చియా గింజలు అనేక పోషకాలతో నిండి ఉంటాయి. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ముందుంటాయి. దాంతో ఇప్పుడు చాలామంది వీటిని తమ రెగ్యులర్ డైట్లో భాగం చేసుకుంటున్నారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చియా సీడ్స్ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధపడేవారికి చియా సీడ్స్ దివ్యౌషధమే! ఎందుకంటే, రక్తపోటు స్థాయుల్ని తగ్గించడంలో ఇవి ముందుంటాయి. కాబట్టి, లోబీపీతో బాధపడేవారికి ఇవి హాని కలిగిస్తాయి. వీటిని తీసుకుంటే బీపీ మరింత పడిపోయే ప్రమాదం ఉంటుంది.
డయాబెటిస్కు మందులు వాడుతున్నవారు కూడా చియా సీడ్స్ ఎక్కువగా తీసుకోవద్దు. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ రోగులు ఇన్సులిన్, ఇతర మందులు వాడుతుంటే.. చియా విత్తనాలు రక్తంలోని షుగర్ లెవల్స్ను మరింతగా తగ్గిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది.
రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నవారు.. చియా విత్తనాలను పక్కన పెట్టేయాలి. ఎందుకంటే.. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్..
రక్తం గడ్డకట్టకుండా చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, వీటిని తీసుకుంటే.. రక్తం మరింతగా పలుచబడుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర కిడ్నీ సమస్యలు ఉన్నా.. చియా విత్తనాల్ని తినకూడదు. వీటిలో పొటాషియం, ఆక్సలేట్లు, ఫాస్ఫేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి.
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికీ చియా గింజలు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది.
కొందరిలో చియా గింజలు అలర్జీ కలిగిస్తాయి. ఫలితంగా, చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావొచ్చు. అలాంటివారు కూడా చియా సీడ్స్ తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
చిన్నపిల్లలు, గర్భిణులు, పాలిచ్చే మహిళలు కూడా.. వైద్యులను సంప్రదించిన తర్వాతే చియా విత్తనాల్ని తీసుకోవాలి.