వరంగల్ : నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో మహిళా సంఘాల భవన నిర్మాణం కోసం అధికారులు ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేయాలి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నర్సంపేట రెవెన్యూ అధికారులు, ఏపీఎం బాధ్యులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సమీక్ష సమావేశం నిర్వహించారు.
మహిళా సంఘాల ఆర్థిక పరిపుష్టి, సంఘాలకు కావాల్సిన సొంత భవనాలకు సంబంధించి చర్చించారు. అనంతరం నియోజకవర్గ ఎమ్మార్వోలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఐకేపీ ఏపీఎం, సీసీలతో శాశ్వత భవనాల స్థల సేకరణ, నిర్మాణ విషయమై టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నర్సంపేట నియోజకవర్గంలో మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా మహిళల ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఒక వివో బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.
ఇప్పటివరకు గత పాలకుల పుణ్యాన 179 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 12 చోట్ల మాత్రమే మహిళా బిల్డింగ్ లో ఉండడం బాధాకరం అన్నారు.
వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి 179 గ్రామపంచాయతీలో లోనే గ్రూపుల సంఖ్యను, వివోల సంఘాలను పరిగణలోకి తీసుకొని ప్రతి గ్రామంలోని మహిళా సంఘాలకు నూతన భవనాలను తీసుకువచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
ముందుగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి వివో బిల్డింగ్ లకు ప్రాధాన్యతనిస్తూ ఆ భూములను సర్వే చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని మహిళా సంఘాలను అన్నివిధాలుగా అభివృద్ధి పరుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.