Folk Singer Pochampalli Godavari | పాట వాళ్లింటి రెక్కల కష్టం. ఊరి గొప్పదనం ఆమె పాటను నడిపిస్తే.. అమ్మానాన్నల ప్రోత్సాహం పరిణతి చెందిన గాయనిగా మార్చింది. ఆ పాటను పది కాలాలపాటు బతికించాలని తపిస్తున్న పోచంపల్లి గోదావరి పాటల ముచ్చట ఇది.
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్. నాన్న రాజయ్య, అమ్మ రాంబాయి. మేం నలుగురం ఆడపిల్లలం. నేనే చిన్నదాన్ని. మాది పేద కుటుంబం.అందరం ఆడపిల్లలమే. అయినా.. మా అందరినీ చదివించిండు నాన్న. ‘చదువుతోనే మన జీవితాలు బాగుపడతయి’ అని ఎప్పుడూ చెప్తుండె. నాన్నకు ప్రకృతి అంటే ఇష్టం. మాది రజక వృత్తి. నీటితో పెనవేసుకున్న జీవితాలు. రెక్క బలంగా ఉంటేనే రెండు పూటలా అన్నం దొరుకుతుంది. చేసే పనిపై గౌరవంతో, ప్రకృతి మీద భక్తితో నాన్న మాకు జమున, గంగ జ్యోతి, గీత, గోదావరి అని పేర్లు పెట్టిండు. చాకిరేవు జానపదాలకు పుట్టినిల్లు. అట్లా మా నాన్నకు పల్లె పదాలపై ఆసక్తి ఏర్పడింది. అమ్మకు బతుకమ్మ పాటలు, శ్రమజీవుల పాటలు చాలా వస్తయి. ఆ ఇద్దరినీ చూస్తూ, వారి ఆసక్తిని గమనిస్తూ పెరిగిన కాబట్టి నాకు పల్లె పదాలు సహజంగానే అబ్బినయి.
అమ్మ బీడీలు చుట్టే పనికి కూడా వెళ్తుండేది. అక్కడ తీరొక్క పాటలు వినిపిస్తయి. ఆ పాటల్ని ఇంట్లో పాడుతుండేది. వాటిని విని నేనూ పాడుకునేదాన్ని. మా ఊళ్లో ‘భజన మండలి’ ఉండేది. కీర్తనలు, భజనలు పాడుకునేటోళ్లు. మా అక్కలు అక్కడికి వెళ్తుండె. ఒకట్రెండుసార్లు నేనూ వెళ్లిన. నాకూ పాడాలని అనిపించింది. ‘భజన మండలి’ సభ్యులను అడిగితే అవకాశం ఇచ్చిండ్రు. అదే తొలిసారి.. నేను బయట పాడిన సందర్భం. అందరూ మెచ్చుకున్నరు. నాన్న కూడా ‘గోదావరీ నువ్వు ఎప్పటికైనా మంచి సింగర్వి అవుతవ్రా’ అనేటోడు. నాకు మస్తు ఖుషీగ అనిపించేది.
నాకు టీచింగ్ అంటే ఇష్టం. ఎప్పటికైనా ఆ వృత్తిలో స్థిరపడాలనేది నా లక్ష్యం. అందుకే డీఎడ్ చేసిన. కోర్సు తర్వాత ఒక ప్రభుత్వ పాఠశాలలో వలంటీర్గా చేరిన. ‘చదువు ద్వారానే బాగుపడతాం’ అని మా నాన్న చెప్పిన మాటలనే నేను విద్యార్థులకు చెప్తుండేదాన్ని. ఈ క్రమంలో నాకు మా ఊరి గురించి తెలిసింది. చరిత్ర ప్రాధాన్యం కలిగిన గడ్డ మాది. ‘రాచర్ల కోట’కు ఎంతపెద్ద చరిత్ర ఉందో, దాని గొప్పదనం ఏంటో పుస్తకాల్లో చదివితేనే అర్థమైంది. దీంతో మా ఊరి పేరు నిలబెట్టాలన్న పట్టుదల పెరిగింది.
మా ఊరివాళ్లు ‘ఎస్ఎస్ ఆడియోస్ అండ్ వీడియోస్’ చానెల్ నడిపిస్తున్నరని తెలిసింది. వాళ్లను కలిసి నా ఆసక్తి గురించి చెప్పిన. నా పాట విన్న తర్వాత ‘హయతి క్రియేషన్స్’ చానెల్ వాళ్లతో మాట్లాడి అవకాశం ఇప్పించిండ్రు. ‘ఏ గడియన వచ్చినావో బావో.. నా గంపదించి కొంపముంచినావో’.. పాట రిలీజ్ అయిన నెలరోజుల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చినయి. ఆ తర్వాత ‘దేత్తడి పోశమ్మగుడీ.. దేవుని శెరువు కట్టమడీ’ పాడిన. ఇది పెద్ద వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపించింది. అయితే ఈ పాటలో డబుల్ మీనింగ్ ఉందని కామెంట్స్ వచ్చినయి. పాడే టప్పుడు నేను ఆ విషయం గ్రహించలేదు. అవకాశం వచ్చింది కాబట్టి పాడిన అంతే! జీవితం అంటేనే మంచి, చెడు. పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు పోవాల్సిందే.
అచ్చమైన జానపదం కోసం చూస్తున్న క్రమంలో హయతి క్రియేషన్స్ ‘బొంగరాల సూపే నచ్చి.. ఉంగరాల జుట్టే చూసి’ పాటతో మళ్లొక అవకాశం ఇచ్చింది. తర్వాత సీటీఆర్ మ్యూజిక్లో ‘నఖాశాల బొమ్మా’ పాడిన. ‘తట్టా ఎత్తుకొని నువ్వు కట్టామీద పోతుంటే’, ‘ముద్దుముద్దు ముచ్చటచెప్పి ముచ్చటలోకి దింపినాడు’ వంటివి 30 పాటల దాకా పాడిన. రిలీజ్ కానివి ఇంకో పదిదాకా ఉన్నయి. కెరీర్ పీక్స్లో ఉండంగనే మా మేనబావ లోకుర్తి సాయి కుమార్తో పెండ్లి జరిగింది. మా ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేస్తడు. ఎసొంటి పాటలను ఎంచుకోవాల్నో దగ్గరుండి చూసుకుంటడు. మా అత్తగారి ఊరు కోనరావుపేట మండలం మామిడిపల్లి. శ్రమజీవుల కష్టం నుంచి పుట్టిన జానపదానికి మరింత వన్నె తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్న.
… దాయి శ్రీశైలం
“మూడుసార్లు నేషనల్స్ ఆడింది.. అయినా పాట కోసం ఆటను వదిలేసింది !!”
ఒక్కసారి ఓడిపోగానే అప్పటిదాకా మెచ్చుకున్నోళ్లే ఇదేనా నీ టాలెంట్ అంటూ ఎగతాళి చేశారు”