ఆయుర్వేదం.. వేదమంత ప్రాచీనం! రుషి పరంపర ప్రసాదించిన అమూల్య వారసత్వ సంపద. ఆ మాత్రలు అమృత గుళికలు. ఆ లేహ్యాలు ప్రాణశక్తి కేంద్రాలు. బ్లాక్ ఫంగస్లాంటి రుగ్మతలకు సైతం ఆయుర్వేదంలో శక్తిమంతమైన చికిత్సలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో.. మన ఆయుర్వేద వైద్యులు ప్రయోగించిన ఔషధ శతఘ్నుల ధాటికి బ్లాక్ ఫంగస్ తెల్ల మొహం వేసి, తిరుగుముఖం పట్టింది! ఆధునిక వైద్యానికి ఆయుర్వేదాన్ని జోడిస్తూ.. తెలంగాణ ఆయుష్ విభాగం చేపట్టిన సమగ్ర అధ్యయన ఫలితాలు బ్లాక్ ఫంగస్ చికిత్సలో మైలురాయి.
బ్లాక్ ఫంగస్ (మ్యూకర్మైకోసిస్) చికిత్సలో తెలంగాణ రాష్ట్రం ఓ గొప్ప ఆవిష్కరణకు నాంది పలికింది. ఆధునిక అల్లోపతికి సనాతన ఆయుర్వేద వైద్య విధానాన్ని జోడించి.. నల్ల రాకాసిని నామరూపాల్లేకుండా చేయవచ్చని ప్రపంచానికి చాటిచెప్పింది. ఒకవైపు లక్షల్లో వైద్య ఖర్చులు, మరోవైపు ఔషధాల కొరత.. ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మన సంప్రదాయ వైద్య పద్ధతులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. సీఎం చొరవతో.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ- ఆయుష్ విభాగం, డాక్టర్ బూర్గుల రామకృష్ణా రావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా ఓ పరిశోధనకు శ్రీకారం చుట్టాయి. దేశంలోనే తొలిసారిగా, బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుర్వేద ఔషధాలతో కూడిన చికిత్సా విధానాన్ని ఆవిష్కరించాయి. గాంధీ, ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రయోగాత్మకంగా ఆ మందులను ఇచ్చారు. ఆ ప్రయత్నం సానుకూల ఫలితాలను ఇచ్చింది. దీంతో చికిత్సా విధానాన్ని, అధ్యయన ఫలితాలను ప్రభుత్వానికి నివేదించేందుకు ఆయుష్ విభాగం సిద్ధమవుతున్నది. త్వరలోనే జర్నల్ ప్రచురణకూ వెళ్లనున్నది.
మూడు నెలల అధ్యయనం
బ్లాక్ ఫంగస్ కేసులు అత్యధికంగా ఉన్న కాలం.. మే నుంచి ఆగస్టు. ఈ సమయంలో గాంధీ, కోఠి ఈఎన్టీ ఆసుపత్రుల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం గాంధీ దవాఖానలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ తీవ్ర లక్షణాలు ఉన్న వారిని, ఈఎన్టీ ఆసుపత్రిలో సాధారణ స్థాయి నుంచి ఓ మోస్తరు తీవ్రతతో బాధపడుతున్న బ్లాక్ ఫంగస్ బాధితులను ఎంపిక చేసుకున్నారు. నూతన చికిత్సా విధానం గురించి రోగులకు, వారి కుటుంబ సభ్యులకు వివరించి అంగీకారం తీసుకున్నారు.
చికిత్సలో భాగంగా అల్లోపతి మందులు కొనసాగిస్తూనే, ఆయుర్వేద ఔషధాలను (యాడ్ ఆన్ థెరపీ విత్ అల్లోపతి) అందించారు. గాంధీలో 45 మందిపై, ఈఎన్టీలో 92 మందిపై ఈ అధ్యయనం జరిగింది. ప్రతి రోగికీ నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, ప్రతి చిన్న మార్పునూ నమోదు చేశారు. మొత్తం ఎనిమిది మార్గదర్శకాలను ఖరారుచేసుకొని.. దానికి అనుగుణంగా నివేదిక రూపొందించారు. రోగిలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి ఏ మేరకు ఉంది, మందులు ఎలా పని చేస్తున్నాయి, దుష్ప్రభావాలు కనిపించాయా, చికిత్స తర్వాత మళ్లీ ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎంతమందికి మళ్లీ సర్జరీ జరిగింది, మరణాల రేటు ఏ స్థాయిలో ఉంది, వ్యాధి లక్షణాలు ఏమిటి.. అన్నది లోతుగా పరిశీలించారు. ఆ గణాంకాల ఆధారంగా చికిత్స సామర్థ్యాన్ని శాస్త్రీయంగా విశ్లేషించారు.
ఒక్క మరణమూ లేదు
అధ్యయనంలో భాగంగా అల్లోపతితో పాటు ఆయుర్వేద మందులు తీసుకున్న రెండు ఆసుపత్రుల్లోని రోగులలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి పదమూడు వందల మంది బ్లాక్ ఫంగస్ రోగులున్నారు. వీరంతా కొవిడ్తో పాటు వివిధ దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారే. ఇందులో ప్రతి వంద మందిలో పది మందికి పక్షవాతం వచ్చింది, పది మంది కళ్లు కోల్పోయారు, పది మందికైతే మెదడు వరకు బ్లాక్ ఫంగస్ సోకింది. ఇలాంటి వారు సైతం ఆయుష్ అధ్యయనంలో భాగమయ్యారు. అందరూ మృత్యువును జయించారు. కొందరిలో మాత్రం స్వల్ప స్థాయి దుష్ప్రభావాలు కనిపించాయి. చాలామందికి ఆయుష్ ఔషధాల వల్ల ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. సరికదా, మందులు వాడిన తర్వాత వ్యాధి విస్తరణ తగ్గిపోయింది. ఫంగల్ ప్రభావం వేగంగా క్షీణించింది. బ్లాక్ ఫంగస్ లక్షణాల నుంచి ఉపశమనమూ లభించింది. డిశ్చార్జి తర్వాత ఎవరూ మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సత్ఫలితాల నేపథ్యంలో ఆయుర్వేదం వాడేవారు.. బ్లాక్ ఫంగస్ సర్జరీ తర్వాత, రెండు నెలల పాటు వేసుకోవాల్సిన పొసకొనజోల్ అనే అల్లోపతి మందు వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుందని కోఠి ఈఎన్టీ ఆసుపత్రి ఆదేశాలు జారీ చేసింది.
తగ్గిన ఖర్చు…
ఒక్కో బ్లాక్ ఫంగస్ రోగి చికిత్స కోసం ప్రభుత్వం కనీసం రూ.15 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నది. సర్జరీ కాకుండా లైఫోసోమల్ ఆంఫోటెర్సిన్, ఆంఫోటెర్సిన్-బి, పొసకొనజోల్ వంటి మందుల కోసం మరికొన్ని లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అయినా, బ్లాక్ ఫంగస్ పూర్తిగా తగ్గిపోయిందని నిర్ధారించలేం. చాలా మంది.. మళ్లీ మళ్లీ సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముక్కులో మొదలైన బ్లాక్ ఫంగస్ కళ్లు, దవడ, మెదడు వరకూ వ్యాపిస్తుంది. తాజా ఆయుర్వేద చికిత్సా విధానం వల్ల .. దుష్ప్రభావాలకు ఆస్కారం ఉన్న అల్లోపతి మందుల వాడకం కూడా గణనీయంగా తగ్గింది. మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన ఇబ్బందీ తప్పుతున్నది. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు ఆర్థిక భారం తగ్గనున్నది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కేవలం అల్లోపతి మందులే వాడటం వల్ల దీర్ఘకాలంలో రోగి శరీర వ్యవస్థకు నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. కానీ, ఆయుర్వేదం జోడించడం వల్ల ఆ చెడు ప్రభావాలు తొలగిపోతాయి. బ్లాక్ ఫంగస్ మాత్రమేనా, వివిధ రుగ్మతలకు అల్లోపతి మిళితమైన ఆయుర్వేద పరిష్కారాలు కనుగొనే దిశగా ఇదో ముందడుగు.
బ్లాక్ ఫంగస్ నివారణలో..
బ్లాక్ ఫంగస్కు నూతన చికిత్సా విధానాన్ని కనుగొనడమే కాదు, అంతకుముందే బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు వివిధ సూచనలు చేసింది ఆయుష్ విభాగం. కరోనా సోకిన వాళ్లంతా బ్లాక్ ఫంగస్ వస్తుందేమోననే భయంతో వణికిపోతున్న వేళ ఇవి ఎంతో ఊరటనిచ్చాయి. సామాన్యులకు తగినంత స్పష్టతనిచ్చాయి. కొవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ వాడినవారు, అప్పటికే మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించింది. సంశమనవటి, నిషామలకివటి, సుదర్శన ఘనవటి మాత్రలను మూడు పూటలా తీసుకోవడం వల్ల బ్లాక్ ఫంగస్ బారి నుంచి తమనుతాము కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో పెద్ద మొత్తంలో ఈ మందులకు డిమాండ్ ఏర్పడింది. సామాజిక బాధ్యతగా వేల కిట్లను ఉచితంగా పంపిణీ చేసింది ఆయుష్. భారతీయ వైద్య విధానంలో విప్లవాత్మకమైన మార్పుల వైపుగా ఆయుష్ తొలి అడుగు ఇది. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసే రోజు ఎంతో దూరం లేదు.
అధ్యయన బృందం
ఈ అధ్యయనంలో గాంధీ ఆసుపత్రి బృందానికి డాక్టర్ శంకర్ ప్రసాద్, డాక్టర్ అనసూయ; కోఠి ఈఎన్టీ ఆసుపత్రి బృందానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మడికొండ, సీహెచ్ రమాదేవి నేతృత్వం వహించారు. ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ వీఎస్ అలగు వర్షిణి, డాక్టర్ బూర్గుల రామకృష్ణా రావు ఆయుర్వేద మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు, కొందరు పీజీ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. అధ్యయన సమయంలో పలువురు పీజీ విద్యార్థులు కరోనా బారినపడ్డారు.
కోఠి ఈఎన్టీలో..
గాంధీ ఆసుపత్రిలో..
… సిద్ధార్థ్ బీసగోని
ఈ తరహా చికిత్సా విధానంపై అధ్యయనం చేసిన ఏకైక రాష్ట్రం మనదే. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా మూడు రకాల ఆయుర్వేద కిట్లు పంపిణీ చేశాం. కరోనా రాకముందు, కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చి తీవ్ర లక్షణాలు ఉన్న వారి కోసం ఇవి రూపొందించాం. చాలా మంది వీటిని వినియోగించారు. ఇప్పుడు, బ్లాక్ ఫంగస్ విషయంలోనూ నూతన చికిత్సా విధానంపై అధ్యయనం చేశాం. పేషెంట్ల ముందస్తు అనుమతితో.. అల్లోపతితో పాటు ఆయుర్వేద మందులు ఇచ్చాం. మంచి ఫలితాలు వచ్చాయి. దీనివల్ల ఖర్చు తగ్గటంతో పాటు రోగులు వేగంగా కోలుకున్నారు. జర్నల్లో ప్రచురితమైతే ఆయుర్వేదం గొప్పతనం మరోసారి ప్రపంచానికి తెలుస్తుంది.
డాక్టర్ వీఎస్ అలగు వర్షిణి
డైరెక్టర్, ఆయుష్
ప్రభుత్వ ప్రోత్సాహం
బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్న తొలి రోజుల్లో మందుల కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త ప్రయత్నానికి నాంది పలికింది. ప్రత్యామ్నాయ వైద్య పరిష్కారం చూపేందుకు ఆయుష్ వ్యవస్థ ప్రయత్నించాలంటూ సీఎం కేసీఆర్ ప్రోత్సహించారు. దీంతో మాకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద ఔషధాలతో అధ్యయనం నిర్వహించాం. కోఠి ఈఎన్టీ, గాంధీ ఆసుపత్రుల్లో నిర్వహించిన అధ్యయనాలనూ పరిశీలించాం. మంచి ఫలితాలు వచ్చాయి. రూ.12 లక్షల ఖర్చుతోనే ఇంత పెద్ద ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం.
డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు
ప్రిన్సిపల్, బీఆర్కేఆర్ ఆయుర్వేద కాలేజి
దేశానికి దిక్సూచి
‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో అన్నీ మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. కొవిడ్కు గానీ, బ్లాక్ ఫంగస్కు గానీ మన మందులను మనం ఎందుకు తయారు చేసుకోకూడదు? వైద్య అవసరాల కోసం ఇతర దేశాలపై ఎందుకు ఆధారపడాలి? అన్న ప్రశ్నకు మన సమాధానం ఇది.
ఆయుర్వేదం జాతీయ వారసత్వ సంపద. అందులో ఎంతో విజ్ఞానం ఉంది. దాన్ని ఇంకా వృద్ధి చేయాలి. విస్తరించాలి. తాజాగా జరిపిన అధ్యయన ఫలితాలు స్వదేశీ వైద్య విధానాల గొప్పదనాన్ని చాటి చెబుతున్నాయి.
డాక్టర్ ఏ.యు. శంకర్ ప్రసాద్
అపోహలు వీడాలి
అల్లోపతితో కలిపి ఆయుర్వేద ఔషధాలను వినియోగించడం వల్ల నష్టం జరుగుతుందనే అపోహ ఉంది. ఇందులో వాస్తవం లేదనడానికి తాజా అధ్యయనమే ఉదాహరణ. ఎంతో గొప్పదైన ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రజలకు ఆ ఘనత చాటి చెప్పేందుకు ఇదొక మంచి అవకాశం.
డాక్టర్ ప్రవీణ్ కుమార్ మడికొండ
ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ మంచిది
అల్లోపతి, ఆయుర్వేదం.. జోడించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలి. తాజాగా జరిపిన మా అధ్యయనంలో వ్యాధి లక్షణాలు చాలా మందిలో తగ్గిపోయాయి. రుగ్మత ముదిరిపోకుండా అడ్డుకోవడమూ సాధ్యమైంది. అనేక దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేదంలో శక్తిమంతమైన ఔషధాలు ఉన్నాయి.
డాక్టర్ కె. అనసూయ