జెండా పండుగ వచ్చిందంటే వీధులన్నీ మువ్వన్నెలతో ముస్తాబు అవుతాయి. కాకపోతే, సాయంత్రానికంతా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ జెండాలే. వీటివల్ల పర్యావరణానికి ఎంత హాని! కాబట్టే, ప్రత్యామ్నాయంగా మొలకెత్తే జెండాలను అందుబాటులోకి తెచ్చింది ఢిల్లీకి చెందిన ‘బ్యాక్ టు నేచర్’ సంస్థ. విత్తన వినాయక విగ్రహాల్లానే.. చెత్త కాగితాలు, పాత వస్ర్తాల వ్యర్థాలతో మిరప, తులసి, టమాట, బంతి తదితర గింజలను మేళవించి జెండాలను తయారుచేస్తారు. ఈ జెండాలను పంచుతూ పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నది బ్యాక్ టు నేచర్. ‘జాతీయ జెండాను మట్టిలో పాతిపెట్టడం అనేది జెండా నియమాల ఉల్లంఘనలోకి రాదు. పర్యావరణానికి ఎంతో మేలుచేసే పద్ధతి ఇది. ఇప్పుడిప్పుడే మా జెండాలకు ఆదరణ పెరుగుతున్నది’ అంటున్నారు బ్యాక్ టు నేచర్ ప్రతినిధి గరిమా కపూర్.