హనుమకొండ, ఫిబ్రవరి 28: యోగాతో మానవాళి సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ‘హర్ దిల్ ధ్యాన్ – హర్ దిన్ ధ్యాన్’ నినాదంతో శ్రీరామచంద్ర మిషన్, ప్రభుత్వ సహ కారంతో నిర్వహించనున్న యోగా మహోత్సవ కార్య క్రమం సందర్భంగా మంగళవారం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, నగర కమిష నర్ శ్రీరామచంద్ర మిషన్ ప్రతినిధులతో కలిసి విలేకరుల తో మాట్లాడారు. మానవాళి సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, హార్ట్ఫుల్ నెస్, శ్రీరామచంద్ర మిషన్ సంస్థలు భారత దేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో యోగా మహోత్సవాలను నిర్వహించాలని తలపెట్టాయన్నారు. ఇందులో ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, ఆయుర్వేదం, ధ్యానం నేర్పుతారని తెలిపారు. అవగాహన కల్పించేం దుకు మూడురోజులపాటు ఆర్ట్స్ కళాశాలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారన్నారు. భారతదేశ అమృత మహోత్సవాల సందర్భంగా ఈ యోగ మహోత్సవాలను హార్ట్ఫుల్ నెస్ సంస్థ ‘హర్ దిల్ ధ్యాన్.. హర్ దిన్ ధ్యాన్’ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఈ ఉత్సవాలు 2023 ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించారని, ఇప్పుడు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో మార్చి 3, 4, 5 తేదీల్లో నిర్వహిస్తున్నారన్నారు. ఈ యోగ మహోత్సవ్లో మొదటి భాగం శారీరక ఆరోగ్యం కోసం (ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు), రెండో భాగం మానసిక ఆరోగ్యం కోసం (హార్ట్ఫుల్ నెస్ యౌగిక ధ్యాన ప్రక్రియలు) అని తెలిపారు. ఇది ఆందోళన, రోగనిరోధక శక్తి, రక్తపోటు, మధుమేహం అనే ఇతివృత్తాలతో కూడి ఉంటుందన్నారు. ఒక్కో రోజు ఒక్కో విషయానికి సంబంధించిన యోగాసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు నేర్పుతారన్నారు. ఇందులో విద్యార్థులు, సామాన్యులు, వృద్ధులు, యువత పాల్గొనాలని కోరారు. 3వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుందని, 4 వ తేదీన ఉదయం 6.30 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు, 5వ తేదీ ఉదయం 6.30 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు నిర్వహిస్తారన్నారు. హార్ట్ఫుల్ నెస్, శ్రీరామ చంద్రమిషన్ అనేసంస్థలు లాభాపేక్ష లేనిఆధ్యాత్మిక సంస్థలని, అన్ని వర్గాల ప్రజలకు యోగా, ధ్యానాల్లో ఉచితంగా సమగ్రమైన శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్నిమతాలు, అన్నివర్గాలకు చెందినవారు ఈ ప్రక్రియల ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్నారు. అనుభవజ్ఞులైన శిక్షకులతో శిక్షణ ఉంటుందన్నారు. ఈ సదవకాశాన్ని వరంగల్ మహానగర, ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
యాంత్రిక జీవనంలో మనం అనేక రకాల ఒత్తిళ్లకు, అనారోగ్యాలకు గురవుతున్నామని, యోగా, ధ్యానంతో వీటన్నింటి నుంచి దూరమై ఆరోగ్యవంతులుగా ఉండవ చ్చని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నా రు. దీంతో అనేక రోగాలను తగ్గించుకోవడంతోపాటు నియంత్రించుకోవచ్చన్నారు. ఆరోగ్యవంతమైన సమా జాన్ని నిర్మించేందుకు అనేక దేశాలు, ప్రభుత్వాలు యోగా కు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. యోగ, ధ్యానాన్ని రోజువారీ కార్యక్రమాల్లో చేర్చాలన్నారు. చారిత్రక నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదైనాంలో నిర్వహించనున్న మూడు రోజుల శిక్షణలో అనేక మంది ప్రముఖులు పాల్గొంటారన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, వృద్ధులు, యువకులు పాల్గొనాలని చీఫ్విప్ కోరారు. ఒత్తిడిని జయించేందుకు యోగ, మెడిటేషన్ చాలా ముఖ్యమని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని, అలాగే ఉద్యోగులు పాల్గొనేలా సూచిస్తామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ యోగా మహోత్సవం విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేస్తామని హ నుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, గోపి అన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోపడే ప్రక్రియ అని వారు పేర్కొన్నారు. ఒత్తిడి సమయంలో యోగ ప్రక్రియ మానసిక ప్రశాంతత కోసం చాలా ఉపయోగపడుతుందని హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి అన్నారు. ప్రతి ఒకరూ యోగాను అలవాటు చేసుకోవాలని, యోగ, మెడిటేషన్లు జీవితం లో ఒక భాగం కావాలన్నారు. ఎంబీబీఎస్ కోర్సులో యోగాను ఒక అంశంగా చేర్చతున్నట్లు తెలిపారు. దైనందిన జీవితంలో యోగ, ధ్యానం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని కేయూ వీసీ టీ రమేశ్ అన్నారు. మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు, ప్రభావాలను యోగతో అరికట్టవ చ్చన్నారు. ఈ సందర్భంగా పోస్టర్, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. నగర కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, రామచంద్ర మిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.