ఏప్రిల్, మేలలో రాజ్యమేలిన మండే ఎండలకు తెరదించుతూ జూన్లో తొలకరి పలకరిస్తుంది. నిప్పుల కుంపటిని తలపించే వాతావరణం.. నెమ్మదిగా చల్లబడుతుంది. చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. అయితే వాతావరణంలో తేమ పెరిగి గాలి చల్లబడిపోవడం, వర్షాలకు మడుగులు, కుంటలు, చెరువులు, మురుగు కాలువలు నీటితో నిండిపోవడం వల్ల దోమలు, ఈగలు సహా రోగ కారక క్రిములు వృద్ధి చెందుతాయి. వీటివల్ల జలుబు, దగ్గు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి రుగ్మతలు చుట్టుముడతాయి. చిన్నపిల్లలకు ఈ సీజనల్ వ్యాధులు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఈ నేపథ్యంలో అసలు సీజనల్ వ్యాధులు అంటే ఏమిటి? ఎలాంటి రోగాలు వస్తాయి? వాటికి కారణాలేమిటి? రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తదితర అంశాలను చర్చించుకుందాం.
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది. సీజనల్ వ్యాధులకు గాలి, నీరు, దోమలే ప్రధాన కారణం.
వేసవి సెలవులలో పిల్లలు దాదాపు రెండు నెలలపాటు ఇంటికే పరిమితమవుతారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలు సమయానికి భోంచేసేలా చూస్తారు. మిగిలిన రోజుల కంటే కొంచెం ఎక్కువగా తినిపిస్తారు. దీంతో పిల్లలు ఎక్కువ విశ్రాంతికి అలవాటు పడతారు. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగు తుంది. అంతలోనే జూన్ వచ్చేస్తుంది. బడులు తెరుచుకుంటాయి. ఇళ్లకే పరిమితమైన పిల్లలు ఒక్కసారిగా బయటి వాతావరణంలోకి వచ్చేస్తారు. పొద్దున్నే నిద్రలేచి బడికి పరుగెత్తాలి. సాయంత్రం ఇంటికి రాగానే టీవీ, మొబైల్, హోంవర్క్, ట్యూషన్లు.. రాత్రయిపోతుంది. తినడం, పడుకోవడం మళ్లీ ఉదయమే లేచి బడికి పరుగెత్తడం.. ఇలా పిల్లల జీవనశైలి మారిపోతుంది. అదనంగా, వేసవిలో వేడిగా ఉన్న వాతావరణం వర్షాల కారణంగా ఒక్కసారిగా మారిపోతుంది. ఓ వైపు వాతావరణంలో ఏర్పడిన మార్పులు, మరోపక్క అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం కొంత గందరగోళంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా కొంతమేరకు తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది. సీజనల్ వ్యాధులకు గాలి, నీరు, దోమలే ప్రధాన కారణం. ఎందుకంటే, వేసవి తరువాత వాతావరణం హఠాత్తుగా మారిపోతుంది. అప్పటివరకు ఉక్కపోత, వేడిగాలులతో నిండిన వాతావరణం చల్లబడి పోతుంది. దీనికితోడు వర్షాల వల్ల కొత్తనీరు వస్తుంది. నాలాలు, కుంటల్లో దోమలు, ఈగల వృద్ధి జరుగుతుంది. ఫలితంగా, సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి.
సాధారణంగా 1-5 ఏండ్ల వయసు పిల్లల్లో ఎడినాయిడ్స్ కండరాలు, టాన్సిల్స్ ఉంటాయి. ఎడినాయిడ్స్ కండరాలు గొంతు పైభాగంలో, ముక్కుకు కొంచెం వెనక ఉంటాయి. దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఇవి ముక్కులోనే అడ్డుకుంటాయి. ఇక, టాన్సిల్స్ గొంతులో నోటి వెనకభాగంలో ఉంటాయి. పిల్లలు పెరిగే కొద్దీ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ కనుమరుగైపోతాయి. వేసవికాలంలో వాతావరణంలో తేమ 20-30 శాతం లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. అయితే, వర్షాకాలం ప్రారంభంతో ఒక్కసారిగా 80 శాతానికి మించి పెరుగుతుంది. ఆ ప్రభావంతో చలిగాలులు వీస్తుంటాయి. ఆ గాలి పీల్చడం వల్ల పిల్లల ముక్కులో ఉండే ఎడినాయిడ్స్ కండరాలు, గొంతులో ఉండే టాన్సిల్స్ ఉబ్బుతాయి. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చి, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగితే అది న్యుమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై బడికి వెళ్లే పిల్లలు చల్లగాలిని పీల్చుకునే అవకాశాలు ఎక్కువ. బస్సులు, కార్లలో వెళ్లే పిల్లలకు.. కిటికీలు మూసి ఉంచడం వల్ల ముప్పు కొంచెం తక్కువే. బడికి వెళ్లిన తరువాత కూడా జాగ్రత్తగా ఉండాలి. చల్లటి గాలి ఉండటం వల్ల కూడా పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం, న్యుమోనియా వంటి సీజనల్ వ్యాధులు వచ్చే ఆస్కారం అధికం. పాఠశాలల్లో పిల్లలు తుమ్మినా, దగ్గినా జలుబు, దగ్గు, స్వైన్ఫ్లూ, కరోనా వంటివి గాలి ద్వారా ఒకరినుంచి మరొకరికి సోకుతాయి. తరగతి గదుల్లో పిల్లలు దగ్గర దగ్గరగా కూర్చోవడం, కలిసి ఆడుకోవడం వల్ల అంటు వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి, పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాలి. బడికి వెళ్లేముందు తగిన జాగ్రత్తలు చెప్పాలి. మాస్క్ లాంటివి తప్పకుండా ఇచ్చి పంపాలి.
