మన శరీరానికి బలమైన ఆధారం ఎముకలే కదా! నడవడం, కదలడం, రోజువారీ పనులు చేసుకోవడంలో మాత్రమే కాకుండా శరీరంలోని ముఖ్యమైన అవయవాలను రక్షించడంలోనూ ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే, చిన్నవయసు నుంచే సరైన పోషకాహారం తీసుకోవడం అవసరం. క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ కె, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రొటీన్ వంటి పోషకాలు ఎముకల నిర్మాణంలో కీలకంగా పనిచేస్తాయి. మన ఇంట్లో లభించే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు వంటి వివిధ ఆహార పదార్థాల ద్వారా ఈ పోషకాలు పొందవచ్చు. అలాగే కొన్ని పండ్లు, కూరగాయలతో తయారు చేసే జ్యూస్లు, స్మూతీలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఎముకల శక్తికి ఈ పదార్థాలు ట్రై చేయండి..
మునగాకు జ్యూస్: ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతో సాయపడతాయి. మునగాకును కూరగా వండుకోవడంతో పాటు అప్పుడప్పుడు జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ముందుగా తాజా మునగాకులను కాడల నుంచి వేరు చేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గుప్పెడు ఆకులను ఒక కప్పు నీరు, కొద్దిగా నిమ్మరసం, ఒక చిన్న అల్లం ముక్కను మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. తర్వాత వడకట్టి తీసుకోవాలి.
ఆకుకూరలతో: పాలకూరలో విటమిన్ కె, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పాలకూరతో పాటు దోసకాయ, ఆపిల్ వంటి వాటిని కలిపి స్మూతీ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక కప్పు శుభ్రంగా కడిగిన పాలకూర ఆకులు, సగం దోసకాయ, ఒక చిన్న ఆపిల్, ఒక కప్పు నీటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఈ జ్యూస్ వారానికి రెండుసార్లు తాగినా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
క్యారెట్-ఆరెంజ్: క్యారెట్లో బీటా కెరోటిన్, ఆరెంజ్ లో విటమిన్ సి లభిస్తాయి. వీటిని కలిపి తయారు చేసే జ్యూస్ రుచికరంగా ఉంటుంది. దీన్ని తయారు చేయాలంటే ఒక క్యారెట్, ఒక నారింజ, కొద్దిగా నీటిని మిక్సీలో బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇందులో చకెర, సిరప్ కలపాల్సిన అవసరం లేదు.
ఉసిరి జ్యూస్: మన ఎముకల ఆరోగ్యాన్ని రక్షించడానికి ఉసిరి జ్యూస్ ఎంతగానో సాయపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. శరీరంలోని ఎముకల నిర్మాణంలో ముఖ్యమైన కొల్లాజెన్ తయారీకి ఇది దోహదం చేస్తుంది. ఉసిరిని జ్యూస్గా తీసుకోవడంతో పాటు నేరుగా పండుగా కూడా తినొచ్చు. రెండు ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, గింజలు తొలగించాలి. వాటిని చిన్న ముకలుగా చేసి ఒక కప్పు నీటితో మిక్సీలో బ్లెండ్ చేయాలి. రుచికి కొద్దిగా నిమ్మరసం లేదా పుదీనా ఆకులు కలిపి తీసుకుంటే సరిపోతుంది.