యాదాద్రి, జూలై4: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గంలో యాదాద్రి కొండపైన నిర్మించిన వీవీఐపీ అతిథి గృహానికి చేరుకున్నారు. కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆలయ ఈవో గీత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు, పోలీసుల, ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన లిప్టు సాయంతో స్వామివారి బాలాలయంలోకి వెళ్లారు. బాలాలయ ద్వారం వద్ద జస్టిస్కు ఆలయ ప్రధానార్చకులు, అధికారులు భాజాభజంత్రీలు, వేదమంత్రాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి గర్భాలాయానికి వెళ్లిన జస్టిస్ హిమాకోహ్లి కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశా రు. అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భం గా ఆలయ ఈవో గీత హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆలయ ప్రాశస్ర్త్యాన్ని వివరించారు.
పునర్నిర్మాణ పనులను పరిశీలించిన హైకోర్టు సీజే
లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను హైకోర్టు సీజే జస్టిస్ హిమాకోహ్లి పరిశీ లించారు. యాదాద్రీశుడికి పూజలు నిర్వహించిన అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రధానాలయం, మాఢవీధులు, ప్రధానాలయం లోపలిభాగంలోని మండపాలు, సప్త రాజగోపురం, పంచతల రాజగోపురాలు, స్వామివారి నూతన గర్భాలయం, యాలీ పిల్లర్లను పరిశీలించారు. పంచనారసింహులను సందర్శించి లోపలి ప్రాకారంలో ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ శైలి, స్థపతులు నిర్మించిన తీరు, ఉత్తర, తూర్పు దిశలో చేపట్టిన ఆలయ నగరిని జస్టిస్ హిమాకోహ్ల్లి పరిశీలించారు. సుమారు అరగంటపాటు ప్రధానాలయం చుట్టూ కలియతిరిగి ఆలయ వైభవాన్ని కనులారా వీక్షించారు. యాదాద్రి కళావైభవాన్ని ఆలయ అధికారులు వివరించారు.