వరంగల్ : వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలను టూరిజం హబ్ (Tourism hub) గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha) అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కుడా, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలతో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించిందని వివరించారు.
నియోజకవర్గాల శాసనసభ్యుల సమన్వయంతో అవసరమైన అత్యవసర పనులు చేపట్టడానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కొనసాగుతున్న పనులలో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. రంగ సముద్రం బండ్ సుందరీకరణ పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. రూ.75 కోట్లతో ఏర్పాటు చేస్తున్న వరంగల్ బస్ స్టేషన్ (Bus Stations) నిర్మాణ పనులను, భద్రకాళి మాడా విధుల పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
గ్రేటర్ వరంగల్ లో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.