ఖానాపురం, డిసెంబర్ 25: రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రాగంపేటలో రూ. 50 లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గ్రామాల్లో అంతర్గత, ఆర్అండ్బీ, పీఆర్, ఐటీడీఏ రోడ్ల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో సీసీరోడ్ల నిర్మాణానికి రూ. 15 కోట్లు, వర్షాలకు దెబ్బతిన్న ఆర్అండ్బీ రోడ్ల బీటీ ప్యాచ్ పనులకు రూ. 24 కోట్లు, పీఆర్రోడ్ల రెన్యువల్ను సంపూర్ణంగా పూర్తి చేసేందుకు రూ. 25 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుంచి 86 కిలో మీటర్ల నిడివి గల బీటీరోడ్లు మంజూరు చేసుకున్నామని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖలో నూతన రోడ్ల నిర్మాణానికి మరో రూ. 22 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఇవన్నీ టెండర్ ప్రక్రియలో ఉన్నాయన్నారు. జనవరి 15 వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రోడ్ల నిర్మాణ పనులపై ఇప్పటికే అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. అంతర్గత, బీటీ, తండాలకు కొత్త రోడ్ల నిర్మాణ పనులన్నీ ఏకకాలంలో పూర్త్తవుతాయని చెప్పారు.
నియోజకవర్గానికి అత్యధిక నిధులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులను నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి చెప్పారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అడిగిన అన్ని రోడ్లకూ వందశాతం నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఈ సందర్భంగా వారికి పెద్ది కృతజ్ఞతలు తెలిపారు. పనులన్నీ పూర్తయితే నియోజకవర్గవ్యాప్తంగా అద్దంలా మెరిసే రోడ్లు మన కళ్లెదుటే సాక్షాత్కరిస్తాయన్నారు. అనంతరం రాగంపేట సర్పంచ్ బాషబోయిన ఐలయ్య ఇంట్లో క్రిస్మస్ వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఉపసర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు, కార్యదర్శి వరుణ్, రాజేశ్వర్రావు, రామకృష్ణ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: మండలంలోని లక్నేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల రాంబాబుగౌడ్, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోతె జైపాల్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పాత్కాల కొమ్మాలు పాల్గొన్నారు.