జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కాలరీస్ కంపెనీలో యువరక్తం చేరేలా చర్యలు తీసుకున్న ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇైంక్లెన్లో బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టిన వారసత్వ ఉద్యోగాల హక్కును కేసీఆర్ తిరిగి సాధించి సింగరేణిలో యువ రక్తాన్ని నింపారన్నా రు. ఈఎఫ్ఐఆర్ పేరుతో సంస్థకు రూ.500కోట్లు ఇప్పించామని పేర్కొంటూ వారసత్వ హక్కును తాకట్టు పెట్టారని, అటు కోలిండియాలో ఇటు సింగరేణిలో ఈ హ క్కును లేకుండా చేశారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేసీఆర్ వారసత్వ ఉద్యోగాల హక్కును పునరుద్ధరించి 125 మెడికల్ బోర్డులను ఏ ర్పాటు చేసి 1,213 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించారని తెలిపారు. గతంలో నెలకు 25 మంది డిపెండెంట్లకు మాత్రమే ఉద్యోగాలు ఇప్పించేవారని, టీబీజీకేఎస్ నెలకు 270 మందికి ఇప్పించిందన్నారు. ఎక్స్టర్నల్ ఉద్యోగాలు 4వేలు, తెలంగాణ ఇంక్రిమెంట్ సైతం ఇప్పించామని చెప్పారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ర్టాల్లో తెలంగాణ లాంటి ఇంక్రిమెంట్ ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు.
మెడికల్ బోర్డుల్లో అవినీతి జరుగుతున్నదని జాతీయ సంఘాలు పేర్కొనడం సిగ్గుచేటని, ప్రతి గనికి నలుగురు, ఐదుగురు ఎర్రజెండా ఏజెంట్లే మెడికల్ బోర్డులకు పైరవీ చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగం ఇప్పించడంతో పాటు కార్మికుడు చనిపోతే అతడి కుటుంబం ఉద్యోగం వద్దు అనుకుంటే రూ.25లక్షలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ హక్కు కోలిండియాలో లేదని, అక్కడ కేవలం భార్యకు ఎంఎన్సీ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కార్మికుడి తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇది కోలిండియాలో లేదని, అంబేద్కర్ జయంతి సందర్భంగా సింగరేణిలో వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు చెప్పారు. ఐఐటీ చదివే విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పిస్తున్నామని, ఈ హక్కు సైతం కోలిండియాలో లేదన్నారు. కొత్త వేజ్బోర్డులో అండర్గ్రౌండ్ అలవెన్స్పై ఎందుకు సీలింగ్ పెట్టాల్సి వచ్చిందని, ఆరు, ఏడు వేజ్బోర్డుల దాక ఈ సీలింగ్ లేదన్నారు. 2021 జూలై 1 నుంచి ఆ రోజు ఉన్న బేసిక్పై వే సిన అలవెన్స్ ఐదేళ్ల దాకా పెరుగకుండా జాతీయ సం ఘాలు ఒప్పందం చేసుకున్నాయని గుర్తు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్మికులకు హెచ్ఆర్ఏ ఎంత అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారని, వేజ్బోర్డు రాక ముందు 9 శాతం, ఇప్పుడు 8 శాతం ఉందని చెబుతున్నారని, కాగితాల్లో మాత్రం 10శాతం ఉందని, మరి ఈ 10శాతం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఎర్ర జెండా సంఘం నాయకుల పోరాట పటిమ ఏమైందని, హక్కుల సాధన కోసం ఎందుకు సమ్మె నోటీసులు ఇవ్వడం లేదన్నారు.
ఇన్కం ట్యాక్స్ పేరుతో సింగరేణి కా ర్మికులు వేలాది రూపాయలు వేతనాల్లో నష్టపోతున్నారని, టీబీజీకేఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రికవరీ చే సిన డబ్బులను సంస్థ తిరిగి చెల్లించేలా చూస్తామన్నారు. పెర్క్ ట్యాక్స్ సైతం వచ్చేలా కృషి చేస్తామన్నారు. గతంలో తండ్రి ఉద్యోగం కొడుకుకి వస్తే రీజియన్లు చేంజ్ చేసేవారని, ఇప్పుడు తండ్రి ఉద్యోగ విరమణ పొందిన చోటే కొడుకుకు ఉద్యోగం ఇచ్చి అదే క్వార్టర్లో నివసించేలా చూస్తున్నామన్నారు. అవసరమైన వారికి ఏసీ, కరెంటు సైతం ఉచితంగా ఇప్పించామన్నారు. త్వరలో సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సింగరేణిలో 300 లీవ్ల వరకు అధికారి అమ్ముకునే హక్కును కల్పించారని, కార్మికుడి విషయంలో మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారని, ఇది జాతీయ సంఘాల వైఫల్యమేనని విమర్శించారు. కోలిండియాలో లేని హక్కులను టీబీజీకేఎస్ సాధించిందని, అయినప్పటికీ టీబీజీకేఎస్ను విమర్శించి లబ్ధిపొందాలని జాతీయ సంఘాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కార్మిక వర్గం ఆలోచించి టీబీజీకేఎస్ బాణం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సింగరేణి మనుగడ టీబీజీకేఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో పిట్ సెక్రటరీ కొచ్చర్ల రవి, నాయకులు మల్లారెడ్డి, రఘోత్తంరెడ్డి, జిక్కరెడ్డి, దేవరకొండ మధు, గౌరీపతి శర్మ, ఆసరి శ్రీనివాస్, కుమార్, అవినాష్, సమ్మిరెడ్డి, సాంబయ్య, రాజిరెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు.