భువనగిరి ఆర్బన్ : సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, ప్రాజెక్టు, ఇరిగేషన్ అధికారులు, ఆర్డీవోలతో సమావేశం ఏర్పాటు చేశారు. బస్వాపూర్ జలాశయం ప్రధాన కాలువ నిర్మాణ పనులకు సంబంధించి భూ నిర్వాసితులకు నష్టపరిహరం వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ ప్రాంతానికి సంబంధించి రూ. 35కోట్ల నిధులు మంజూరయ్యాయని, అదే తరహాలో బస్వాపూర్ జలాశయానికి సంబంధించి నిధులు రానున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యత గల పనులు గుర్తించి వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వలిగొండ మండలంలోని టేకులసోమారం గ్రామానికి సంబంధించి, ఆలైన్మెంట్ విషయమై కోర్టులో కేసు వేసినందున తిరిగి అలైన్మెంట్ చేపట్టాలని సూచించారు. కోర్టు కేసులో ఉన్న పనులను సంబంధించి వెంటనే కౌంటర్ దాఖలు చేసి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి సంబంధించిన 1.20 ఎకరాలకు రిజిస్ట్రేషన్ ఇచ్చినందున, సర్వే చేసి, భూసేకరణ పనులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సేకరించిన భూములు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ కోరారు. సమీక్షా సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, ఆర్డీవో సూరజ్కుమార్, ఇన్చార్జి డీఆర్వో విజయకుమారి, ఇరిగేషన్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.