మార్చి 21.. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో తెల్లటి కుర్తా, ధోతీ ధరించిన ఓ వయోధికుడు పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన ఘట్టం భారతీయుల హృదయ ఫలకాలపై చెరగని ముద్ర వేసింది. ఎంత వినయం! ఎంత సంస్కారం! ఎంత నిరాడంబరత! రాష్ట్రపతి, ప్రధానమంత్రికి వినయంగా ప్రణమిల్లిన దృశ్యం ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఎవరా కురువృద్ధుడు?
..ఆ పెద్దాయన 125 ఏండ్ల యోగా గురువు స్వామి శివానంద. ఆధ్యాత్మిక కేంద్రం వారణాసి ఆయన కార్యక్షేత్రం. శివానంద 1896 ఆగస్టు 8న నేటి బంగ్లాదేశ్లోని సిల్హేట్ జిల్లాలో జన్మించారు. ఆరేండ్ల వయసులోనే తల్లిదండ్రులకు దూరమైపోయారు. గురు ఓంకారానంద గోస్వామి పెంచి పెద్దచేశారు. 50 ఏండ్ల నుంచీ శివానంద అణగారిన ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. వారణాసి, పూరి, హరిద్వార్, నవద్వీప్ కేంద్రాలుగా తన సేవలను అందిస్తున్నారు. సుదీర్ఘ జీవిత ప్రయాణంలో శివానంద ఆరోగ్యానికి కారణమైన అలవాట్ల గురించి ఆయన మాటల్లోనే…
తెల్లవారు జామున మూడు గంటలకే నిద్రలేస్తాను. కాలకృత్యాలు తీర్చుకున్నాక భజన, వ్యాయామం చేస్తాను. తర్వాత ఓ అరగంటపాటు యోగా, కొంతసేపు ధ్యానం. ఇవన్నీ అయ్యాక ఓ గంటపాటు ఉదయపు ఎండలో గడుపుతాను. అన్నట్టు, పొద్దున లేవగానే నీళ్లు తాగుతాను. ఎండాకాలంలో మామూలు నీళ్లు, చలికాలంలో గోరు వెచ్చటి నీళ్లు తీసుకుంటాను. ఆహారం విషయానికి వస్తే సాత్వికాహారం మాత్రమే తింటాను. అదే నాకు సంతృప్తిని ఇస్తుంది. పొద్దున ఉపాహారంగా మరమరాలు, మధ్యాహ్న భోజనంలో కొంచెం ఉప్పు, పచ్చి మిరప తురుము చల్లిన..ఉడికించిన ఆలుగడ్డలతో రెండు చపాతీలు తీసుకుంటాను. వీటితోపాటు ఏదో ఒక ఆకుకూర. పండ్లు, పాలు, స్వీట్లు ముట్టుకోను. పేదలకు అందుబాటులోలేని పదార్థాలు, నాకెందుకనే ఉద్దేశంతో వాటిని దూరంపెట్టాను.
నీళ్లు తినాలి… ఆహారం తాగాలి
నా రాత్రి భోజనం 7.30 కల్లా పూర్తవుతుంది. చురా లేదా కప్పు బార్లీ మాత్రమే తీసుకుంటా. ధ్యానం తర్వాత, 9 గంటలకల్లా నిద్రకు ఉపక్రమిస్తాను. ఇది నా దినచర్య. నూనె లేని ఆహారాన్నే ఇష్టపడతాను. ‘ద్రవాలను తినాలి, ఘన పదార్థాలను తాగాలి’.. ఇదే నా సలహా. అంటే… నీళ్లను కొద్దికొద్దిగా అన్నం తిన్నట్లుగా తాగాలి. ఆహారమైతే నోట్లో ద్రవంలా మారాకే మింగాలి. మామూలు అన్నంలో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుని తినడానికి ఇష్టపడతాను. భోజనానికి ఓ గంట ముందు, గంట తర్వాత నీళ్లు తాగాలి. అప్పుడే, ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఎవరైనా సరే ఆహారపు అలవాట్లపై నియంత్రణ కలిగి ఉండాలి. ఆహారాన్ని కాదు, శరీరాన్ని ప్రేమించాలి. నేను యోగా ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. కానీ, కొన్ని ప్రాథమిక ఆసనాలను క్రమం తప్పకుండా వేస్తాను. మనసు ప్రశాంతంగా ఉండటానికి, శరీర ఆరోగ్యానికి యోగా ఉపకరిస్తున్నది. ధ్యానం, భజన వంటి ఆధ్యాత్మిక వ్యాయామాలూ మనిషికి అవసరమే.