అన్నదాతలకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటి.. బోర్లు, బావులు ఎండిపోయి సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఓవైపు మానేరు ఎండిపోవడం, డీబీఎం 38 కాలువ ద్వారా ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవడంతో వ్యవసాయానికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లందించి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం పట్టింపులేని తనంతో కళ్లెదుటే పంటలు ఎండిపోతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటున్నది.
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఎండాకాలం ముందే జలం పాతాళానికి పడిపోతుండడం ప్రజలను, రైతులను కలవరపెడుతున్నది. యాసంగి పంటలకే కాకుండా తాగునీటికీ తిప్పలు తప్పేలా లేవు. ప్రస్తుతం ఆవరేజీగా 0.72 మీటర్ల లోతుల్లోకి భూగర్భజలాలు పడిపోయాయి. భూపాలపల్లి, మల్హర్ మండలాల్లో భారీగా అడుగంటాయి.
గతేడాది జనవరి, గడిచిన జనవరితో పోలిస్తే 0.72 మీటర్ల లోతుల్లోకి నీటిమట్టం పడిపోయింది. యాసంగిలో భారీగా పంటల అంచనాలను రూపొందించుకున్న వ్యవసాయశాఖ ఇప్పుడు అంచనాలను మార్చుకునే పరిస్థితి వచ్చింది. ఎండలు ముదిరితే నీటి కష్టాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని భూగర్భ జలశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వారు ఫ్యూజోమీటర్ ఆధారంగా విడుదల చేసిన నివేదికలు రానున్న రోజుల్లో పొంచి ఉన్న నీటి ఇబ్బందులకు సంకేతాలిస్తున్నాయి. గత జనవరి(2023)లో 7.26 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం ఈ జనవరిలో(2024)లో 7.98 మీటర్లకు పడిపోయింది. గతేడాది జిల్లాలో 84వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు కాగా ఈ యాసంగిలో 75వేల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది 11వేల ఎకరాల్లో ఆరుతడి పంట అయిన మక్కజొన్న సాగు కాగా ఈసారి 15వేల ఎకరాల్లో సాగవుతోంది. నీటి సమస్యతో రైతులు వరి సాగు తగ్గించి మక్కజొన్న వైపు మళ్లుతున్నారనేందుకు ఇది నిదర్శనంగా నిలిచింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో గతేడాది చెరువులు, కుంటలు నిండి బోర్లు, బావుల్లో జలాలు పెరిగాయి. పంటల విస్తీర్ణం సైతం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నీళ్లు రాక బోర్లు, బావుల్లో నీటి మట్టం తగ్గి సాగుపై ప్రభావం చూపుతున్నది. ఎస్సారెస్పీ నీరు రాక డీబీఎం 38 కాలువ వెలవెలబోతున్నది. ఈ కాలువ రేగొండ మండలం వద్ద ప్రారంభమై టేకుమట్ల మండలంలో ముగుస్తుంది. మొత్తం 44 వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో డీబీఎం 38 కాలువ ద్వారా సాగునీరు సమృద్ధిగా అందింది. ప్రస్తుతం సాగునీటికి రైతులు తండ్లాడుతున్నారు. మరో 15 రోజులు గడిస్తే నీటిగోస అధికమయ్యే ప్రమాదముందని వాపోతున్నారు.
చివరి ఆయకట్టుకు
ఎల్కతుర్తి, మార్చి 5 : దేవాదుల నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా నార్త్ కెనాల్కు సాగునీరు రాక చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. దీంతో అదునుకు నీరందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి నార్త్ కెనాల్ ద్వారా ఎల్కతుర్తి మండలంలోని దామెర, జీల్గుల, జగన్నాథపూర్, పెంచికల్పేట, భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి, ముల్కనూరు, హుజూరాబాద్ మండలం కాట్రపల్లి, దమ్మక్కపేట వరకు సాగునీటిని అందించేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాల్వలను తవ్వారు. అయితే ఏ రోజు కూడా ఈ కాల్వల ద్వారా రైతులకు సాగునీరు అందలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అప్పటి హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు నీటిని విడుదల చేశారు. ఫలితంగా రైతులకు సక్రమంగా సాగునీరందడమే గాక ఆ నీటితోనే పలు గ్రామాల చెరువులను నింపుకొనేవారు. చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నందున తాగునీటికీ సమస్య రాలేదు. ప్రస్తుతం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి తీవ్ర స్థాయిలో నీటి ఎద్దడి ఏర్పడింది. నార్త్ కెనాల్ ద్వారా దేవాదుల నీళ్లు వస్తున్నా చివరి గ్రామాలకు అందడం లేదు. దీంతో యాసంగిలో ఆయకట్టు కింద వేసిన వరి, మక్కజొన్న తదితర పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. గతంలో ఇదే సీజన్లో కావాల్సిన నీళ్లు అందడంతో పంటలు పండాయని, ఇప్పుడు నీళ్లు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై దేవాదుల డీఈ ప్రశాంతిని వివరణ కోరగా, సరిపడా సిబ్బంది లేక సమస్య వస్తున్నదని, చివరి గ్రామం వరకు నీరందించేలా చూస్తామని చెప్పారు.
