మడికొండ, మార్చి 18: కట్టుకున్న భార్య, మామ తలపై కొట్టి.. ఆపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన అల్లుడి ఉదంతం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడిపికొండ శివారులోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో భాషబోయిన రాజశేఖర్(54) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. వంట పనితోపాటు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. 2012లో భార్య శ్రీలత గుండెపోటుతో మరణించడంతో ముగ్గురు కూతుళ్లు రాజశ్రీ, తేజస్వీ, మనోజ్ఞలను చూసుకుంటున్నాడు.
పెద్ద కూతురు రాజశ్రీ (24)కు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీకి చెందిన పొక్కుల ప్రవీణ్తో 2013 నవంబర్లో వివాహం జరగగా, వారు హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో నివాసం ఉండేవారు. ఏడాది క్రితం వరకు కలిసి మెలిసే ఉన్న వీరికి కుమారుడు జయాన్ష్, ఆరు నెలల పాప జయశ్వి దివిష జన్మించారు. పాప పుట్టినప్పటి నుంచి అదనపు కట్నం కావాలని రాజశ్రీని తరచూ ప్రవీణ్ వేధిస్తున్న నేపథ్యంలో తండ్రి వద్దే ఉంటున్నది. పాపకు అన్నప్రాసన చేయడం కోసం ప్రవీణ్ వారం రోజుల క్రితం రాజశేఖర్ ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున ప్రవీణ్ తన చుట్టుపక్కల వారితో పాటు కుటుంబ సభ్యులకు రాజశ్రీ, రాజశేఖర్ కాల్చుకుని చనిపోయారని సమాచారం అందించాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బందికి అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు చెప్పి వెళ్లిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజ్కుమార్, రాంమోహన్ మంటల్లో కాలిపోయిన రాజశ్రీ, రాజశేఖర్ మృతదేహాలకు పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. కాగా మృతుల తలలపై బలమైన ఆయుధంతో కొట్టినట్లు గాయాలుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిసింది. అయితే ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. కాగా రాజశ్రీ ఏడాదిన్నర కుమారుడు, ఆరు నెలల కూతురు తల్లి కోసం ఏడుస్తుంటే స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.