వేదాలు కొలిచినవాడు, ఉపనిషత్తులు ఉపాసించినవాడు, పురాణాలు వర్ణించినవాడు.. ప్రాచీన గణపతి! శతాబ్దాలుగా నిత్య పూజలు అందుకొంటున్న వినాయక విగ్రహాలు తెలంగాణ గడ్డ మీద అనేకం ఉన్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాచీన మూర్తులకు అయితే, నాలుగువందల నుంచి ఎనిమిది వందల ఏండ్ల చరిత్ర ఉంది.
గణాధిపతి ఆ ఇండ్లలో బాసింపట్టేసుకుని కూర్చున్నాడు. నిమజ్జనాలు ఎరుగని ఆ స్వామికి నిత్యోత్సవాలు జరుగుతాయి. రోజూ ధూపదీప నైవేద్యాలే! ఒక్కో మూర్తికి ఓ ఘన చరిత్ర ఉంది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం.. సింధూ ప్రాంతం నుంచి ఆయాచిత విఠల దీక్షితుల కుటుంబం లోకాయపల్లి సంస్థానం పరిధిలోని పరిమళపురానికి (నేటి పల్లా) వలస వచ్చింది. వస్తూ వస్తూ నిత్యార్చన కోసం భైరవమూర్తిని, మట్టి వినాయకుడిని వెంట తీసుకొచ్చింది. కానీ, భగవత్ ప్రేరణతో భైరంకొండలో తమ దగ్గరున్న భైరవుడిని ప్రతిష్ఠించారు. వినాయకుడిని మాత్రం పూజగదిలో కొలువుదీర్చి నిత్య పూజలు చేసేవారు. విఠల దీక్షితులకు ముగ్గురు కుమారులు. ఒక సారి, మొదటి ఇద్దరూ పౌరోహిత్యం కోసం బయటి ప్రాంతాలకు వెళ్లారు. చిన్నకొడుకు బాలచందర్ దీక్షితులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ‘సంస్థానంలో పూజలు చేయడానికి మిమ్మల్ని తోడ్కొని రమ్మన్నారు’ అంటూ బాలచందర్కు రాజాజ్ఞను వినిపించారు భటులు. అతడికేమో అర్చకత్వం మీద పట్టు లేదు. వెళితే, రాజు వద్ద మాట పడాల్సి వస్తుందని వదినలు హెచ్చరించారు. అయినా, బాలచందర్ వినలేదు. తన ఇష్టదైవమైన తరాలనాటి మట్టి గణపతికి నమస్కరించి.. ‘స్వామీ! పూజకు వెళ్తున్నాను.. ఒకవేళ మంత్రాలు రాకపోతే బావిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటాను’ అని ప్రమాణం చేశారు. గణనాథుడి మహిమతో రాజాస్థానంలో అనర్గళంగా వేదమంత్రాలు వల్లించగలిగారు బాలచందర్.
నేనున్నాను..
ఓసారి, విఠల దీక్షితుల ఇంట్లో దొంగలు పడ్డారు. నగల కోసం చోరుల దేవులాటలో ప్రాచీన వినాయక మూర్తి శిథిలమైంది. అదే సమయంలో, ఆ ఇంటి పసిబిడ్డ చెవిపోగునూ లాక్కుపోయారు. ఆ రాపిడికి చిన్నారి లేత చెవులకు గాయమైంది. ‘శిథిలమూర్తి ఇంట్లో ఉండటం అప్రతిష్ఠ. వెంటనే నిమజ్జనం చేయండి’ అని ఎవరో సలహా ఇచ్చారు దీక్షితులవారికి. ఆ రాత్రి స్వామి కుటుంబ సభ్యులకు కలలోకొచ్చాడు. ‘పాప చెవికి కూడా గాయమైంది కదా! చిన్నారినీ నీటిపాలు చేస్తారా?’ అని అమాయకంగా ప్రశ్నించాడు. దీంతో తప్పు తెలిసొచ్చింది. గణపతి ఆనతితో.. శిథిల మూర్తిని 41 రోజుల పాటు పూజించారు. 42వ రోజు యథారూపంలో స్వామి విగ్రహం దర్శనం ఇచ్చింది. నాటి నుంచి నేటి వరకు పరిమళపురంలోని వినాయక విగ్రహానికి ఏడాదిలోని 365 రోజులూ పూజలు చేస్తారు. సుభాష్రోడ్, సంత్మఠ్ రాంమందిర్లోని ఊట్కూర్ యజ్ఞ నారాయణ పురోహిత్ నివాసంలోని వినాయకుడికి కూడా 600 ఏండ్ల చరిత్ర ఉన్నది. శ్రీ మూల హనుమాన్ దేవాలయ సమీపంలోని జ్ఞానేశ్వర్ గృహంలోని మట్టి గణపతి అక్షరాలా నాలుగు వందల ఏండ్లవాడు. బ్రాహ్మణవాడిలోని కిశోర్కుమార్ ఇంట్లోని గణపయ్యకూ 350 ఏండ్ల ఘనగతం ఉన్నది. నిమజ్జనం ఎరుగని వినాయకులుగా వీరంతా విరాజిల్లుతున్నారు.
… వారధి నవీన్కుమార్