మహదేవపూర్, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10గంటలకు సుమారు 40 ప్రత్యేక బస్సుల్లో 50 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో ఉన్న మేడిగడ్డకు రానున్నారు. బరాజ్లో కుంగిన పియర్లను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు.
బరాజ్పై పవర్పాయింట్ ప్రజంటేషన్(పీపీటీ) ఇవ్వనున్నారు. ఈమేరకు సుమారు 2వేల మంది కూర్చునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు మేడిగడ్డ వద్ద సభా ప్రాంగణం, వేదిక, హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. భద్రతా ఏర్పాట్లను సోమవారం ఐజీ శ్రీనివాస్, కలెక్టర్ భవేశ్మిశ్రా, ఎస్పీ కిరణ్ఖరే, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బరాజ్ పరిసరాలను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఈ సురేశ్, ఎంపీడీవో రవీంద్రనాథ్, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య పాల్గొన్నారు.