‘తెలంగాణ నేల మీద గులాబీ జెండా ఎదురుగాలి ఎంతొచ్చిన ఎగురును మన జెండా ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన జెండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా ముప్పయి మూడు జిల్లాల్లో గులాబీ జెండా ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా…’
ఈ రోజు తెలంగాణలోని పది వేల పల్లెల్లో, పట్టణాల్లో వాడవాడన గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. నేటినుంచి ఈ నెలాఖరుదాకా తెలంగాణ అంతా గులాబీమయం కాబోతున్నది. ఇంతగా ప్రజాదరణ పొందిన ఈ గులాబీ జెండా ఆవిర్భావం అవరోధాలను అధిగమిస్తూ మూడున్నర కోట్ల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తీరును తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి సుమారు ఏడు నెలలకు పూర్వం కేసీఆర్ నివాసంలో రోజూ పది పదిహేను గంటలు పార్టీ ఏర్పాటుకు సంబంధించి చర్చిస్తుండేవాళ్లం. పార్టీ జెండా ఏ రంగులో ఉండాలనేదానిపై విస్తృతంగా, సుదీర్ఘ చర్చ జరిగింది. ముందుగా ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయ జెండాల్లోని రంగులను గుర్తించడానికి అట్లాస్ పుస్తకాలను తెప్పించి నిశితంగా ఒక్కో జెండా రంగులను పరిశీలించారు కేసీఆర్. ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేసిన అంశమేమంటే ప్రకృతిలో లభ్యమయ్యే రంగుల్లో ఒక్క గులాబీ రంగు తప్ప అన్నిరంగులూ వివిధ దేశాల పతాకాల్లో కన్పిస్తున్నాయి. ఎందుకు ఏ దేశం తమ జాతీయ పతాకంలో గులాబీ రంగు వినియోగించలేదనే దానిపై మేధోమథనం చేశారు. నేను, మధుసూదనాచారి, బోయినపల్లి హన్మంతరావు కేసీఆర్తో రోజూ కలిసేవాళ్లం. ఉదయం నుంచి అర్థరాత్రి దాటేవరకు మా చర్చలు కొనసాగేవి. ఒకవేళ చర్చించిన అంశంలో స్పష్టత రాకుంటే తెల్లవారే ఝాముదాకా కూడా సమావేశం కొనసాగేది. ముప్పయ్యేండ్ల కింద విఫలమైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని పునః ప్రారంభించాలంటే, జనంలో ఉన్న నిర్లిప్తతను, నిరాశను పోగొట్టి వారిని ఉద్యమంలోకి ఆకర్షించాలంటే చిన్నచిన్న విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్త వహించాలనేది కేసీఆర్ తపనకు కారణం.
గులాబీ రంగును జెండా రంగుగా నిర్ణయించిన రోజు నేనిచ్చిన సమాధానంతో కేసీఆర్ సంతృప్తి చెందారు. ‘ప్రపంచంలో దేశాలన్నీ పితృస్వామిక వ్యవస్థనే అమలుచేస్తున్నాయి. గులాబీ రంగును మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రేమకు గులాబీరంగు సంకేతం. ఎవరైనా తొందరగా ఆకర్షించబడతారు. మహిళలు పాల్గొనకుండా ఏ ఉద్యమమూ విజయం సాధించదు. ఈ రంగును పార్టీ జెండాగా పెట్టుకుంటేనే బాగుంటుంద’ని చెప్పాను.
మహిళలంటే కేసీఆర్కు ఎంత గౌరవమో నాకు తెలుసు. ఆయనకు బాగా ఇష్టమైన పాట ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి-ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గులాబీకి సంబంధించిన వివిధ ‘షేడ్స్’ గల జెండాలు తెప్పించారు. ‘లేత గులాబీ’ బాగుంటుందని హన్మంతరా వు సూచించారు. ఆ లేత గులాబీ జెండానే తెలంగాణ ఆత్మగౌరవ జెండాగా మూడున్నర కోట్ల ప్రజల హృదయాల్లో స్థానం పొంది రాష్ట్రమంతా రెపరెపలాడుతున్నది.
