బయ్యారం, ఆగస్టు 18 : మనం హాయిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ బతుకుతున్నామంటే దానికి కారణం సైనికులు. వారు తమ కుటుంబాలను విడిచి రాత్రింబవళ్లు కళ్లలో వత్తులేసుకొని దేశాన్ని కాపాడుతుంటేనే మనం గుండెలపై చేయివేసుకొని కంటినిండా నిద్రపోగలుగుతున్నాం.. ఇలా దేశ సేవలో బయ్యారం నుంచి 40మందికిపైగా యువకులు పాలుపంచుకుంటున్నారు. ఒకే ఊరిలో ఇంటికి ఇద్దరు చొప్పున ఆర్మీలో చేరి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
పోరాటాల పురిటి గడ్డ బయ్యారం సైనికుల అడ్డాగా నిలిచింది. ఊరిలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదాన్ని ఆదర్శంగా తీసుకున్న వ్యవసాయ కుటుంబానికి చెందిన యార్లగడ్డ నాగభూషణం, బొబ్బలి సాంబిరెడ్డి, పానుగంటి నర్సిరెడ్డి, కొల్లా వెంకటేశ్వరావు వంటి వారు 40ఏళ్ల క్రితమే ఆర్మీలో చేరి దేశ సేవ చేసి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి వారిని ఆదర్శంగా తీసుకున్న స్థానిక యువకులు సైనికుడిగా విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపుతున్నారు. బయ్యారంలో ఆర్మీ రిటైర్డ్ సిబ్బంది 15మంది ఉండగా, ప్రస్తుతం పనిచేస్తున్నవారు 40మందికి పైగా ఉన్నారు. తమ కొడుకులు ఆర్మీలో చేరేందుకు తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తున్నారు.
ఒకే ఇంట్లో ఇద్దరు
బయ్యారంలోని కాకతీయ నగర్కు చెందిన నంది అమృతరెడ్డి, రమణ దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ప్రభాకర్ 2005లో ఆర్మీలో చేరగా, మరో కుమారుడు రమేశ్ రెడ్డి 2010లో ఆర్మీలో చేరాడు. తుపాకుల లక్ష్మీనారాయణ, అలివేలు దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఓ కొడుకు సతీశ్ 2007లో, మరో కొడుకు రాజు 2012లో ఆర్మీలో చేరారు. బొల్లగాని యాకయ్య 1985లో ఆర్మీలో చేరి 2009లో హవాల్దార్గా రిటైర్డ్ కాగా, ఆయన కొడుకు కిరణ్ సైతం 18ఏళ్లకే ఆర్మీ ఆఫీసర్గా డెహ్రాడూన్, పుణెలో శిక్షణ పొంది లెఫ్ట్నెంట్ కల్నల్గా, కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇలా ఒకే ఇంట్లో ఇద్దరు చొప్పున జవాన్లు ఉండి ఊరికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
సైనిక్ అకాడమీని స్థాపించిన బయ్యారం వాసి
బయ్యారానికి చెందిన కొల్లా వెంకటేశ్వర్లు 1983 ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం మొదటి ప్రయత్నంలోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సెకండ్ లెఫ్ట్నెంట్ ర్యాంకు పొంది ఆర్మీలో చేరాడు. విధుల్లో ప్రతిభ చూపుతూ అంచెలంచెలుగా ఎదిగాడు. 36 ఏళ్లపాటు దేశసేవ చేసి 2019లో లెఫ్ట్నెంట్ కల్నల్గా రిటైరయ్యాడు. తుదిశ్వాస వరకూ దేశ సేవ కోసం యువతను అందించాలన్న లక్ష్యంతో ఖమ్మంలో ‘ద్రోణ డిఫెన్స్ అకాడమీ’ని స్థాపించాడు. ఈ అకాడమీలో ప్రస్తుతం 70 మంది శిక్షణ పొందుతున్నారు.
పర్వతారోహణలో రికార్డు..
బయ్యారం మండల కేంద్రంలోని ముస్తాఫానగర్కు చెందిన బండి సురేశ్ 2012లో ఆర్మీలో చేరాడు. జమ్మూలో 21,514 మీటర్ల ఎత్తు ఉండే సియాచిన్ నార్తెన్ ైగ్లెసెల్ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సాధించాడు. ఇందుకోసం 22 రోజుల పాటు కఠోర శిక్షణ పొందాడు. -50 డిగ్రీల ఉప్ణోగ్రతలోనూ అత్యంత ఎత్తయిన పర్వతాన్ని ఎక్కిన సురేశ్ మండలానికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చాడు.
బార్డర్లో బ్రాహ్మణకొత్తపల్లి వాసులు
నెల్లికుదురు, ఆగస్టు 18 : ఈ గ్రామం నుంచి ఒకరిద్దరు కాదు.. ఏకంగా 10 మంది బార్డర్లో సైనికులై దేశరక్షణలో భాగస్వాములవుతున్నారు. నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లికి చెందిన పది మంది ఆర్మీలో మరో ఐదుగురు పోలీస్శాఖలో పనిచేస్తూ గ్రామానికి గుర్తింపు తెచ్చారు. గ్రామంలో మొదట నిలుగొండ యాకాంబ్రం సీఆర్పీఎఫ్ జవాన్గా చేరాడు. ఆతడిని ఆదర్శంగా తీసుకున్న మహ్మద్ రహీంపాషా సీఆర్పీఎఫ్ ఉద్యోగం సాధించాడు. ఇలా ఒకరి స్ఫూర్తితో మరొకరు మొత్తం పది మంది ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తున్నారు. కొవిడ్ కష్టకాలంలో గ్రామంలో చిక్కిపోయిన పలువురు జవాన్లు గ్రామస్తులకు మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా అందించారు. యాకాంబ్రం, రహీంపాషాతో పాటు పిడుగు రవి, పిడుగు సుమన్, తాళ్ల రమేశ్, జీ నరేందర్, షేక్ బషీర్, లవిశెట్టి మహేశ్, ఎస్కే ఉస్మాన్ దేశ సేవలో పాలుపంచుకుంటున్నారు. పిడుగు చంద్రయ్య, పెరుమాండ్ల మురళి, వీ సోమయ్య, మాదగాని కృష్ణ, మాదగాని సంతోష్ పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు.
చాలా గర్వంగా ఉంది : పిడుగు రవి
ఎండనకా వాననకా దేశ రక్షణలో భాగస్వామిని కావడం చాలా గర్వంగా ఉంది. ఎనిమిది నెలలకోసారి మాత్రమే ఇంటి వచ్చే అవకాశం ఉంటుంది. దేశ సరిహద్దుల్లో ఎలాంటి సౌకర్యాలు లేని ప్రతికూల ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తుంటాం. మా ఊరినుంచే 10 మంది సైనికులు ఉండడం చాలా గొప్పగా అనిపిస్తుంటుంది.
నేడు జవాన్లకు సన్మానం
బయ్యారం, అగస్టు 18: భరతమాత సేవలో తరిస్తున్న సైనికులకు నేడు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ మూల మధుకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని దేశ రక్షణకోసం పాటుపడుతున్న జవాన్ల సేవలను గుర్తించి, బయ్యారం, వెంకట్రాంపురం, లక్ష్మీనర్సింహపురం, కొత్తపేట, సింగారం గ్రామాలకు చెందిన సుమారు 60 మంది సైనికులు, రిటైర్డ్ సైనికులు, వారి కుటుంబాలను సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ శశాంక, జడ్పీచైర్పర్సన్ బిందు, ఎస్పీ శరత్చంద్ర పవర్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.