లింగాలఘనపురం, మార్చి 5 : దశాబ్దం క్రితం కనిపించిన కరువు మళ్లీ తాండవిస్తున్నది. ఓ వైపు దేవాదుల రిజర్వాయర్ నుంచి నీరు అందక, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీటి సమస్య నెలకొంది. బోరు బావుల్లో నీరు లేకపోవడంతో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో వరి పొలాలు ఎండిపోతున్నాయి. యాసంగిలో వరి నార్లు పోసిన రైతులకు నిరాశే ఎదురైంది. భూగర్భ జలాలు తగ్గడంతో బోర్ల నుంచి నీరు రావడం లేదు. వ్యవసాయ బావుల్లో పూడిక తీసినా నీటి ఊట కనిపించడం లేదు. కొన్నిచోట్ల బావుల్లో నీరొస్తున్నా మరికొన్ని చోట్ల అడుగంటుతున్నాయి. దీనికితోడు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, కూలీల ఖర్చులు పెరగడంతో ఎకరాకు రూ.30 నుంచి రూ.40 వేలు అవసరమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చెరువుల్లో నీరు లేకపోవడం, దేవాదుల రిజర్వాయర్ నుంచి విడుదల చేయకపోవడంతో వరి పైర్లు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు ఎండుతున్న వరి చేన్లను గొర్రెల మేత కోసం పెంపకందారులకు విక్రయిస్తున్నారు.
శాయంపేట, మార్చి 5 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొత్తగట్టుసింగారం నుంచి శాయంపేట వరకు ఉన్న ఎస్సారెస్పీ డీబీఎం-31 కాల్వకు నీళ్లు అందక వెయ్యి ఎకరాల్లో మక్కజొన్న పంట ఎండిపోతున్నదని, వెంటనే నీరందించాలని రైతులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. కాల్వ కింది రైతులు ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయన్న ఆశతో వేలల్లో పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున మక్కజొన్న వేశారు. అయితే 15 రోజులుగా కాల్వ నీళ్లు అందడం లేదని చిన్న ఊట లెక్క వస్తుండడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆయకట్టు రైతులు మచ్చయ్య, కుమారస్వామి, సుధాకర్, అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాల్వ నీళ్లు వస్తున్నాయని, ఎప్పటిలాగే ఈసారి కూడా అదే నమ్మకంతో యాసంగిలో మక్కజొన్న వేస్తే నీళ్లు మాత్రం అందడం లేదని చెప్పారు. గత ప్రభుత్వంలో నీళ్లు పుష్కలంగా వచ్చేవని కానీ ప్రభుత్వం మారిన తర్వాత అధికారులెవరూ పట్టించుకోవడం లేదని, వారం గడువు పెట్టి నీళ్లు ఇస్తామంటున్నారు కానీ రావడం లేదని చెప్పారు. గతంలో పెద్దకోడెపాక, చలివాగు వరకు నీళ్లు అందేవని మరో ఐదు రోజులు పెంచి చివరి వరకు నీళ్లు ఇవ్వాలని కోరారు. సింగారం నుంచి శాయంపేట డీబీఎం-31 కాల్వపై ఆధారపడి 700 నుంచి వెయ్యి ఎకరాలు సాగు చేశామని, నీళ్లు లేక ఎండిపోతున్నదని వాపోయారు. వెంటనే నీళ్లు ఇవ్వకపోతే పంటలు ఎండిపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
నాకున్న ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. మూడు బోరు బావులుండడంతో పొలంపైనే ఆధారపడ్డ. ఎకరానికి రూ. 30 వేలు ఖర్చుచేశా. రోజురోజుకూ భూగర్భ జలాలు తగ్గిపోతుండగా, పొట్ట దశకు వచ్చిన వరికి నీరందక ఎండిపోతోంది. విధిలేని పరిస్థితిలో గొర్రెల మేత కోసం రూ.9 వేలకు పెంపకందారులకు అమ్మిన.
నాకు మానేరు వాగు శివారులో మూడెకరాల భూమి ఉంది. వాగుపై ఆధారపడి సాగుచేసుకుంటున్నా. అదిప్పుడు పూర్తిగా ఎండిపోయింది. నీళ్ల పారకం ఇబ్బందిగా ఉంటే 150 ఫీట్ల లోతు బోరు వేయించిన. నీళ్లు పడలేదు. మరో బోరు వేసిన. నీళ్లు పడ్డయి. మోటర్తోని పొలానికి నీళ్లు పారించుకుంటున్న. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోయిన. పదేండ్లలో ఇసొంటి పరిస్థితి ఎప్పుడూ రాలె.
నీళ్ల గోస మళ్ల మొదలైంది. ఎనుకటి రోజులు మళ్ల గుర్తుకస్తున్నయ్. మానేరు వాగు నీటితో పాటు బావి నీటితో నాలుగెకరాల పొలం పండేది. మానేరు ఎండిపోవడంతో బావి నీళ్లు అడుగంటినయ్. క్రేన్తో బావి తవ్విచ్చిన. రూ.50వేల ఖర్చచ్చింది. అయినా నీళ్లు సరిపోతయో లేదో అనే బాధ ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నపుడు నీటికి గోసలేదు. ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఇప్పుడు పెట్టుబడితో పాటు బావి తవ్విన పైసలైనా వస్తే చాలనిపిస్తుంది. నీళ్లందక పంట ఎండిపోతదేమోనని భయమైతాంది.
నాకు నాలుగెకరాల భూముంది. రెండెకరాల్లో మిర్చి, రెండెకరాల్లో పత్తి వేసిన. బావి నీటితో నాలుగెకరాలు పారేది. ఇప్పుడు నీటి ఊట తగ్గడంతో పక్క రైతు ల బోర్ల నుంచి నీటిని కొనుక్కుంటున్న. ఇట్లయితే కష్టమని నేనే బోరు వేయించుకున్న. బావిలో నీళ్లు అడుగంటి పోకపోతే బోరు వేసే బాధ ఉండకపోయేది.