కొవిడ్ ప్రభావం విద్యావ్యవస్థపై ఎంతగానో పడింది. ఉపాధి కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది తమ పిల్లల ఫీజులు కట్టలేక ఉసూరుమంటున్నారు. ఫీజులు వసూలు కాక, పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి! ఒకే ఉపాయంతో ఈ రెండు సమస్యలనూ పరిష్కరించారు ముంబయిలోని పోవాయ్ హైస్కూల్ ప్రిన్సిపల్ షెర్లీ పిైళ్లె. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విద్యార్థుల ఫీజులు వచ్చే ఏర్పాటు చేశారామె. గతేడాది మార్చిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మా పాఠశాలలో దాదాపు 450 మంది విద్యార్థులున్నారు. గతేడాది పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాక.. పిల్లల తల్లిదండ్రులు చాలామంది రిపోర్ట్ కార్డ్స్ తీసుకువెళ్లడానికి ముందుకురాలేదు. కారణం, ఫీజుల భయం. ఉపాధి లేక సతమతమవుతున్న వాళ్లు ఫీజులేం చెల్లించగలరు. అలాగని, పిల్లల చదువును నిర్లక్ష్యం చేయలేరు. అప్పటికే ఫీజులు వసూలు కాక, మా ఉపాధ్యాయుల జీతాల్లో 30 శాతం నుంచి 50 శాతం కోత విధించాల్సి వచ్చింది. దీనికి పరిష్కారంగా క్రౌడ్ ఫండింగ్ చేయాలనుకున్నా’ అంటారు షెర్లీ. ఈ ప్రయత్నంలో భాగంగా స్థానిక దినపత్రికలు, సోషల్ మీడియా వేదికగా దాతలను అభ్యర్థించారు. విద్యార్థుల చదువులు కొనసాగడానికి హితోధికంగా సాయం చేయాలని కోరారు. దాతల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఆశ్చర్యకరంగా దాదాపు రూ.40 లక్షలు వసూలయ్యాయి. ఈ మొత్తంతో 200 మంది చిన్నారుల ఫీజు చెల్లించారు షెర్లీ. వచ్చే విద్యా సంవత్సరంలోనూ పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా దాతల సహకారం తీసుకుంటామని చెబుతున్నారామె. అడిగిందే తడవుగా సాయం చేసిన దాతలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు షెర్లీ. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఫీజులో రాయితీ కల్పిస్తామని చెబుతున్నారు.