Folk singer Divya malika | నానమ్మ తమిళ సంగీతంలో ప్రవీణురాలు. నాన్న కర్ణాటక సంగీతంలో నేర్పరి. అమ్మ, మేనత్తలకు శాస్త్రీయ సంగీతంపై పట్టుంది. సరిగమలతో సావాసం చేస్తున్న కుటుంబంలో పుట్టిందామె. శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉన్నా.. ‘జానపదం’తో దోస్తీ చేసింది. జానపద గీతాల జడివాన కురిపిస్తూనే సినిమా పాటలతో అలరిస్తున్న మేడెపల్లి దివ్యమాలిక పాటల ముచ్చట!
మా నాన్న పేరు రవీంద్ర. మహేంద్ర జనరేటర్స్లో పనిచేస్తాడు. అమ్మ సౌభాగ్యలక్ష్మి. టీచర్గా చేసేది. నా కోసం ఉద్యోగం వదిలేసింది. మా నానమ్మ చెన్నైలో పుట్టి పెరిగింది. తనకు సంగీతంలో చక్కటి ప్రావీణ్యం ఉంది. అలాగే మా మేనత్తలు, అమ్మ కూడా సంగీతజ్ఞులు. వాళ్ల ప్రభావం చిన్నప్పటి నుంచే నాపై ఉండేది.
చిన్నప్పుడు సినిమా పాటలను కూని రాగాలు తీస్తుంటే అమ్మ పరిశీలించింది. వారసత్వంగా వస్తున్న కళను ప్రోత్సహించాలని సంగీతం నేర్పించారు. లలిత సంగీతం రామాచారి గారి దగ్గర నేర్చుకున్నా. కర్ణాటక సంగీతం పార్థసారథిగారి దగ్గర నేర్చుకున్నా. మా నాన్న కూడా గాయకుడు కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన పాటలకు దూరమయ్యారు. దీంతో నన్ను గాయనిగా చూడాలనుకున్నారు. ఇంట్లో అందరికీ సంగీతంలో ప్రవేశం ఉండటంతో మేమంతా ఒకచోట చేరితే సంగీత విభావరి జరిగినట్లే ఉంటుంది. ఇలా చిన్నప్పటి నుంచి పాటల్లో పెరగడంతో చదువు కన్నా సంగీతంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. అమ్మానాన్న నాకు అండగా నిలిచారు. నేనొక్కదాన్నే కావడంతో కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
2010లో ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి ఎంపికయ్యాను. అప్పటివరకు ఎన్నో పాటలు పాడిన నాకు, అంత పెద్ద వేదికపై, అందులోనూ బాలుగారి ముందు పాడాలంటే భయమేసింది. ‘ఇంట్లో అంతమంది సంగీత ప్రావీణ్యులు ఉండి భయపడటమా’ అని నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నా. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దని నిశ్చయించుకున్నా. మొదటగా ‘మనసున మనసుగా నిలిచిన కలవా’ పాట పాడాను. ఈ పాటే నన్ను సెమీఫైనల్ వరకు తీసుకెళ్లింది. అందులో ‘కలికి చిలుకల కొలికి మాకు మేనత్త..’ పాట పాడాను. బాలూ గారి నుంచి ప్రశంసలు, తిట్లూ రెండూ లభించాయి. 2013లో ‘నా పాట స్వరాల సయ్యాట’, 2014లో ‘సూపర్ సింగర్’, 2015లో ‘బోల్బేబీ బోల్’ వంటి రియాలిటీ షోల్లో పాల్గొన్నాను. ఎక్కడికి వెళ్లినా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేదాన్ని.
