పోచమ్మమైదాన్, డిసెంబర్ 22: బాల్యం నుంచీ రచనలే శ్వాసగా, ధ్యాసగా చేసుకొని.. నిజ జీవిత ఘటనలు.. సంఘర్షణలను ప్రపంచం ముందుంచేందుకు అక్షరాలనే కాంతులుగా వెలిగించి..సాహితీ లోకంలో అంచెలంచెలుగా ఎదిగిన నవలా శిఖరమాయన.. తాను రాసిన తొలి నవలనే ఇంటిపేరుగా మార్చుకుని.. సాహిత్యరంగంలో నిరంతరాన్వేషియై అక్షర క్షిపణిలా దూసుకెళ్తూ నేడు 80 వసంతాలు పూర్తిచేసుకున్నారు. నేడు అంపశయ్య నవీన్ జన్మదినం సందర్భంగా నమస్తే ప్రత్యేక కథనం..
వ్యవసాయ కుటుంబంలో 1941 డిసెంబర్ 24న జన్మించిన నవీన్ స్వగ్రామం ప్రస్తుత జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల. ఆయన తల్లిదండ్రులు దొంగరి నారాయణ, పిచ్చమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేశారు. కరీంనగర్, వరంగల్లో లెక్చరర్గా పనిచేశారు. నాలుగో తరగతిలోనే రత్నాకరుడు పేరుతో కథలు రాయడం మొదలు పెట్టారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నపుప్పుడు ఓ లిఖిత మాసపత్రికకు సంపాదకత్వంలో అడుగు పెట్టారు. ఇదే క్రమంలో తొలినాళ్లలో రచించిన ముళ్లపొదలు, అంతస్స్రవంతి, రవి నవలాత్రయాలు సాహితీరంగంలో సుస్థిర స్థానం సంపాదించాయి. 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ‘కాలరేఖలు’ తెలంగాణ రైతాంగ పోరాటం ఇతివృత్తంగా వచ్చి అందరూ మెచ్చిన నవలగా పేరొందింది. ఆనాడు నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఘర్షణలో బలవుతున్న అమాయకుల సమస్యలను ధైర్యంగా ‘రక్తకాసారం’ పేరిట నవలగా తెచ్చి గుర్తింపుపొందారు. ఆయన రాసిన ‘విచలిత’ ్రస్త్రీకో నీతిని, పురుషుడికో నీతిని అమలు చేసే పితృస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తుంది. ‘సౌజన్య’ నవల ద్వారా స్వచ్ఛమైన ప్రేమను ఆవిష్కరించారు.
పైకి పోట్లాడుకుంటున్నా యువతీయువకుల మధ్య ఏర్పడే బలీయమైన బంధాన్ని ‘కరుణ’ ద్వారా చూపించారు. ప్రైవేట్ టీచర్లను పాఠశాలల యాజమాన్యాలు ఎలా వేధిస్తాయో ‘ప్రత్యూష’ నవలతో కళ్లకుగట్టారు. భార్యాభర్తలు కలిసి జీవించడం నరకప్రాయమైనప్పుడు విడిపోవడమే శ్రేయస్కరమని ‘చీకటి మూసిన ఏకాంతంలో’ వివరించారు. నిజ జీవిత ఘటనలు, మార్పులు, లాభాలు, నష్టాలను ఇతివృత్తాలుగా చేసుకొని వందలాది నవలలు రాసి పాఠకులకు అందించారు. ఇప్పటివరకు ఆయన 31నవలలు, 80కి పైగా కథలు, మరో వందకు పైగా పుస్తకాలు, విమర్శనా వ్యాసాలు రాయగా, ఆయన రచనలు అనేకం హిందీ, ఇంగ్లిష్, తమిళం, కన్నడ, మరాఠీలోకి అనువాదమయ్యాయి. నవీన్ సాహిత్యంపై నిర్వహించిన సెమినార్లు, టీవీ సీరియల్స్గా పేరొందాయి. అంపశయ్య నవల ఆధారంగా ప్రఖ్యాత దర్శకుడు ప్రభాకర్ జైనీ ‘ క్యాంపస్ అంపశయ్య’ పేరుతో సినిమాను రూపొందించారు. నవీన్ రచనలపై కాకతీయ, ఉస్మానియా, శ్రీవెంకటేశ్వర, నాగార్జున యూనివర్సిటీల విద్యార్థులు పరిశోధక వ్యాసాలు సమర్పించి పీహెచ్డీ, ఎంఫిల్ పట్టాలు పొందారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కాళోజీ పురస్కారంతో పాటు దేశ, విదేశాల్లో ఎన్నెన్నో అవార్డులు అందుకుంటున్న ప్రముఖ కవి, సాహితీవేత్త అంపశయ్య నవీన్ అంటే తెలియని వారుండరు.. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో వెలువడిన వేలాది గ్రంథాల్లో నుంచి ఏర్చికూర్చిన వంద ఆణిముత్యాల్లో ‘అంపశయ్య’కు చోటు దక్కడం తెలంగాణకు లభించిన విశేష గుర్తింపుగా చెప్పుకోవచ్చు. నేడు 80వ జన్మదిన వేడుకలను జరుపుకోనున్న ఆయన, తాను రచించిన ‘నవీన్ సాహితీ మూర్తిమత్వం’, ‘స్నేహరాగం గ్రంథాలను ఆవిష్కరించనున్నారు.
