పదిహేనేండ్ల బీజేపీ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టి.. ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు షెల్లీ ఒబెరాయ్. మొత్తం 266 ఓట్లలో 150 సాధించి ప్రత్యర్థిని మట్టికరిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పశ్చిమ ఢిల్లీలోని ఈస్ట్ పటేల్ నగర్ వార్డుకు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు షెల్లీ. తను విద్యావేత్త. అన్నామలై యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో పీహెచ్డీ చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఇండియన్ కామర్స్ అసోసియేషన్లో జీవితకాల సభ్యురాలు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్స్లో పరిశోధన పత్రాలు సమర్పించారు. ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ (ఉద్వేగ ప్రజ్ఞ)కు సంబంధించి లోతైన అధ్యయనాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేస్తానని మాటిచ్చారు షెల్లీ. 1958లో మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన ఢిల్లీకి అరుణా అసఫ్ అలీ తొలి మేయర్. దాదాపు దశాబ్దం క్రితం.. అవిభక్త ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు రజనీ అబ్బీ చైర్మన్గా ఉండేవారు. మళ్లీ ఇప్పుడు షెల్లీ వంతు.