‘ఇన్నాళ్లకు నాయకత్వ స్థానాల్లో ప్రతిభ కనబరిచే అవకాశం వచ్చింది. కల్నల్ హోదాలో సైన్యాన్ని ముందుకు నడుపుతాం’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ఆ సైనిక సివంగులు. నిజంగా ఇది చారిత్రక సందర్భం. సైన్యంలో పనిచేస్తున్న 108 మంది మహిళా అధికారులకు తొలిసారి పదోన్నతి కల్పించారు. కల్నల్ హోదా సాధించే అవకాశం ఇచ్చారు. వార్షిక పనితీరు నివేదికల ఆధారంగా వారికి ప్రమోషన్లు లభిస్తాయి. గతంలో మహిళలకు ఆ వెసులుబాటు లేదు.
2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు నేపథ్యంలో ‘కల్నల్ హోదా’ కల నిజం కానున్నది. సైన్యంలో బ్రిగేడియర్, మేజర్ జనరల్ లాంటి అనేక హోదాలున్నా క్షేత్రస్థాయిలో సైన్యంతో నేరుగా సంబంధాలు కలిగి ఉండేది ఒక్క కల్నల్ మాత్రమే. ఇన్నాళ్లకు ఆ అవకాశం రావడం సాధికారత దిశగా ముందడుగని మహిళా అధికారులు సంబురపడుతున్నారు. ప్రస్తుతం ఆర్మీలో 1,705 మంది, ఎయిర్ ఫోర్స్లో 1,640 మంది, నేవీలో 509 మంది మగువలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.