న్యూఢిల్లీ: అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనలో పాల్గొన్న భారతీయ విద్యార్థిని అచింత్య శివలింగన్ను(Achinthya Sivalingan) స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆ వర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో భారతీయ విద్యార్థిని అచింత్యతో పాటు హసన్ సయ్యద్ ఉన్నారు. వర్సిటీ క్యాంపస్లో టెంట్లు వేసేందుకు నిరసనకారులు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీ నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు గ్రాడ్యుయేట్ విద్యార్థులను అరెస్టు చేసి, తక్షణమే వాళ్లను క్యాంపస్ను డిబార్ చేసినట్లు వర్సిటీ ప్రతినిధి జెన్నిఫర్ మోరిల్ తెలిపారు. క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోనున్నారు.
టెంట్లు వేయవద్దు అని ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా ఆ విద్యార్థులు పట్టించుకోలేదని, దాంతో వాళ్లను అరెస్టు చేయాల్సి వచ్చినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రిన్స్టన్ వర్సిటీలోని పబ్లిక్ అఫైర్స్ ఇన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్లో అచింత్య శివలింగన్ మాస్టర్స్ చదువుతోంది. ఇక సయ్యద్ అనే వ్యక్తి ఆ వర్సిటీలోనే పీహెచ్డీ చేస్తున్నాడు. ఇజ్రాయిల్ మిలిటరీ చర్యల వల్ల గాజాలో జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా వేల సంఖ్యలో విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో ఆందోళనలు చేపడుతున్నారు.
ఇటీవల న్యూయార్క్లోని కొలంబియా వర్సిటీలో కూడా పెద్ద ఎత్తు ప్రదర్శన జరిగింది. అమెరికాలోని టాప్ వర్సిటీల్లో ప్రస్తుతం ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.