వర్షాల కారణంగా చెరువులు, కుంటలు తదితర జలాశయాలలో కొత్తనీరు వచ్చి చేరుతుంది. ఈ నీటిని ఎంత వడపోసినా ఎక్కడో ఒకదగ్గర కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుంది. కలుషితమైన నీరు అనేక వ్యాధులకు ప్రధాన కారణం. గ్యాస్ట్రోఎంటరైటిస్ వ్యాధులైన వాంతులు, విరేచనాలు, కలరా, పచ్చకామెర్లు, అమీబియాసిస్ వంటివి అధికంగా వస్తాయి. విరేచనాలు ఎక్కువగా కావడంతో పిల్లలు డీహైడ్రేషన్ బారినపడతారు. వర్షాకాలంలో ఈగల బెడద కూడా ఎక్కువే. కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్ల ఎక్కువగా పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటివి పిల్లలపై దాడిచేస్తాయి. సాధ్యమైనంత వరకూ కాచి చల్లార్చిన నీరే ఇవ్వాలి.
దోమలను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి, రాత్రిపూట కుట్టే దోమలు. రెండు, పగటి వేళ కుట్టేవి. అనాఫిలిస్, క్యూలెక్స్ దోమలు రాత్రిపూట కుడతాయి. వీటి వల్ల మలేరియా, ఫైలేరియా (బోదకాలు), మెదడువాపు వంటివి వస్తాయి. బోదకాలు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ‘ఈడిస్ట్ ఈజిైప్టె’ దోమల ప్రభావం అధికం. ఇవి పగలు మాత్రమే కుడతాయి. ఇతర దోమల్లా మురుగు నీటిలో ఉండవు. నిల్వ ఉన్న మంచి నీటిలో… అంటే ఇళ్లలోని పూల కుండీలు, కూలర్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిన కుంటలు, రబ్బరు టైర్లు వంటివాటిలో ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. పాఠశాల తరగతి గదుల్లో బెంచీల కిందిభాగం, మూత్రశాలలు.. ఈడిస్ట్ ఈజిైప్టె దోమలకు ఆవాసాలు అవుతాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లలు డెంగీ బారినపడే ఆస్కారం ఉంది. ఐదేండ్ల లోపు పిల్లలకు మెదడువాపు ప్రధాన శత్రువు. ఈ వ్యాధికి పందులే వాహకాలు. పదిహేను ఇరవై ఏండ్ల కింద హైదరాబాద్లో మెదడువాపు తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. దీనివల్ల పిల్లలు మెదడు వాచిపోయి, ఫిట్స్ వచ్చి మృత్యువాత పడతారు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం.
జాగ్రత్తలే శ్రీరామరక్ష
టీకాలతో రక్షణ
సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి కొన్ని రకాల టీకాలు అందుబాటులోఉన్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు పిల్లలకు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించడం మంచిది. దీనివల్ల పలురకాల ఫ్లూ జ్వరాల నుంచి రక్షణ లభిస్తుంది. ఐదేండ్ల లోపు పిల్లలకు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించాలి. పసరికల (జాండిస్) నుంచి రక్షణ పొందడానికి హెపటైటిస్-ఎ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా పిల్లలను వానాకాలం వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చు. చదువులపై దృష్టి నిలిపేందుకు తగిన వాతావరణాన్ని కల్పించవచ్చు.
– డాక్టర్ డి.రమేష్
చిన్నపిల్లల విభాగాధిపతి, సీనియర్ పిడియాట్రిషియన్
యశోద హాస్పిటల్, హైదరాబాద్