మారుమూల ప్రాంతానికే పరిమితమైన ఆదివాసీ గూడేలు స్వరాష్ట్రంలో ప్రగతిబాట పట్టాయి. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అడవిబిడ్డల ఆర్థికాభివృద్ధికి ఐటీడీఏ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి కొండంత అండగా నిలుస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విదేశీ విద్యకు ప్రోత్సాహం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ట్రైకార్ ద్వారా వ్యక్తిగత రుణాలు, జీసీసీ ద్వారా పెట్రోల్ బంకులు, రైతులకు కస్టమ్ హైరింగ్ సెంటర్లు, మహిళల కోసం పరిశ్రమల స్థాపన, గిరివికాస్ కింద వ్యవసాయానికి తోడ్పాటునందించేలా రైతులకు విద్యుత్ సౌకర్యం, లక్ష ఎకరాల్లో ఉన్న పోడు భూములకు రైతుబంధు.. ఇలా ఐటీడీఏ ద్వారా అందుతున్న అనేక ప్రోత్సాహకాలు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుండడంతో వారి అభ్యున్నతికి అండగా నిలుస్తున్నాయి.
ఏటూరునాగారం, ఆగస్టు 8: అడవులు, మారుమూల ప్రాంతాలకు పరిమితమైన గిరిజనులను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ఐటీడీఏలను గిరిజన ప్రాంతాల్లో నెలకొల్పింది. అడవిబిడ్డలకు అండగా నేనున్నానంటూ సర్వం తానై బాధ్యత పోషిస్తోంది. గిరిజనుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ విద్య, వైద్య, వ్యవసాయం, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టింది. కేటాయించిన ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే సమాలోచనతో 1982లో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అప్పటి నుంచి అడవి బిడ్డల ఆర్థికాభివృద్ధికి మరిన్ని బాటలు పడ్డాయి. ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆదివాసీ సంఘాలతో పాటు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈమేరకు ఆదివాసీలు ఏటా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పల్లెపల్లెన నిర్వహిస్తున్నారు. గిరిజన విద్యా వికాస కేంద్రాలకే పరిమితమైన విద్యను విదేశీ వరకు తీసుకెళ్లింది.
అనేక ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేయడంతో పాటు విదేశీ విద్యను కూడా ప్రోత్సహిస్తున్నది. బెస్ట్ అవైలబుల్ స్కీం, కాలేజ్ హాస్టల్స్ను ఏర్పాటు చేసింది. గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటుచేసి ఇంటి ప్రసవాల నుంచి వైద్యశాల ప్రసవాలకు చేర్చింది. గిరిజన ప్రాంతాల్లో ఇంజినీరింగ్ శాఖ ద్వారా పాఠశాలలు, రోడ్లు, లింకు రోడ్లు, యూత్ ట్రైనింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గిరిజన భవన్లు, వాగులపై వంతెనల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించింది.
అడవిబిడ్డలకు బాసటగా ఐటీడీఏ నిలుస్తోంది. పోడు రైతులకు రైతుబంధు, యువతకు ఉపాధిలో శిక్షణ, గ్రామీణ ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, జీసీసీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంక్లు, పరిశ్రమలు, రైతులు సొంతంగా నడిపించుకునే కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ఎకనామికల్ సపోర్టు స్కీం కింద ఉపాధి, గిరి వికాస్తో రైతుల భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఐటీడీఏ తన వంతు ఔదార్యాన్ని చూపెడుతోంది. గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి పర్చడంతో పాటు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటుంది.
సంస్కృతీసంప్రదాయాలతో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి పర్చడంలో ఐటీడీఏ అనేక పథకాలను అమలు చేస్తున్నది. అన్ని రంగాల్లో గిరిజనులను అభివృద్ధి పర్చేందుకు అనేక రకాల పథకాలను అమలు చేయడంతో పాటు అటవీ హక్కు పత్రాలు అందచేయడం, వాటికి రైతు బంధు లాంటి పథకాలను కూడా అమలు చేస్తోంది. అంతే కాకుండా గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా కూడా తీర్చిదిద్దుతోంది. వ్యవసాయ రంగంలో రాణించేందుకు సీఎం గిరి వికాస్ స్కీం ద్వారా బోర్లు వేయడం, విద్యుద్దీకరించడంతో గిరిజన రైతుల్లో వెలుగులు నింపుతోంది. ఇలా ఐటీడీఏ అడవి బిడ్డలకు అండగా నిలబడుతోంది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను 21 శాఖల ద్వారా రూ. 15.60 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించారు.
