ అయిన. చదువుతో సమానంగా జానపదాలకు ప్రాధాన్యం ఇచ్చిన. అందుకే నన్ను అందరూ పాటల శ్రీలత అనే పిలుస్తుండె.
మా ఇంట్లో రేడియో ఉండేది. పొద్దున లేవగానే ‘ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం’ అనే పిలుపు కోసం ఎదురుచూసేవాళ్లం. మా బాపు రేడియోను ఆస్తిగా భావిస్తుండె. ఆ పాటలను పాడుకుంటూ పొద్దంతా పనిచేస్తుండె. ఒకవైపు అమ్మ, బాపు దగ్గర నేర్చుకున్న అచ్చమైన పల్లె పాటలు.. మరోవైపు రేడియోలో వచ్చే సినిమా జానపదాలు. రెండిటినీ మిక్స్ చేస్తూ కొత్తగా పాటలు అల్లేదాన్ని. జానపదాల అన్వేషణ, సేకరణ, తిరగరాయడం చిన్న వయసులోనే నా అభిరుచిగా మారాయి.
ఒకసారి అమ్మతో కలిసి బాయికాడికి పోయిన. మిరప విత్తనాలు వేస్తున్నాం. అంతలోనే మబ్బులు పట్టినయి. నాకేమో తడుస్తమేమో అని భయమేసింది. వాన పరవశానికి అమ్మ
‘కొండాలోలె మబ్బులొచ్చె కుండా కడగా నీళ్లు లేవు’.. అనే పాట అందుకున్నది. చాలా సంబురమనిపించింది. వర్షం వస్తుందనే దిగులు తొలగిపోయి, ఆ జల్లులను ఎలా ఆస్వాదించాలో నేర్చుకున్న. అలా పాటలతో, ఆటలతో సాగిపోతున్న నా జీవితంలో పెండ్లి ప్రస్తావన వచ్చింది. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్న. కుటుంబ పరిస్థితుల కారణంగా పెండ్లికి తలొగ్గాల్సి వచ్చింది. తర్వాత కూడా ఓపెన్లో డిగ్రీ వరకు చదువుకున్న. ఓ స్కూల్లో తెలుగు టీచర్గా చేరిన. సంస్కృతి, సంప్రదాయాలు, కళలతో అనుబంధం ఉన్న అంశం కావడంతో జానపదం జోడించి.. పిల్లలకు కళాత్మకంగా పాఠాలు చెప్పడం అలవాటు చేసుకున్న. చిన్నప్పుడే పాటలు అల్లిన అనుభవం ఉండటంతో.. నేను రాయడమూ మొదలుపెట్టిన. అట్లా రాసినవాటిల్లో ‘కాపోల్లింటికాడ కాముడాటలట’, ‘అల్లా నేరడి పండ్లు గుల్లాల వేసుకొని’.. లాంటివి అనేకం.
యూట్యూబ్లో జానపదాలు వింటుంటే.. అన్నీ చిన్నప్పుడు పాడుకున్నవే, నేనెందుకు పాడకూడదు అనిపించింది. ఎంతో ప్రయత్నించిన. చాలా మందిని కలిసిన. చివరిగా ఎంవీ మ్యూజిక్ మల్లిక్ తేజన్నకు ఓ పాటను వినిపించిన. అన్నకు నా పాట, నేను పాడే విధానం నచ్చి, చిన్మయి చానెల్లో ‘రూపాయున్నది’.. పాడించిండు. నా గొంతు నచ్చడంతో ‘కొండాలోలె మబ్బూలొచ్చె’ పాటకూ అవకాశం ఇచ్చిండు. ఈ పాట విన్న మానుకోట ప్రసాదన్న ‘తాటియ్యెపువ్వుల సెండటేదునా దండిటేదునా’ అనే పాట పాడించిండు. ఇది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ పాట రికార్డింగ్ సమయంలో మా ఫ్రెండ్కు ‘నివృత్తి వైబ్స్’ చానెల్ నుంచి కాల్ వస్తే వెళ్లినం. అక్కడ నా గురించి కూడా చెప్పి పాట వినిపించిన. బాగుందని ‘ఏమేపిల్లా అంటాంటె ఏదో ఏదో ఐతాందె’ పాట పాడే అవకాశం ఇచ్చిండ్రు. ఇది నన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇదే చానెల్లో మధుప్రియతో కలిసి హోలీ పాట పాడిన. ఆ తర్వాత ‘ఐతారం అంగడిలో’ పాట. అట్లా ఇప్పటివరకు 25కు పైగా జానపదాలు పాడిన. ‘ఎంఎస్ మ్యూజిక్’ చానెల్ పెట్టిన. అమ్మ నేర్పినట్లు సందర్భోచితంగా.. ఎప్పుడు ఎసొంటి పాటలు పాడాల్నో అసొంటి పాటలు విడుదల చేస్త్త. టాలెంట్ ఉన్న కళాకారులకు నా చానెల్ ద్వారా అవకాశాలు కల్పిస్తా.
… దాయి శ్రీశైలం
“ఒక్కసారి ఓడిపోగానే అప్పటిదాకా మెచ్చుకున్నోళ్లే ఇదేనా నీ టాలెంట్ అంటూ ఎగతాళి చేశారు”