సూర్యాపేట, ఏప్రిల్ 24 : ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్యక్షతన అధికారులతో ధాన్యం కొనుగోళ్ల పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకు రావాలని, తద్వారా మద్దతు ధర పొందవచ్చున్నారు. జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం 2019 లో 3 లక్షల 19 వేల ఎకరాలు సాగు చేస్తే, 2020-21లో 4,31,706 ఎకరాల విస్తీర్ణం పెరిగిందన్నారు. అదే స్థాయిలో దిగుబడి 10 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలను పెంచామని తెలిపారు.