ఇద్దరూ యువకులు.. విధి నిర్వహణలో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ ఒకరు, స్నేహితుడి జీవనాధారమైన మూగజీవాలను వెతుక్కుంటూ వెళ్లి మరొకరు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు తగిలి బలయ్యారు. ఆదివారం రాత్రి జయశంకర్ జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపిల్లగూడెం అటవీ పరిధిలో ఓ చిరుద్యోగి కరెంట్ తీగలకు తగిలి మృత్యువాత పడడంతో ఇద్దరి కుటుంబాలు పెద్దదిక్కులను కోల్పోయాయి.
మావోయిస్టుల సంచారం, మంగళవారం సీఎం, మంత్రుల మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారి వెంట కాటారం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం రాజోలుగూడకు చెందిన 2012 బ్యాచ్ గ్రేహౌండ్స్ విభాగం జూనియర్ కమాండర్ ఆడే ప్రవీణ్ (34) కూంబింగ్ విధుల్లో ఉన్నాడు. ఆదివారం రాత్రి 30 మందితో కూడిన గ్రేహౌండ్స్ బృందం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతుండగా జంతువులను వేటాడేందుకు భూమికి రెండు ఫీట్ల ఎత్తులో సెంట్రింగ్ వైరుతో వేటగాళ్లు అమర్చిన కరెంట్ ఉచ్చుకు తగిలి ప్రవీణ్ అపస్మారక స్థితికి వెళ్లాడు. అతడి చేతిపై వైరు లోతుగా దిగింది. తోటికానిస్టేబుళ్లు ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నాగార్జునరావు, ఎస్ఐ అభినవ్, గ్రేహౌండ్స్ కమాండోలు ప్రవీణ్ను 108 అంబులెన్స్లో భూపాలపల్లికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. అతడికి భార్య లత, ఇద్దరు కొడుకులు హర్ష, వివాన్ ఉన్నారు. ప్రవీణ్ వెంట ఉన్న గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
ఘటనా స్థలాన్ని ఎస్పీ కిరణ్ఖరే, ఓఎస్డీ అశోక్కుమార్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, ఎఫ్డీవో వజ్రారెడ్డి, రేంజర్ కిరణ్, అటవీశాఖ సిబ్బంది పరిశీలించారు. ఉచ్చు ఏర్పాటు చేసిన వారిలో ఒకరిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపిల్లగూడేనికి చెందిన పిండి రమేశ్ (28), అతడి స్నేహితుడు మాదారపు అనిల్ తమ గొర్రెలు తప్పిపోయాయని చెప్పడంతో వెతికేందుకు ఇద్దరూ కలిసి ఆదివారం సాయంత్రం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. రాత్రి సమయంలో జంతువులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి రమేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. అనిల్ ఊరిలోకి వచ్చి విషయాన్ని రమేశ్ బంధువులకు, పోలీసులకు తెలిపాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని, సీఐ శంకర్, ఎస్ఐ షేక్ మస్తాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రమేశ్ ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి కాగా, అతడికి ఐదునెలల క్రితమే వివాహమైంది. మృతదేహం వద్ద అతడి భార్య రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది.