హరిహరులకు భేదం లేదని చెప్పే దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట. కొండమీద గుహలో నరసింహుడు, ఆ చెంతనే హరుడు కొలువై
భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా.. శివాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఆలయ పునః ప్రారంభానికి ఈ నెల 25న ముహూర్తం నిర్ణయించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శివయ్య మందిరం విశేషాలు..
యాదాద్రి క్షేత్రం మొదటినుంచీ హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నది. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కొండపై ఉన్న శివాలయాన్ని సందర్శిస్తారు. ప్రధాన ఆలయం అభివృద్ధిలో భాగంగా శివాలయాన్నీ విస్తరించారు. గతంలో 500 చదరపు గజాల్లో ఆలయం ఉండేది. ఇప్పుడు ఎకరం విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. అత్యాధునిక హంగులతో శివుడి కోవెలను అభివృద్ధి చేశారు. చుట్టూ ప్రాకారంతో ప్రధాన ఆలయాన్ని కళాత్మక నిలయంగా మార్చారు. నవగ్రహ మంటపం, ఆంజనేయస్వామి మంటపం, మరకత మంటపం నిర్మించారు. శివాలయం లోపలి రాతి ముఖమంటపంలో ఆంజనేయస్వామి దేవాలయం, గణపతి దేవాలయం, పర్వతవర్ధిని అమ్మవారి దేవాలయం, యాగశాల నిర్మించారు.
ప్రాకారం సాలహారంలో అద్భుత శిల్పాలను కొలువుదీర్చారు. అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనా మూర్తులను ఏర్పాటుచేశారు. శివాలయం ముఖమంటపం ఎదురుగా ధ్వజస్తంభానికి వెనుక వైపు ఆవరణలో ప్రత్యేక పీఠంపై నంది విగ్రహాన్ని రూపొందించారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. కల్యాణ మంటపం, రథశాలలను అడుగడుగునా ఆధ్యాత్మికత తొణికిసలాడే విధంగా తీర్చిదిద్దారు. కార్తిక మాసంలో దీపోత్సవం నిర్వహించడానికి వీలుగా ఆలయ ప్రాంగణంలో దీపాల మంటపాన్ని నిర్మించారు. ఆలయానికి తూర్పు రాజగోపురం నుంచి వచ్చే విధంగా క్యూలైన్లు ఏర్పాటుచేశారు.