ట్రైకార్ ద్వారా వ్యక్తిగత రుణాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 2021-22 సంవత్సరానికి గాను సబ్సిడీ రూ.55 కోట్లతో 6,761యూనిట్లు మంజూరు చేశారు. వీటిని మండలాల వారీగా విభజించి మండల అభివృద్ధి అధికారులకు పంపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇప్పటివరకు 3,364 యూనిట్లకు గాను రూ.29.21 కోట్లు విడుదల చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా ఏప్రిల్ 2022 నుంచి వివిధ రంగాల్లో శిక్షణ నిర్వహించి జాబ్మేళాల ద్వారా 1,343 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
మహిళల ఉపాధికి పరిశ్రమలు
గిరిజన ప్రాంతాల్లో మహిళలను పారిశ్రామికంగా తీర్చిదిద్దేందుకు ఐటీడీఏ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జేఎల్జీ గ్రూపులను ఏర్పాటు చేసిన ఒక్కో యూనిట్కు రూ.40లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది. ఏటూరునాగారం మండలం శివ్వాపూర్లో రూ.40లక్షలతో డిటర్జెంట్ సోప్ యూనిట్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో రూ. 40లక్షలతో దాల్ మిల్లు, ఏటూరునాగారంలో రూ.40లక్షలతో డ్రై మిక్స్ యూనిట్, ములుగు మండలం జంగాలపల్లిలో రూ. 27.50 లక్షలతో శానిటరీ నాప్కిన్ యూనిట్ను ఏర్పాటుచేశారు. సుమారు ఈ పరిశ్రమలతో వంద మందికి ఉపాధి లభించింది. ఎంఎస్ఎంఈ స్కీం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ జాయింట్ లియబిలిటీ గ్రూపుల ద్వారా రెండు ఇటుకల తయారీ, నాలుగు సెంట్రింగ్ యూనిట్లు, రెండు కాంక్రీట్ మిక్చర్లను అందించారు.
రూరల్ ట్రాన్స్పోర్ట్ కింద రవాణా వాహనాలు
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపర్చడంతో పాటు యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం గిరిజన సంక్షేమ శాఖ అమలుచేస్తున్న రూరల్ ట్రాన్స్పోర్ట్ స్కీంను కూడా అమలు చేస్తున్నారు. డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి సబ్సిడీపై ట్రాన్స్పోర్టు వాహనాలను అందిస్తున్నారు. ఈ పథకం కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలో 195 మందికి రూ.5.61 కోట్లు సబ్సిడీ రాగా ఇప్పటికే 112 మందికి రూ.3.13 కోట్ల సబ్సిడీతో వాహనాలను పంపిణీ చేశారు.
చేపపిల్లల పంపిణీ
ఐటీడీఏ పరిధిలో 814 చెరువులు ఉండగా 66 సొసైటీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ద్వారా 1.62 కోట్ల చేప పిల్లలను ఉచితంగా గిరిజన మత్స్యకారులకు పంపిణీ చేసి చెరువుల్లో పెంచుతున్నారు. రొయ్యల పంపిణీకి అనుకూలంగా ఉన్న జలాశయాల్లో నర్సింహసాగర్ ప్రాజెక్టు, పాలెం వాగు ప్రాజెక్టుల్లో పెంచేందుకు 3లక్షల రొయ్యలను అందజేశారు. ఉమ్మడి జిల్లాలోని గిరిజనులకు భూమి అభివృద్ధి పర్చేందుకు, నీటి వసతి కల్పించేందుకు బ్లాకుల వారీగా బోర్వెల్స్, ట్యూబ్వెల్స్, విద్యుత్ సరఫరా కోసం 3,018 లబ్ధిదారులను గుర్తించి ఇప్పటివరకు రూ.8.54 కోట్లు కేటాయించి గిరిజనులు లబ్ధి పొందేలా చర్యలు తీసుకున్నారు.
