హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం(ఖరీఫ్) పంటల సాగు 1.40 కోట్లకు పైగా విస్తరించి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయ, సహకార కార్యదర్శి ఎం. రఘునందన్ రావు, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. కేశవులుతో మంత్రి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
రైతులకు విత్తనాలను సరఫరా చేయడంలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉందన్నారు. ఈ సీజన్లో వివిధ రకాలైన విత్తనాలు 13.06 లక్షల క్వింటాళ్లు అవసరమవుతాయని భావించగా ఇప్పటికే 18.287 లక్షల క్వింటాళ్ల విత్తనం అందుబాటులో ఉందని తెలిపారు. ఈ సీజన్లో 70.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగు, 20 లక్షల ఎకరాల్లో పప్పు దినుసులు, 41 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
వరి బదులు రైతులు మార్కెట్లో గిరాకీ ఉన్న పప్పు ధాన్యాలు, పత్తి వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణలో పండించే పత్తికి భారీ డిమాండ్ ఉందన్నారు. జిల్లాల్లో క్లస్టర్ వారీగా రైతులకు విత్తనం లభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. క్లస్టర్ వారీగా ఎక్కువ డిమాండ్ ఉన్న విత్తనాల సరఫరాను అధికారులు అందుబాటులో ఉంచేలా చూసుకోవాలన్నారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భారీగా అకాల వర్షపాతం నమోదైంది కాబట్టి సోయా బీన్ విత్తనాలు అందుబాటులో లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విత్తనాలను సరఫరా చేయడం లేదని మంత్రి తెలిపారు. సోయా బీన్స్కు బదులుగా ప్రత్యామ్నాయ పంట కోసం వెళ్లాలని రైతులకు సూచించారు. ప్రైవేటు డీలర్ల నుండి సోయా విత్తనాన్ని కొనుగోలు చేసేటప్పుడు రైతులు నాణ్యతను తనిఖీ చేసుకోవాలన్నారు. రైతులు వేరుశెనగ, నువ్వులు, ఆవాలు వంటి పంటలను పండించాలని సూచించారు.