ములుగు, ఫిబ్రవరి25(నమస్తేతెలంగాణ): మేడారం సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో 2024 జాతరను విజయవంతం చేయడంలో మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ మార్క్ను చాటుకున్నారు. పోరాట స్ఫూర్తికి చిహ్నమైన వీరవనితల జాతరలో 90 శాతం మంది మహిళలు నిర్వహణాధికారులుగా విధులు నిర్వర్తించి భక్తులకు సేవలు అందించారు. జాతర ఏర్పాట్లను మొత్తం తన భుజాలపై వేసుకొని ప్రతి రోజూ స్వయంగా సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) అత్యంత ప్రధాన పాత్ర పోషించారు.
దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ సైతం అస్వస్థతకు గురైనప్పటికీ తన శాఖ అధికారులతో సమీక్షిస్తూ పలుమార్లు మేడారాన్ని సందర్శించి జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి గత అనుభవం లేనప్పటికీ ప్రతి విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వీరితో పాటు మానుకోట ఎంపీ మాలోత్ కవిత, జడ్పీచైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీజ, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ రాధికాగుప్తా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ట్రెయినీ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, జిల్లా సంక్షేమ అధికారి లెనీనా, డీపీఆర్వోలు బండి పల్లవి, ఈవీ కిరణ్మయి, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్లు హేమలత, సమాచార ఇంజినీర్ ఉష, తాడ్వాయి ఎం పీపీ వాణిశ్రీ తదితరులు మేడారంలో సమర్థవంతంగా పనిచేశారు.