శరీరంలో కణాల ఉత్పత్తి అసహజంగా జరిగితే.. దానిని ‘ట్యూమర్’ లేదా ‘కణితి’ అంటారు. మెదడులో కణాలు అసహజంగా ఉత్పత్తి కావడాన్నే ‘బ్రెయిన్ ట్యూమర్స్’ అంటారు. ఇవి రావడానికి గల కచ్చితమైన కారణాలు ఇప్పటివరకూ తెలియవు. బ్రెయిన్ ట్యూమర్లు మూడు రకాలు. 1. క్యాన్సర్ ట్యూమర్లు. 2. నాన్ క్యాన్సర్ ట్యూమర్లు. మెదడులోనే పుట్టే వీటిని ‘ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్’ అంటారు. ఇక మూడోవైన ‘మెటా స్టాసిస్’ ట్యూమర్లు శరీరంలో ఇతర అవయవాల్లో ఏర్పడి, మెదడుకు విస్తరిస్తాయి. అయితే మెదడులో ఏ రకమైన ట్యూమర్ ఉన్నా.. ప్రమాదకరమే.
మెదడులో ఏర్పడే ట్యూమర్లు :
మెదడులో ఏర్పడే ట్యూమర్లలో క్యాన్సర్ ట్యూమర్లు, నాన్ క్యాన్సర్ ట్యూమర్లు ఉంటాయి. క్యాన్సర్ ట్యూమర్లలో ప్రధానమైనవి గ్లయోమ ట్యూమర్లు, ఎపిండైమోమ, మెడుల్లో బ్లాస్టోమ ట్యూమర్లు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. అయితే, మెదడులో ఏర్పడే అన్ని రకాల ట్యూమర్ల (క్యాన్సర్, నాన్ క్యాన్సర్)ను ప్రారంభ దశలో గుర్తిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఇతర భాగాల్లో ఏర్పడే ట్యూమర్లు :
ఇతర అవయవాల్లో ఏర్పడి మెదడుకు వ్యాపించేవి ‘మెటాస్టాసిస్ ట్యూమర్లు’. ఇవన్నీ క్యాన్సర్కు సంబంధించినవే. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్లు.. మెదడుకు విస్తరించే గుణం ఎక్కువగా కలిగి ఉంటాయి.
నాన్ క్యాన్సర్ ట్యూమర్లు :
నాన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్లు మెదడులో మాత్రమే ఏర్పడతాయి. ఇవి ప్రధానంగా ఆరు రకాలు. 1. పీనియల్ గ్లాండ్ ట్యూమర్. 2. మెనింజ్యోమ ట్యూమర్. 3. న్యూరోఫైబ్రోమ ట్యూమర్. 4. పిట్యూటరీ ట్యూమర్. 5. డెర్మాయిడ్ ట్యూమర్. 6. హిమాంజియోబ్లాస్టోమ.
లక్షణాలు :
అన్ని రకాల ట్యూమర్ల లక్షణాలు ఒకేలా ఉంటాయి. తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం, చూపు మందగించడం, ప్రవర్తనలో మార్పులు, వాసన పసిగట్టలేకపోవడం, వినికిడి శక్తి కోల్పోవడం, వస్తువులు రెండుగా కనిపించడం, మూర్ఛ, నీరసం, వణుకు, అతినిద్ర తదితర లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ లక్షణాలను అజీర్తి, పైత్యం వంటి సమస్యలుగా పొరబడుతూ ఉంటారు. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. 50 ఏళ్లు పైబడిన వారిలో తలనొప్పి లేక మైగ్రేన్ లక్షణాలు కనిపించినా, పిల్లల్లో తరచూ తలనొప్పి బాధించినా నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలి. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఒత్తిడి పెరుగుతున్నట్లు పరీక్షలో తేలితే.. మెదడులో ట్యూమర్గా అనుమానించి, తదుపరి పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది.
నిర్ధారణ పరీక్షలు :
రోగిలో లక్షణాలు కనిపించినప్పుడు ఎక్స్రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, పెటా స్కాన్, రక్తంలోకి ‘డై’ పంపించి చేసే పరీక్షలు, స్టిరియోటాక్సిక్ బయాప్సీ వంటి పరీక్షల ద్వారా జబ్బును నిర్ధారించవచ్చు. ఇది కుదరనప్పుడు క్రేనియోటమి.. అంటే పుర్రెను తెరిచి చేస్తారు. ఈ రకమైన పరీక్షల ద్వారా క్యాన్సర్ ఏ గ్రేడ్లో ఉందో నిర్ధారిస్తారు. సీటీ స్కాన్లలో రెండు రకాల పరీక్ష చేస్తారు. ఒకటి సాధారణ సీటీస్కాన్ కాగా.. రెండవది కాంట్రాస్ట్. సాధారణ సీటీ-స్కాన్లో ట్యూమర్ను స్పష్టంగా గుర్తించలేం. కాంట్రాస్ట్లో ట్యూమర్ను త్రీడీలో స్పష్టంగా చూడవచ్చు. ‘మెటాస్టాసిస్’ ట్యూమర్స్ ఉన్నవారికి పెటాస్కాన్ అవసరం పడుతుంది.
చికిత్సా పద్ధతులు:
ట్యూమర్ పెద్దగా ఉంటే రేడియేషన్ ద్వారా తగ్గిస్తారు. ఆ తరువాత శస్త్రచికిత్స చేస్తారు. ట్యూమర్ పరిమాణం తగ్గించేందుకు స్టీరియోటాక్సిక్ రేడియేషన్, త్రీ-డైమెన్షనల్ రేడియేషన్, వి-మాట్ రేడియేషన్, ప్రొటాన్ బీమ్ రేడియేషన్ వంటి అత్యాధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం ట్యూమర్పై మాత్రమే పనిచేయడం వల్ల మెదడులో ఇతర కణజాలం దెబ్బతినకుండా ఉంటుంది. పెద్దవారికి సర్జరీ లేదా రేడియేషన్ ఇచ్చిన తరువాత మందులతో కీమోథెరపీ ఇస్తారు. కానీ, పిల్లలకు కీమోథెరపీతోనే పరిష్కారం లభించవచ్చు. పిల్లల్లో మెదడు శస్త్రచికిత్స చాలా సున్నితమైనది. సంక్లిష్టమైనది. పిల్లల్లో క్యాన్సర్ ట్యూమర్లను మందులతో తగ్గించవచ్చు. బ్రెయిన్ సర్జరీలో ఏమాత్రం తేడా వచ్చినా రోగి చూపు, మాట, జ్ఞాపకశక్తి వంటివాటిపై ప్రభావం పడుతుంది. 2సెం.మీ. కంటే తక్కువగా, సున్నిత ప్రదేశంలో ట్యూమర్ ఉంటే, రోగి సర్జరీకి అనుకూలంగా లేనప్పుడు, అది నాన్క్యాన్సర్ అయితే.. ‘గామా నైఫ్’ అనే అత్యాధునిక రేడియషన్ పద్ధతి ఉపయోగించవచ్చు. అత్యాధునిక ‘న్యూరో నేవిగేషన్’ పరిజ్ఞానంతో మెదడులో ట్యూమర్ ఎక్కడ ఉందో, ఎంత పరిమాణంలో ఉందో కచ్చితంగా తెలుసుకుని చికిత్స అందించడం జరుగుతుంది.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421