ప్రతి పోటీలో విజేతగా నిలవలేం కదా. ఫైనల్ వరకు వెళ్లి గెలవలేకపోవడం కొంత నిరుత్సాహాన్ని ఇచ్చింది. అప్పటిదాకా మెచ్చుకున్నవాళ్లు ‘ఇదేనా నీ టాలెంట్’ అనడంతో బాధనిపించి, కొంతకాలం గ్యాప్ తీసుకున్నా. 2018లో నా కెరీర్ మలుపు తిరిగింది. అప్పటివరకు చాలా రియాలిటీ షోలలో పాల్గొన్నప్పటికీ ‘సరిగమప’కు వచ్చేసరికి నా పాటలో పరిణతి కనబడింది. ఇదే కార్యక్రమం కోసం ఒక స్టూడియోలో పాట రికార్డ్ చేశారు. అదే సమయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం కోసం పాట రూపొందిస్తున్న సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి ఆ స్టూడియోవాళ్లు నా పేరును సిఫారసు చేశారు. అలా యూట్యూబ్లో పాడే అవకాశం లభించింది. ‘అడ్డెడు అడ్డేడు మల్లెలో నా తెలంగాణ తల్లికి అల్లిన మాలలో నా తెలంగాణ’ పాట సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలికి, నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ పాటతో తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. కొందరు ‘యూట్యూబ్ ఎందుకు ఎంచుకున్నావ్?’ అన్నారు. వాస్తవానికి యూట్యూబ్ ఎందరికో మంచి జీవితాన్ని ఇచ్చింది. నేనూ నా ప్రతిభను నిరూపించుకోవడానికి యూట్యూబ్ను వారధిగా భావించాను.
జానపద గీతాల్లో జీవం ఉంటుంది. జీవితం ఉంటుంది. మానవ విలువలు, సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. నా అభిరుచికి తగ్గట్టే అవకాశాలు చాలానే వచ్చాయి. ఇప్పటివరకు 50కి పైగా జానపదాలు పాడాను. ఒకరోజు సురేష్ బొబ్బిలి ఫోన్ చేసి ‘దివ్యా.. ఒక పాట పాడాలి వచ్చెయ్’ అన్నారు. నేను వెళ్లి పాడి వచ్చాను. రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ‘రెండు మూడు కరెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి వచ్చి వెళ్లు’ అన్నారు సురేష్. స్టూడియోకి వెళ్లి నేను షాక్ అయ్యాను. నేను పాడింది ‘విరాట పర్వం’ అనే సినిమా పాట అని అప్పుడే తెలిసింది. మొదటి పాటే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్లో అవకాశం రావడం గొప్పగా భావించాను. అమ్మకు చెప్పాక ఆమె కండ్ల నుంచి ఆనందబాష్పాలు రాలాయి. చిన్నప్పటి నుంచి నన్ను నడిపించింది అమ్మే. నా కోసం తనకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తినీ వదిలేసింది. విరాట పర్వంలో నేను పాడిన ‘కోలు కోలో కోలోయమ్మా కొమ్మా చివరన పూలూ పూసే కోలో’ ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. సినిమా విడుదలయ్యాక మరింత ఆదరణ వస్తుందని నమ్ముతున్నా. ప్రస్తుతం మ్యూజిక్ టీచర్గా చేస్తూనే సినిమా పాటలు, జానపదాలు పాడుతున్నా. ఇప్పటివరకు ఐదారు సినిమాలకు పాడాను. మంచి నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం.
ఈ నాలుగేండ్లలో ఎన్నో జానపద గీతాలు పాడాను. ప్రతిదీ విలక్షణమైనదే. ‘కన్నపేగు బంధమో తొమ్మిది నెలలు మోసి కన్నరా’, ‘ఊడలమర్రీ ఉయ్యాల ఆటా ఇయ్యాల ఏమయ్యెనో’, ‘అద్దుమరాతిరి కలవడ్డదో అందాల నా బావ కనవడ్డడో’, ‘ఉంగరమా ఉంగరమా జతముద్దు టుంగరమా’, ‘గుర్తుకొస్తున్నావో బావా నా గుప్పెడంత గుండె కొట్టుకున్నప్పుడల్లా గుర్తుకొస్తున్నావో’, ‘నలనల్ల ర్యాడిలో నడిసేటి బావా నీ మీద మనసుంది నిలవాడు బావా’ పాటలు నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
…? దాయి శ్రీశైలం