పోచమ్మమైదాన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇన్నోవేషన్ సెల్ ద్వారా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నూతన ఆవిష్కరణలు, డిజైన్ ఆలోచనలు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని, గతేడాది జిల్లాలో 150 పాఠశాలల్లో విజయవంతంగా జరిగిందని పేర్కొన్నారు.
ఈ విద్య సంవత్సరంలో స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021ను అక్టోబర్, నవంబర్ మాసాల్లో నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని వివరించారు. కార్యక్రమంలో అన్ని పాఠశాలలు అధిక సంఖ్యలో పాల్గొని నూతన ఆవిష్కరణలు పంపించి, వరంగల్ జిల్లాకు మంచిపేరు తీసుకరావాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో వాసంతి, కలెక్టరేట్ ఏవో రాజేంద్రనాథ్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.