‘అనగనగా..’ అంటూ బిడ్డలకు కథలు చెప్పడంలో ఆమె సృజనాత్మకత తెలిసి పోతుంది. డబ్బాలోని అడుగు బొడుగు బియ్యంతోనే అందరి కడుపులూ నింపేయగల ఐడియాల కార్ఖానా ఆమె మెదడు. కాబట్టే, అద్దాల అడ్డుగోడలను ఛేదించుకుని కార్పొరేట్ కారిడార్లనూ ఏలేస్తున్నది. అందుకు తాజా ఉదాహరణ..భారత ప్రభుత్వం ‘ఇన్నొవేషన్ ఫర్ యు’ పేరుతో ప్రచురించిన 75 మంది స్టార్టప్ ఫౌండర్స్ విజయగాథల కాఫీ టేబుల్ బుక్. అనేకానేక వడపోతల తర్వాత అటల్ ఇన్నొవేషన్ మిషన్ ఎంపికచేసిన 75 మంది వజ్రోత్సవ అంకుర నారీమణులలో ఐదుగురు తెలంగాణ మహిళలూ ఉన్నారు.
నిన్నమొన్నటి వరకూ ఓ సంస్థను నిర్వహించాలంటే.. పురుషుల సహజ లక్షణాలైన దూకుడు, తెగింపు, కఠిన స్వభావం తప్పనిసరి అని భావించేవారు. ఆధునిక మేనేజ్మెంట్ సిద్ధాంతకర్తలు ఆ వాదనను ఆమోదించడం లేదు. మహిళలోని సున్నితత్వం, ఆలస్యమైనా సరే అన్నివైపుల నుంచీ ఆలోచించే స్వభావం, నొప్పింపక తానొవ్వక వ్యవహరించే తీరు.. ప్రతి సీయీవోకూ ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలని తేల్చేశారు. డెబ్భై ఐదు మంది సృజనకాంతల విజయగాథలు ఆ విషయాన్ని మరోసారి నిరూపించాయి.
యంత్రం.. గెలుపు మంత్రం!
సంతోషి బుద్ధిరాజు, ఆటోక్రసీ మెషినరీ
సంతోషి బుద్ధిరాజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు. ఆ తర్వాత రైల్వే, బస్సు ప్రయాణికులకు భోజనాన్ని అందించే ‘డెలివరీ అంకుల్’ స్థాపించారు. వివిధ కార్పొరేట్ కంపెనీలలో పనిచేశారు. ఇప్పుడు వాహనాల తయారీ, సేవల సంస్థ.. ఆటోక్రసీ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ వ్యవసాయ, నిర్మాణ రంగాలకు అవసరమైన కోత యంత్రాలు, తవ్వకాల మెషినరీని తయారుచేస్తుంది. కాలయాపన లేకుండా.. డ్రైనేజీ, సాగునీటి పైపులు క్షణాల్లో వేసేయగలదు. నిర్మాణ కంపెనీలు, కాంట్రాక్టర్లు, రైతులతో ఒప్పందాలు చేసుకుని, వాళ్ల అవసరాలకు తగినట్టు యంత్రాలను తయారు చేస్తుంది. పరిశోధన, అభివృద్ధి కోసం ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేశారు సంతోషి. ‘సాంకేతికత మనిషి అవసరాలు తీర్చాలి. మౌలిక సదుపాయాలను అందించాలి. ఆ లక్ష్యమే మమ్మల్ని ఈ దిశగా నడిపిస్తున్నది’ అని వివరిస్తారు సంతోషి బుద్ధిరాజు.
గరుడ గమన..
– శ్వేతా గెల్లా , గరుడాస్త్ర ఏరో ఇన్వెంటివ్ సొల్యూషన్స్
ఒకప్పుడు ఘన విజయాలను వర్ణించడానికి ‘ఆకాశమే హద్దు’ అనేవారు. ఇప్పుడు ఆకాశంలో కూడా అవకాశాలున్నాయ్. హద్దే లేని ఆకాశంలో పోటీ అంటే.. అపారమైన ఆత్మవిశ్వాసం కావాలి. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ.. గరుడాస్త్ర ఏరో ఇన్వెంటివ్ సొల్యూషన్స్ దూసు కొచ్చింది. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, రాకెట్లు, అంతరిక్ష వాహక నౌక (స్పేస్ షటిల్) నమూనాల తయారీ, అభివృద్ధి ఆ సంస్థ ప్రత్యేకత. డ్రోన్ల సాయంతో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తుంది, మ్యాప్ తయారీ సేవలు అందిస్తుంది. గనులు, వ్యవసాయం, అడవులు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, మీడియా,
వినోద రంగాలకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘అంతరిక్ష, రక్షణ, సముద్ర గర్భ పరిశోధన, విద్యుత్, ఉత్పత్తి రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు రోబోటిక్స్, ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా మేం పరిష్కారాలు సూచిస్తాం’ అని వివరిస్తారు శ్వేత.
