నర్సంపేట, సెప్టెంబర్ 7: పంట నష్టపరిహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను కించపరిచేలా మాట్లాడడం తగదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గంలో పంట దెబ్బతిన్న 32,500 మంది రైతులకు ఎకరానికి చొప్పున నష్టపరిహారంగా రూ.37.5కోట్ల చెక్కుల పంపిణీ చేస్తున్నామన్నారు. ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలతో 3వేల ఎకరాల్లో నష్టం జరిగిన 2,900 మంది రైతులను గుర్తించి కలెక్టర్కు నివేదిక సమర్పించామని తెలిపారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు అవగాహన లేకుండా రాద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. రెండుసార్లు పంట నష్టపోయిన 40వేల మంది రైతులను గుర్తించి పార్టీలకతీతంగా పరిహారం అందేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొమ్మిది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పూర్తిస్థాయిలో రైతుల వివరాలు ప్రాసెస్ కాలేదన్నారు.
ఈ జాబితాలో పేరు లేని వారికి రైతు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల పంపిణీలో న్యాయం చేస్తామన్నారు. ల్యాండ్ లేకున్నా డబ్బులు పొందిన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరామని, కలెక్టర్ ఆదేశాలతో మూడు ఎకరాలకు పైన ఉన్న ల్యాండ్ వివరాలపై రీ వెరిఫికేషన్ జరుగుతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు ఏం చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు పంట నష్టపోయిన చెక్కులు రాలేదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. 2014లో కురిసిన వడగండ్లతో పంటలు నష్టపోయిన నెక్కొండ, చెన్నారావుపేట మండలాలకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదని, కేంద్ర మంత్రి బలరాంనాయక్ను తీసుకువచ్చి ఏపాటి పరిహారం అందించారో ప్రజలకు తెలుసన్నారు. రెండు సార్లు పంట రైతులకు తాను పార్టీలకతీతంగా బాధిత రైతులకు పరిహారం అందించానని చెప్పారు. 40వేల మంది రైతుల వివరాలు పొందుపరిచినప్పుడు టెక్నికల్గా సమస్యలు వస్తుంటాయని తెలిపారు. ఆయా రైతులు అధైర్య పడొద్దని, టెక్నికల్ సమస్యలను చూసి వారికి న్యాయం చేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు బత్తిని శ్రీనివాస్గౌడ్, కంది కృష్ణారెడ్డి, ఎండీ రఫీ, కంది కృష్ణచైతన్య, సమ్మయ్య, రమేశ్, రామగిరి యాదగిరి పాల్గొన్నారు.