కాశీబుగ్గ, మార్చి 20 : వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మాడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సోమవారం ర్గంలోని 18వ డివిజన్లో రూ.4కోట్ల 18లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో ఇంట్లో పడుకున్న ప్రతిపక్ష నాయకులకు ప్రజలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు వద్దని పరకాలకు మాకాం మార్చినోళ్లు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారన్నారు. సదరు నాయకులను పరకాల ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియక ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ ప్రాంతాన్ని 68 ఏళ్లు పాలించిన ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. 8 ఏండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. జిల్లాలోనే ఎక్కువ నిధులు రూ.3800 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి 25వేల మందికి సొంతంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు చెప్పారు. హాస్పిటల్లో బెడ్స్, అవసరమైన వారికి అత్యవసర చికిత్స అందించినట్లు గుర్తు చేశారు. కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు గడ్డమీది రాజేశ్, జక్కం దాసు, గుండేటి శ్యాం, మనోహర్, ఫకృద్దీన్ పాల్గొన్నారు.
తెలంగాణ.. దేశానికి ఆదర్శం..
వరంగల్ చౌరస్తా : ప్రజా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. 27వ డివిజన్ పరిధిలోని బాపూజీ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న పెద్దల మాటను సీఎం కేసీఆర్ అక్షరాలా నిజం చేస్తున్నారన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఈ కార్యక్రమం వరంగా మారిందని చెప్పారు. త్వరలోనే డివిజన్లో మోడల్ బస్టాండ్, నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు చేపట్టనున్నామని తెలిపారు. గోవిందరాజుల గుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేశ్బాబు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు యాకూబ్ పాల్గొన్నారు.