‘కాలరేఖలు’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
బాల్యంలో నవీన్ వరంగల్లో జరిగిన 11వ ఆంధ్రమహాసభను చూశాడు. సభ ప్రారంభోత్సవంలో అలంకరించిన 11జతల ఎద్దుల బండిలో సభాప్రముఖులను ప్రాంగణానికి చేరవేసిన సందర్భం నవీన్పై చెరగని ముద్రవేసింది. యువకుడిగా సాహిత్వంతో పరిచయమేర్పడినప్పుడు ఈ ఊరేగింపు సన్నివేశాన్నే ప్రారంభ సన్నివేశంగా తీసుకొని ఓ పెద్ద నవల రాయాలని అనుకున్నాడు. అదే ‘కాలరేఖలు’ నవలకు బీజం వేసింది. 1996లో అధ్యాపక వృత్తికి విరమణ చేశాక, నవీన్ ఈ నవల రాయడం మొదలు పెట్టాడు. 1944 నుంచి 1995 వరకు తెలంగాణ ప్రాంత సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టే ‘కాలరేఖలు’ 1600కు పైగా పేజీలతో కూడింది. దీన్ని పాఠకుల సౌలభ్యం కోసం ‘కాలరేఖలు’, ‘చెదిరిన స్వప్నాలు’, ‘బాంధవ్యాలు’ అనే నవలాత్రయంగా విడుదల చేశారు. 2004లో కాలరేఖలు రచనకు గాను అంపశయ్య నవీన్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన అసలు పేరు దొంగరి మల్లయ్య కాగా తాను రాసిన ‘అంపశయ్య’నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.
స్వచ్ఛంద సంస్థల బాధ్యత
1978లో కొందరు మిత్రులతో కలిసి ‘కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ’ని ఏర్పాటు చేసి ఆ సంస్థకు నాలుగేళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సొసైటీకి సొంత థియేటర్ కూడా ఉంది. ఇందులో అనేక జాతీయ, అంతర్జాతీయ సినిమాలను ప్రదర్శించి ఉత్తమ సినిమాల అభివృద్ధికి తోడ్పడ్డారు. 1987 నుంచి నవీన్ ‘వరంగల్ ఫిల్మ్ సొసైటీ’ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ‘ఇండో అమెరికన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ హైదరాబాద్’, ‘వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం అకడమిక్’ సభ్యులుగా ఉన్నారు. వరంగల్లోని సృజనాలోకం (రైటర్స్ కార్నర్) అధ్యక్షుడిగా, ప్రపంచశాంతి పండుగ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
పుట్టిన రోజు సందర్భంగా రెండు పుస్తకాల ఆవిష్కరణ
అంపశయ్య నవీన్ ఏటా తన పుట్టిన రోజు సందర్భంగా తాను రచించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించడం ఆనవాయితీగా చేసుకున్నారు. 2001 నుంచి ఇప్పటి వరకు 40 పుస్తకాలు విడుదల చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం అంపశయ్య నవీన్ లిటరసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన గ్రంథం, నవలను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో ‘నవీన్ సాహితీ మూర్తిమత్వం’ గ్రంథాన్ని ఆచార్య బన్న అయిలయ్య, ‘స్నేహరాగం’ నవలను ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి ఆవిష్కరిస్తారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలోని నవీన్ రెసిడెన్సీ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు రామా చంద్రమౌళి, వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, గిరిజామనోహర్బాబు, డీ స్వప్న పాల్గొంటారు.
వరించిన పురస్కారాలు..