ఆలేరు టౌన్, జూలై 25 : ప్రత్యేక అవసరాల చిన్నారులకు పూర్తి స్థాయిలో విద్య, వివిధ రకాల సేవలు అందించడానికి ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. చిన్ననాటి నుంచే వారు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వీరికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సరైన పోషకాహారం లభించకపోవడం, జన్యు లోపాలతో కొంత మంది చిన్నారులు చిన్నతనంలోనే పోలియో, పక్షవాతం, వినికిడి లోపం, ఎముకల బలహీనత, బుద్ధిమాంద్యం, బహుళ వైకల్యం తదితర 21 రకాల వైకల్యాలతో బాధపడుతున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా నిధుల కేటాయించి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నది. సాధారణ విద్యార్థుల మాదిరిగానే ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వైద్య సేవలను అందిస్తున్నది. అయితే ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించేందుకు సర్వే చేపట్టింది. ఇటీవలనే ఈ సర్వే ముగిసింది. గతంలో 1832 మంది ఉండగా ఇటీవల సర్వేలో 186 మందిని గుర్తించారు. పాఠశాలకు వెళ్లగలిగే వారు, ఇంట్లో ఉండి చదువుకుంటూ, పాఠశాలకు వెళ్లకుండా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తూ, భవిత కేంద్రాల్లో నమోదు చేసుకొని తదితర వివరాలు సర్వేలో సేకరించారు. జిల్లాలో మొత్తం 2,018 మంది ఉన్నారు. కరోనా కారణంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సకాలంలో సేవలు అందలేదు. వైరస్ ప్రభావంతో ప్రత్యక్ష శిబిరాలు నిర్వహించలేదు. తరగతులు నిర్వహించకపోయినా ఆన్లైన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. సెల్ఫోన్ ద్వారా వారికి అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో 15 భవిత కేంద్రాలు
జిల్లాలో 15 భవిత కేంద్రాలు ఉన్నాయి. గతంలో 1-14 ఏండ్లలోపు వయసు కలిగిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలను మాత్రమే పరిగణలోకి తీసుకొని భవిత కేంద్రాల్లో చేర్పించేవారు. ఇప్పుడు ప్రస్తుతం 19 ఏండ్ల వరకు ఉన్న పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో గుర్తించిన అంగవైకల్యంతో వారు చదువు మానేసి ఇంటి వద్ద ఉంటున్న వారిని గుర్తించారు. ప్రత్యేక ప్రతిభావంతులకు సంబంధించిన 49 రకాల సమాచారాన్ని రిసోర్స్ పర్సన్లు ఇంటింటికీ వెళ్లి గుర్తించి సమాచారాన్ని సేకరించారు. వైకల్యం తీవ్రత, బ్యాంకు ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్ సహ పాఠశాలకు వెళ్తున్నారా తదితర సమాచారాన్ని సేకరించి నమోదు చేశారు. ప్రత్యేక ప్రతిభావంతుల్లో 5 రకాల వైకల్యాలను గుర్తించి వివరాలు నమోదు చేశారు. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి వారి ఆరోగ్యం పరిరక్షించడానికి, చదువు నేర్పించడానికి సమగ్ర శిక్షా అభియాన్ సర్వే నిర్వహించింది. సర్వే ద్వారా గుర్తించిన పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించి శిక్షణ పొందిన ఐఈఆర్పీల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. వారిలో మార్పు వచ్చిన తర్వాత సాధారణ పాఠశాలల్లో చేర్పిస్తారు. శారీరక నిస్సహాయతతో భవిత కేంద్రాలకు రాలేని పిల్లలు ఉంటే ఐఈఆర్పీలు ఇంటికి వెళ్లి సేవలు అందించాల్సి ఉంటుంది.
అందించే సేవలు
భవిత కేంద్రాల్లో చేరిన పిల్లలకు పలు విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తారు. పిల్లలకు అక్షరాలు నేర్పడం, బొమ్మల గుర్తింపు, ఆటలు ఆడించడం, బ్రైయిలీ కిట్ వంటి వాటితో విద్యాబుద్ధులు నేర్పిస్తారు. వారానికోసారి ఫిజియోథెరపీ సేవలు అందిస్తారు. దీంతో పాటు ఆయా అవసరాలు కలిగిన దివ్యాంగ పిల్లలకు మూడు చక్రాల కుర్చీలు, వీల్ చైర్, వినికిడి యంత్రాలు, బ్రైయిలీ కిట్ వంటి పరికరాలు అందిస్తారు. కేంద్రాలకు వచ్చే పిల్లలకు రవాణా చార్జీలు చెల్లిస్తారు. శారీరక వైకల్యం కలిగిన పిల్లలను భవిత కేంద్రంలో చేర్పించడం వల్ల వారి జీవితానికి భరోసా ఉంటుంది. ప్రత్యేక అవసరాల పిల్లలకు వారి వైద్యం, ఇతర అవసరాల కోసం ఆర్థిక భారంతో కుంగిపోతున్న తల్లిదండ్రులకు ఎంతో ఊరట.
186 మందిని గుర్తించాం
సర్వే ద్వారా జిల్లాలో నూతనంగా 186 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించాం. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాల పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావకాశాలు కల్పిస్తున్నాయి. రిసోర్స్ పర్సన్లు ఇంటింటికీ వెళ్లి అన్ని వివరాలు సేకరించారు. గతంలో 1832 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మొత్తం 2,018 చేరింది. ఈ సర్వేలో ఈ ఏడాది 19 ఏండ్ల వరకు అవకాశం కల్పించారు. మానసిక, శారీరక వైకల్యంతో పాటు వినికిడి, జన్యుపరమైన లోపాలతో పుట్టిన వారు, అంధులు తదితర వివరాలు నమోదు చేశారు.
-జోసఫ్, సెక్టోరియల్ అధికారి,భువనగిరి యాదాద్రి జిల్లా