‘అంతిమ’ బాధ్యత
– శ్రుతిరెడ్డి రాపోలు
అంత్యేష్టి ఫ్యునరల్ సర్వీసెస్
మరణం ఒక ముగింపు. జీవితం ఎంత గౌరవప్రదంగా సాగిందో, అంతే హుందాగా అంతిమ వీడ్కోలు జరగాలని కోరుకుంటారు ఎవరైనా. పరిస్థితుల ప్రభావం వల్ల కొందరి విషయంలో చివరి వీడ్కోలు చావును మించిన విషాదం అవుతుంది. అంతిమ సంస్కారాల నిర్వహణ తలకుమించిన భారమైనవారికి అంత్యేష్టి ఫౌండేషన్ ఆసరాగా నిలుస్తున్నది. శకునాలు, శుభాశుభాలు లెక్కచేయకుండా అత్యుత్తమ సంస్కారంతో అంతిమ సంస్కారాల రంగంలోకి అడుగుపెట్టారు శ్రుతిరెడ్డి రాపోలు. అంత్యేష్టి ఫ్యునరల్ సర్వీసెస్ వేదికగా.. ఈ సేవలు అందిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన అంత్యేష్టికి శ్రుతి వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్. మహాప్రస్థాన వాహనం, ఫ్రీజర్ బాక్స్, ఎంబామింగ్ (సహజంగా మరణించిన వారి భౌతికకాయాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచే పద్ధతి), భౌతికకాయాన్ని సంప్రదాయం ప్రకారం సిద్ధం చేయడం, శాస్ర్తోక్తంగా కర్మకాండలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేయడం.. ఆ మరణం విదేశాల్లో సంభవించి ఉంటే భౌతికకాయాన్ని మాతృభూమికి రప్పించేందుకు అవసరమైన పత్రాలను సమకూర్చడం.. పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలించడం.. అంత్యేష్టి బాధ్యతలు. ఈ సంస్థ అవయవ దానం ద్వారా మరొక ప్రాణం నిలబెట్టేందుకూ ప్రయత్నిస్తుంది. దగ్గరి బంధువులకు ఆ మహాదానం గురించి అవగాహన కల్పిస్తుంది. అవయవాలు అవసరం ఉన్నవాళ్లు సంస్థ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ‘అంత్యేష్టి మా దృష్టిలో వ్యాపారం కాదు. ఓ సామాజిక బాధ్యత’ అంటారు శ్రుతి.
సూక్ష్మక్రిములతో యుద్ధం!
– శ్రీవల్లి శిరీష, నియో ఇన్వెంట్రానిక్స్
వైద్య, ఆరోగ్య సంబంధ సేవల్లో సాంకేతికతను జోడించడం ద్వారా ఆ సేవల్ని మరింత సులభతరం, సురక్షితం చేస్తున్నది నియో ఇన్వెంట్రానిక్స్ సంస్థ. ఇక్కడ రూపొందేవన్నీ పర్యావరణ హితమైనవే. కొవిడ్ ప్రబలిన సమయంలో కరోనా వైరస్ను అంతం చేసే.. జెర్మిబ్యాన్ యూనిట్ను ఆవిష్కరించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ‘నియో’ అధినేత్రి శిరీష. దవాఖానాలు, అందులోనూ ఆపరేషన్ థియేటర్లలో ప్రాణాంతక సూక్ష్మజీవులను రసాయనాలతోనే కాకుండా శక్తిమంతమైన కాంతితోనూ నిర్మూలించేందుకు జెర్మిబ్యాన్, జెర్మిసైడల్ ల్యాంప్లను తయారుచేసింది నియో. వాయు కాలుష్యాన్ని తగ్గించే ఎయిర్ ప్యూరోనూ రూపొందించింది. ‘క్రిమినాశక పరికరాల తయారీలో నాకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. అదే నన్ను కొత్తదనం వైపు నడిపిస్తున్నది’ అంటారు శిరీష.
పచ్చని ప్రకృతి కోసం..
-ప్రతిభా భారతి, నేచర్స్ బయోప్లాస్టిక్
ఆమె కనుక యాక్సెంచర్లో ఉద్యోగాన్ని కొనసాగించి ఉంటే అందరిలానే మిగిలిపోయేది. పర్యావరణం పట్ల ప్రేమ, ప్రకృతిని కాపాడాలనే పట్టుదల ప్రతిభా భారతిని కొత్త దారిలో నడిపించాయి. రోజురోజుకూ పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలుగుతున్న హానికి అడ్డుకట్ట వేసేందుకు ఆమె కంకణం కట్టుకున్నది. ‘నేచర్స్ బయోప్లాస్టిక్’ను స్థాపించింది. వికృత రూపంతో ప్రకృతికి సవాలు విసురుతున్న ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా బయో డీగ్రేడబుల్ ఉత్పత్తులను అందిస్తున్నది ఆ సంస్థ. ‘కర్బన ఉద్గారాలను తగ్గించడం, పూర్తిగా మట్టిలో కలిసిపోయే లేదా కంపోస్ట్గా మారే ఉత్పత్తులను మాత్రమే వినియోగించేలా ప్రజల్ని ప్రోత్సహించడం నా తక్షణ కర్తవ్యం’ అని చెబుతున్నప్పుడు ఆమె గొంతుకలో అపారమైన ఆత్మవిశ్వాసం.