ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన
జగిత్యాల విద్యానగర్, జూలై 5: గడిచిన రెండేళ్లుగా కరోనాతో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రూ.50లక్షల నిధులతో నిర్మించనున్న ఐదు అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఎక్కువ ఇబ్బంది పడ్డది విద్యావ్యవస్థ అని అన్నారు. కరోనా వల్ల పిల్లల చదువులు అస్తవ్యస్థంగా తయారయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కృషి చేశారన్నారు. మహిళా డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ రవీందర్ మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. హరితహారంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ, తాను ఇక్కడి పూర్వ విద్యార్థినని, ప్రభుత్వ కళాశాలల్లో కార్పొరేట్ తరహాలో విద్య అందుతుందన్నారు. జగిత్యాలకు మెడికల్ కాలేజీ రావడం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ముందుండాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సహకారంతో జిల్లా పరిషత్ నిధుల ద్వారా కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆన్లైన్ అడ్మిషన్లో భాగంగా దోస్త్ పోస్టర్ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, కౌన్సిలర్లు చుక్క నవీన్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ మురళి, అధ్యాపకులు సత్య ప్రకాశ్, పడాల తిరుపతి, సాయి మధుకర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
జగిత్యాల అర్బన్, జూలై 5: పట్టణంలోని 3, 15, 19, 23, 24వార్డుల్లో ఐదోరోజూ పట్టణ ప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి. 23, 24వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి పర్యటించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బీట్బజార్ ఏరియాలో మాస్టర్ ప్లాన్ జోనల్ వ్యవస్థ మార్పుపై కౌన్సిలర్, వార్డు ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణికి కృతజ్ఞతలు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, వైస చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, ముస్కు నారాయణ రెడ్డి, జుంబర్తి రాజ్కుమార్, గుర్రం రమేశ్, అనుమల్ల కృష్ణహరి, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, ఆరుముళ్ల పవన్, కూతురు శేఖర్, సిరికొండ రాజయ్య, ప్రశాంత్ రావు, మొగిలి, డీఈ లచ్చిరెడ్డి, హరితహారం ఇన్చార్జి విద్యాసాగర్ రావు, మున్సిపల్ అధికారులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
జగిత్యాల రూరల్, జూలై 5: జగిత్యాల మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన దేవమ్మకు మంజూరైన రూ.60వేలు, జగిత్యాలకు చెందిన నిర్మలకు మంజూరైన రూ.38వేలు, రాజుకు రూ.22,500 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అందించారు. సోమవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ కౌన్సిలర్ కూసరి అనిల్, ఎఫ్సీఎస్ డైరెక్టర్ ఆరుముళ్ల పవన్, నాయకులు తిరుమలయ్య, మోహన్రావు, గంగారాం తదితరులు పాల్గొన్నారు.