యాదాద్రి భువనగిరి, మే 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెరిగిన సాగు విస్తీర్ణం.. గణనీయంగా వస్తున్న దిగుబడులు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా..సొంత ఊర్లలోనే పుష్కలంగా లభిస్తున్న ఉపాధితో రైతు కుటుంబాలు మరింతగా సంతోష పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 291 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. అయితే ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం దించుకుని, ఎత్తడం మొదలుకుని కాంటా వేసే వరకు హమాలీ బాధ్యతలను స్థానిక కూలీలే నిర్వర్తిస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని 13 మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 95 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటున్నారు.
వీటిల్లో హమాలీలుగా పనిచేస్తున్న 1,937 మంది స్థానిక కూలీలే ఉండటం గమనార్హం. పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 192 కొనుగోలు కేంద్రాల్లోనూ 2వేలకు పైగా స్థానిక కూలీలు హమాలీలుగా పని చేస్తున్నారు. వీరంతా ప్రతిరోజూ రూ.700 నుంచి రూ.వెయ్యి చొప్పున నెలకు రూ.20వేలకు పైగానే కూలీ రూపేణా ఆదాయం పొందుతున్నారు. పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణకు సిబ్బంది కొరత ఉండటంతో తాత్కాలిక పద్ధతిన స్థానిక నిరుద్యోగులను కేంద్రం ఇన్చార్జిలుగా నియమించారు. వీరికి నెలనెలా రూ.5వేల వరకు వేతనం ఇస్తున్నారు. ఇతనికి సహాయంగా మరొకరిని కూడా నియమించి రూ.4వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. టార్పాలిన్లను సమకూర్చడం ద్వారానూ స్థానిక రైతులు కొందరు కిరాయి రూపేణా ఆదాయం పొందుతున్నారు.
బీహార్ కూలీల వలసలకు బ్రేక్..
జిల్లాలో పలు ప్రాంతాల్లో హమాలీలుగా పనిచేస్తున్న బీహార్ రాష్ర్టానికి చెందిన వారికి సైతం కొనుగోలు కేంద్రాలు ఉపాధి గనిగా మారాయి. భువనగిరి, బీబీనగర్, వలిగొండ, భూదాన్పోచంపల్లి, అడ్డగూడూరు, ఆత్మకూరు, చౌటుప్పల్, మోత్కూరు, గుండాల, మోటకొండూరు, రామన్నపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో 492 మంది బీహార్ కూలీలే హమాలీలుగా పనిచేస్తున్నారు. జిల్లాలోని మిగిలిన మండలాల్లోనూ మరో 200 వరకు బీహారీలే ఉంటారు. గత ఏడాది లాక్డౌన్లో వీరంతా తమ సొంతూర్లకు వలసవెళ్లగా.. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించడంతో ఈసారి బీహార్ కూలీల వలసలకు బ్రేక్ పడింది.
సంఘ బంధాలకు ఆర్థిక పరిపుష్టి
జిల్లాలో 555 సంఘ బంధాలు ఉండగా, వీటి పరిధిలో 14,564 మహిళా సంఘాలు ఉన్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ప్రభుత్వం ప్రతి క్వింటాలుకు రూ.35 చొప్పున కమీషన్ను సంఘ బంధాలకు చెల్లిస్తున్నది. గత ఏడాది రబీలో 13.12 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరుగగా, రూ.4.15కోట్ల వరకు కమీషన్ డబ్బులు సంఘ బంధాల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈసారి 4.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్న నేపథ్యంలో సుమారు రూ.5కోట్ల వరకు కమీషన్ వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుత యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు 95 కేంద్రాల్లో జరుగుతుండగా.. ప్రతి కేంద్రంలోనూ నలుగురు నుంచి ఐదుగురు కొనుగోళ్ల వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇందుకు ప్రతిగా వీరికి ప్రతిరోజు రూ.200 నుంచి రూ.500 వరకు చెల్లిస్తుండగా, నెలకు ప్రతి సంఘం సభ్యురాలు రూ.5-6 వేల వరకు గౌరవ వేతనం పొందుతున్నారు.సంఘ బంధాల్లో జమ అవుతున్న కమీషన్ డబ్బులతో రుణాలను విరివిరిగా పొందే వెసులుబాటు మహిళా సంఘాలకు కలుగుతున్నది.
రైతుల ఇండ్లల్లో కాసుల గలగలలు..
జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు నెలకొనడంతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 2.40లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయగా, 4.80మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 291 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నది. ఇప్పటి వరకు 22,501 మంది రైతుల నుంచి 1,97,371 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ.299.68 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉండగా, ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన ధాన్యానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.170.68 కోట్లను అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం విక్రయించిన మూడు నాలుగు రోజుల్లోనే ధాన్యం డబ్బులు చేతికి అందుతుండటంతో రైతాంగం సంబురపడుతున్నది.