సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్లో ఇటీవల ఓ మహిళ ఫుట్పాత్పై మృతిచెందడంతో ఆమె కూతురును సఖీ కేంద్రం అమ్మలా ఆదరించింది. అమాయకత్వం కారణంగా దారి తప్పిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు చూపుతున్నది. కరోనా సమయంలోనూ విశేష సేవలను అందించినందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రశంసలు అందాయి. సఖీ కేంద్రం నిర్వాహకులు కల్పించిన భరోసాతో ఓ బాలిక వ్యభిచార ముఠాగుట్టును బయటపెట్టింది. గతేడాది అక్టోబర్లో 181కాల్ ద్వారా సఖీ కేంద్రం నిర్వాహకులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలికను వ్యభిచార కూపం నుంచి కాపాడి ఆశ్రయం కల్పించారు. మరో 15మంది బాలికలకు మత్తు, స్టెరాయిడ్స్ ఇచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చి నిర్వాహకులను అరెస్టు చేసి జైలుకు పంపారు. అంతే కాకుండా 2019లో లైంగికదాడికి గురైన మరో బాలికను చేరదీసి విద్యావకాశాలు కల్పించింది. దీంతో ఆ బాలిక ఇంటర్మీడియట్లో ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణత సాధించింది.
25వేల మందికి పైగా అవగాహన..
సఖీ కేంద్రం ద్వారా మహి ళా చట్టాలపై ఇప్పటికే 25 వేల మందికి పైగా అవగాహన కల్పించారు. ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ గ్రామ గ్రామాన మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫోన్, ప్రొజెక్టర్ల ద్వారా సఖీ కేంద్రం అందిస్తున్న సేవలపై జిల్లాలో విసృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కళాశాలల్లో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనూ 475 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, కార్యదర్శులకు మొబై ల్ ద్వారా సఖీ కేంద్రం సేవలపై అవగాహన కల్పించారు.
ఏడాదిలో 351కేసులు నమోదు..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2019ఆగస్టులో ఏర్పాటు చేసిన సఖీ వన్స్టాప్ సెంటర్ మహిళలకు అండగా నిలుస్తూ వారి సమస్యలకు పరిష్కారమార్గం చూపుతున్నది. ఈ క్రమంలో ఏడాది సమయంలో పలు ఘటనల్లో బాధిత మహిళల ఫిర్యాదు మేరకు 351కేసులు నమోదయ్యాయి. ఇందులో గృహ హింస 168, పోక్సో చట్టం కింద 19, చీటింగ్ కేసులు 35, మిస్సింగ్ కేసులు17, లైంగిక వేధింపులు18, వ్యభిచారం కేసులు 2, మానసిక వేధింపులపై మరో కేసు నమోదైంది. వీటిలో 169కేసులు పరిష్కారమయ్యాయి.
అండగా నిలుస్తాం
సఖీ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులుగా భావించి సేవలు అందిస్తున్నాం. హింసకు గురైన మహిళలకు అండగా నిలిచి వారిలో భయాన్ని తొలగించేలా నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం. వారి సమస్యలు అర్థం చేసుకొని అవసరమైన న్యాయ సలహాలు అందిస్తున్నాం.