గిరిజన సహాయనిధి
గిరిజన సహాయనిధి కింద ఐటీడీఏ ద్వారా 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వరద బాధితులను కలుపుకొని 434మంది గిరిజనులకు రూ.43లక్షలు అందజేశారు. ఇందులో ఇండ్లు కాలిపోయిన వారికి, కూలిపోయిన వారితో పాటు అనారోగ్యంతో ఉన్న వారికి చికిత్స కోసం నిధులను కేటాయించారు. అంతేకాకుండా ఇటీవల వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన గిరిజన కుటుంబాలకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు అందజేశారు. భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు గాను రూ.15లక్షల విలువ చేసే కిరాణా సామగ్రిని మేడారం, ప్రాజెక్టునగర్, ఎలిశెట్టిపల్లి, దొడ్ల, కొండాయి, మల్యాల, గ్రామాల్లోని గిరిజనులకు నిత్యావసర కిట్లు అందజేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు అందించారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వరద ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషిచేస్తున్నారు. 56 ఆశ్రమ పాఠశాలలు, 30 వసతిగృహాలు, 8 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 221 ప్రాథమిక పాఠశాలలు, 13 కాలేజీ హాస్టళ్లు, రెండు జూనియర్ కళాశాలల్లో 11,859 బాలురు, 11,733 మంది బాలికలకు విద్యను అందిస్తున్నారు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 366 మంది విద్యార్థులకు ఈ ఏడాది ప్రవేశం కల్పించారు. ఇక పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం, లైబ్రరీలు ఏర్పాటు చేయడం, డిజిటల్ క్లాసులను నిర్వహించడంతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల పెంచిన మెనూ కూడా అమలుచేస్తున్నారు.
మెరుగైన రవాణా సౌకర్యం
గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా గిరిజన గ్రామాల్లో భవనాలు నిర్మించడం, లింకు రోడ్ల నిర్మాణం, బీటీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గురుకులాలు, ఆర్టికల్ 275, ఎస్సీఏ కింద 1125 పనులకు గాను రూ.626 కోట్లు మంజూరు కాగా, ఇందులో ఇప్పటివరకు రూ. 317 కోట్లు ఖర్చు చేశారు. నీతి అయోగ్ ద్వారా 117 అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణకు రూ.5 కోట్లు మంజూరు కాగా, ఇందులో రూ. 2.76కోట్లు ఖర్చు చేశారు. రూ.7 కోట్లతో 44 సబ్సెంటర్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, ఇందులో 35 పనులు పూర్తి చేశారు. ఇందుకు గాను రూ.4.49 కోట్లను వెచ్చించారు. వీటికి తోడు గ్రామాల్లో బీటీ రోడ్ల కోసం నిధులు మంజూరు కాగా టెండరు దశల్లో ఉన్నాయి.
పోడు భూములకు రైతుబంధు
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 37,987 మంది గిరిజన రైతులకు 1,02,256 ఎకరాలకు హక్కు పత్రాలను అందజేశారు. ఇందులో ములుగు జిల్లాలో 6772 మంది రైతులకు 17,320 ఎకరాలు, జయశంకర్ భూపాపల్లి జిల్లాలో 3210 మంది రైతులకు 7,892 ఎకరాలు, మహబూబాబాద్లో 24,664 మంది రైతులకు 69,645 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 3,271మంది రైతులకు 7,333 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 70మంది రైతులకు 64ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలను ఈ ఏడాది అందించారు. ఈ భూములన్నింటికి కూడా రైతుబంధు అందజేస్తున్నారు. గతంలో 17,006 మంది గిరిజన రైతులకు సుమారు 47వేల ఎకరాలకు హక్కు పత్రాలు అందించగా ఇటీవల అందించిన 1.02 లక్షల ఎకరాలతో కలిపి మొత్తం 1,49,256 ఎకరాలకు రైతుబంధు అమలవుతున్నది.