జెండాల తయారీకి కేసీఆర్, హరీశ్రావు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తొలిసారి గులాబీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. మే 4న అన్ని నియోజకవర్గాల ప్రతినిధులను ‘జలదృశ్యం’కు ఆహ్వానించి గన్నీ బ్యాగు నిండా గులాబీ జెండాలు, కండువాలు, పార్టీ సభ్యత్వ పుస్తకాలు, తెలంగాణ పాట ల క్యాసెట్లు అందజేశారు. జెండాలు, కండువాల తయారీ ఆర్డర్ను కాచిగూడలో ఉన్న నందుకు అప్పగించారు. ఆయన బీజేపీ పార్టీ నాయకుడు. జెండా లు ఏ పార్టీవైనా నందుకే ఇచ్చేవారు. ఎందుకంటే డబ్బు తర్వాత ఇస్తామన్నా సరైన సమయానికి జెండాలు ఆఫీసులో ఇచ్చేవాడు. కొన్ని లక్షలు నం దుకు టీఆర్ఎస్ బాకీ పడిం ది. రోజూ వచ్చి జలదృశ్యం ముందు నిలబడేవారు. కేసీఆర్కు మౌనంగా నమస్కారం పెట్టేవారు. కానీ డబ్బు గట్టిగా అడగక పోయేవారు. ఎన్నో ఇబ్బందులు తీరుస్తుండేవారు.
పార్టీ ఆవిర్భావం తర్వాత జూన్ 17న సింహగర్జన సభ కరీంనగర్లో జరిగింది. హైదరాబాద్ జలదృశ్యం నుంచి వందలాది కార్లతో ర్యాలీ బయల్దేరింది. కరీంనగర్ దాకా ప్రధాన రహదారిలో ఉన్న పల్లెలన్నీ గులాబీమయమైనాయి. ఎవ్వరి చేతిలో చూసినా గులాబీ జెండానే. రెండు నెలల్లో అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ సభలు జరగడంతో తెలంగాణ అంతా గులాబీమయమైంది.
2002 ప్రారంభంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దివంగత నేత నాయిని నర్సింహారెడ్డిని మేయర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ ఖారారు చేసింది. జంట నగరాల్లోని వీధులన్నీ తొలిసారి గులాబీమయమైనాయి. భారతీయ జనతా పార్టీని వీడిన ఆలె నరేంద్ర తెలంగాణ సాధన సమితిని ఏర్పాటుచేశారు. ఒకే ఆశయం కోసం కలిసి పనిచేద్దామని కేసీఆర్తో చర్చలు జరిపిన సందర్భంగా జెండా రంగుకు సంబంధించి ఒక షరతు పెట్టారు. ఆలె నరేంద్ర జెండా పాలపిట్ట రంగులో ఉండేది. టీఆర్ఎస్ జెండాలో కూడా గులాబీతో పాటు పాలపిట్ట రంగు ఉండాలని నరేం ద్ర పట్టుబట్టారు. కేసీఆర్ ససేమిరా అంగీకరించకపోవడంతో నరేంద్ర తన పట్టుదలను విరమించుకున్నారు.
ఢిల్లీకి 2013 మార్చిలో కేసీఆర్ వెయ్యి కార్లతో బయల్దేరినప్పుడు దారిలో పల్లెలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలన్నీ గులాబీమయమైనాయి. తొలిసారి ఢిల్లీ వీధులన్నీ టీఆర్ఎస్ పార్టీ జెండాలతో నిండి జాతీయపార్టీల నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వాహనాలను ఆపి ‘గులాబీ ఏ పార్టీ జెండా?’ అని ప్రశ్నించారు ఢిల్లీ పౌరులు. ఈ రోజు అదే ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమిపూజ చేస్తున్నారు మన ప్రియతమ నాయకుడు కేసీఆర్.
‘ఎదురుగాలి ఎంతొచ్చిన ఎగురును మన జెండా తెలంగాణ బిడ్డకు అండాదండ- మన గులాబీ జెండా’
(వ్యాసకర్త: టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు)
వి.ప్రకాశ్