హనుమకొండ చౌరస్తా, మే 28 : చిరువ్యాపారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక సంక్షేమ మసోత్సవంలో భాగంగా హనుమకొండలోని జీఎంహెచ్ ఎదుట ఉన్న చిరువ్యాపారుల అడ్డాను వినయ్భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం చీఫ్ విప్ వినయ్భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాకార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 31న కార్మిక యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్రావు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్మికులందరూ ఏకమై కార్మి క యుద్ధభేరిని విజయవంతం చేయాలని కోరారు. ‘కార్మికులారా ఏకంకండి.. కోల్పోయిన హకులను సాధించుకుందాం’ అని పిలుపునిచ్చారు. కార్మికుల అభ్యున్నతికి స్ట్రీట్ వెండింగ్ జోన్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చిరువ్యాపారులు మూకుమ్మడిగా ర్యాలీ గా సభకు తరలిరావాలని వినయ్భాస్కర్ కోరారు. కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపెల్లి చందర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ హాల్ ప్రారంభం..
గ్రేటర్ వరంగల్ 8వ డివిజన్లోని గుడిబండల్ ఇందిరానగర్లో దివంగత గరిగె నర్సింహారావు జ్ఞాపకార్థం నూతనంగా నిర్మించిన భీమ్రావ్ కమ్యూనిటీ హాల్ను చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, సీనియర్ సివిల్ జడ్జి జీ ఉదయ్భాస్కర్రావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఇందిరానగర్లోని మాదిరెడ్డికుంట ప్రాం తంలోని ప్రభుత్వ ఖాళీ స్థలంలో కమ్యూనిటీహాల్ నిర్మించడం అభినందనీయమన్నారు. దీని ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు, యువకులకు వృత్తినైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక హంగులతో కూడిన భవన సముదాయాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నర్సింహారావు పేదల పక్షపాతిగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించేవాడని కొనియాడారు. సాధారణ పేద కుటుంబంలో జన్మించి, సివిల్ జడ్జి స్థాయికి ఎదిగిన ఉదయ్భాస్కర్రావు గుడిబండల్ ప్రాంతానికి చెందినవాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి జీ ఉదయ్భాస్కర్రావు మాట్లాడుతూ తన తండ్రి నర్సింహారావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారంతో కమ్యూనిటీహాల్ను నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నలుబోలు సతీశ్, మాజీ కార్పొరేటర్ పుప్పాల ప్రభాకర్, సిద్దోజు రమేశ్, చెన్నం ప్రకాశ్, భీమ్రావ్ కమ్యూనిటీ సభ్యులు సిరిమల్లె సదానందం, అశోక్చంద్ర, పీ రాజేశ్, బాబా శంకర్రావు, ప్రభాకర్, భగవాన్, రాజారాం, రాహుల్, కిరణ్ పాల్గొన్నారు.
క్రెడాయ్ ప్రతినిధులతో చీఫ్ విప్ సమావేశం
నయీంనగర్, మే 28 : కార్మిక మాసోత్సవాల్లో భాగంగా భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆదివారం క్రెడాయ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ కార్మికుల యోగక్షేమాలపై సమీక్షించుకోవాలని, లేబర్ కార్డులు ఇప్పించాలని వారికి సూచించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు అందేలా చూడాలన్నారు. కార్మికుల కోసం నెలకోసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.