యాదాద్రి/ఆలేరురూరల్, జనవరి24 : సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పం, అకుంటిత దీక్షతో దేశంలోనే యాదాద్రి జిల్లా ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటున్నదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం ఆలేరు మండలం శారాజీపేటలో గ్రామ సంఘం, విగ్రహ దాత గౌడ ఐక్యసాధన సమితి జిల్లా అధ్యక్షుడు కదిరం మహేశ్గౌడ్ ఆధ్వర్యంలో స్థాపించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 400 ఏండ్ల తర్వాత రూ.11వేల కోట్లతో ప్రపంచ హిందూ సమాజం గర్వపలా పూర్తి కృష్ణశిలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం పునర్నిస్తున్నారన్నారు. నృసింహ స్వామి జలాశయ సమీపంలో బృందావన్ గార్డెన్, బోటింగ్, శిల్పారామం, భువనగిరి కోట వంటి చారిత్రక కట్టడాలతో యాదాద్రి జిల్లా గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 9వ శతాబ్దంలో రాష్ట్రకూటులు, కల్యాణిచాళుక్యులు, బౌద్ధులు పరిపాలించిన కొలనుపాక, రాముడి నడయాడిన జీడికల్ ఆలయాల ను అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
బహుజనవాది సర్వాయి పాపన్న
మొఘల్రాజుల ఆధిపత్యాన్ని అంతం చేయాలని వారికి తాబేదారులు, జమీందారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములను ఎదురించి గోల్కొండ కోటపై బడుగుల జెండాను ఎగురవేసిన గొప్ప బహుజన వాది సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి అన్నారు. ఆయన అడుగు జాడల్లోనే సీఎం కేసీఆర్ ఆంధ్రపాలనను అంతం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో రూ.8కోట్లతో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేయబోతున్నామని వెల్లడించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరితే ఆలేరులో సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మిత్రుడి పేరు తన ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప మానవతావాది సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. మొఘలుల నిరంకుశ పాలనను అంతమొందించేందుకు తయారు చేసిన సైన్యంలో సర్వాయి అనే రజకుడు చనిపోతే ఆయన పేరును తన ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప మానవతావాది సర్వాయి పాపన్నగౌడ్ అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కొనియాడారు. యాదగిరిగుట్టకు సెట్విన్ కేంద్రాన్ని మంజూరు చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్కు ప్రభుత్వ విప్ ధన్యవాదాలు తెలిపారు.
గౌడ్, సర్పంచ్ బండ పద్మాపర్వతాలు, ఎంపీటీసీ బత్తుల నరేందర్రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షుడు దూడల లక్ష్మణ్గౌడ్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, గౌడ సంఘం నాయకులు మొరిగాడి అశోక్, మొరిగాడి శ్రీనివాస్, పుట్ట మల్లేశ్, దూడల సిద్దయ్య, సంతోశ్కుమార్, గౌడ ఐక్య సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు మాదాసు విజయరాణి పాల్గొన్నారు.